దేశ ఆర్థిక వ్యవస్థపై భారతీయులకు నమ్మకం తగ్గింది: రఘురాం రాజన్ కీలక వ్యాఖ్య
భారతీయులకు ఇటీవలి సంవత్సరాల్లో దేశ ఆర్థిక భవిష్యత్తు పట్ల విశ్వాసం సన్నగిల్లిందని, కరోనాతో అది మరింత దిగజారిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. దీంతో చాలామంది మధ్య తరగతి ప్రజలు పేదరికంలో కూరుకుపోయారన్నారు. నల్సార్ లా యూనివర్సిటీ వర్చువల్ సదస్సులో ఆయన పాల్గొని, మాట్లాడారు. స్టాక్ మార్కెట్ ర్యాలీ ఎంతోమంది భారతీయులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారనే వాస్తవాన్ని ప్రతిబింబించడం లేదన్నారు.
ఆర్థిక ఫథకాలు ఏవైనా ఉపాధి కల్పించేవిగా ఉండాలని, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల్లో ఇండియా చేరవలసిన అవసరం ఉందన్నారు. ఇటీవలి కాలంలో ఆత్మవిశ్వాసం కాస్త తగ్గిందని, ఆర్థిక భవిష్యత్తుపై నమ్మకం తగ్గిందని చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను భారత జీడీపీ వృద్ధి రేటును9.5 శాతంగా అంచనా వేసింది. అంతకుముందు 10.5 శాతంగా అంచనా వేసింది. దీనిని 9.5 శాతానికి తగ్గించింది. వచ్చే ఏడాది 8.5 శాతంగా ఉంటుందని అంచనా వేస్తోంది.
కరోనా మహమ్మారి సమయంలో ఆర్థిక కార్యకలాపాలన్నీ దెబ్బతిని వ్యవస్థలో ద్రవ్యలభ్యత సమస్య ఏర్పడింది. ఈ సమయంలో ఆర్బీఐ రంగంలోకి దిగి సమస్యలను పరిష్కరించేందుకు అనేక చర్యలు చేపట్టింది. వడ్డీరేట్లను తగ్గిస్తూ ద్రవ్యపరపతి విధానంలో సర్దుబాటు వైఖరిని కొనసాగించారు. ప్రభుత్వ ఉద్దీపనలతో పాటు ఆర్బీఐ తరఫున ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా లోన్ మారటోరియం మంచి ఫలితాలు ఇచ్చింది. దీనిని రూపొందించిన విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ఎంఎస్ఎంఈలను ఆదుకోవడానికి ప్రత్యేక మినహాయింపులు ప్రకటించారు. చిన్న వ్యాపారులకు కూడా బ్యాంకులు అండగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగారు. ఆర్బీఐ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగి ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నాయి.