ఏప్రిల్ నెలలో భారత్ ఎగుమతులు సరికొత్త రికార్డుని తాకాయి. అన్ని రంగాల్లోను ఎగుమతులు పెరిగాయి. దీంతో ఎగుమతుల్లో ఏకంగా 197 శాతం వృద్ధి నమోదయింది. మర్చంటైజ్డ్ ఎగుమతులు గత నెలలో 3,021 కోట్ల డాలర్లుగా నమోదయింది. ఎగుమతులు రికార్డ్ స్థాయిలో పెరిగి ద్రవ్యలోటు 1,524 కోట్ల డాలర్లకు పెరిగింది. 2020 ఏప్రిల్ నెలలో ఎగుమతులు కేవలం 1,017 కోట్ల డాలర్లు మాత్రమే. ఏడాది ప్రాతిపదికన మూడురెట్లు పెరిగింది.

ఈ ఎగుమతులు జంప్
ఇంజినీరింగ్, వజ్రాభరణాలు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు పెరగడంతో గణనీయవృద్ధి నమోదయింది. ఈ మేరకు ఆదివారం వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దిగుమతులు కూడా 3 రెట్లు పెరిగి 4,545 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. 2020 ఏప్రిల్ నెలలో ఇది 1,709 కోట్ల డాలర్లుగా మాత్రమే ఉంది. దీంతో వాణిజ్య లోటు 692 కోట్ల డాలర్ల నుండి 1,524 కోట్ల డాలర్లకు చేరుకుంది. గత ఏడాది లాక్డౌన్ నేపథ్యంలో ఎగుమతులు 60 శాతానికి పైగా వరకు తగ్గాయి. ఈ ఏడాది మార్చి నెలలో 60.29 శాతం పెరిగి 3,445 కోట్ల డాలర్లకు చేరుకుంది. 2021 ఏప్రిల్ నెలలో చమురు దిగుమతులు 1,080 కోట్ల డాలర్లుగా కాగా, గత ఏడాది ఇదే కాలంలో 465 కోట్ల డాలర్లుగా ఉంది.

ఎగుమతులు మరింతగా...
ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, రవాణా పరికరాలు, ఖనిజాలు, యంత్ర సామగ్రి, టెక్స్టైల్ యార్న్, వంటనూనె, ఇనుము, ఉక్కు దిగుమతులు పెరిగాయి. ఎగుమతిదారుల ఆర్డర్ బుకింగ్ స్థితి మెరుగ్గా ఉండడాన్ని ఈ వృద్ధి ప్రతిబింబిస్తోందని భారత ఎగుమతిదారుల సంఘాల సమాఖ్య ప్రెసిడెంట్ శరద్ కుమార్ సరాఫ్ అన్నారు. భారత్లో పరిస్థితులు క్రమంగా మెరుగు పడుతుండటం ఎగుమతుల వృద్ధికి దోహదపడుతుందన్నారు.

బంగారం దిగుమతులు డబుల్ కంటే ఎక్కువ
ఇంజినీరింగ్ ఎగుమతులు 555 కోట్ల డాలర్లు, వజ్రాభరణాలు 330 కోట్ల డాలర్లు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 212 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. బంగారం దిగుమతులు 612 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. 2020 ఏప్రిల్ నెలలో ఇది కేవలం 283 కోట్ల డాలర్లు మాత్రమే.


Click it and Unblock the Notifications