ప్రభుత్వానికి భారీగా తగ్గిన ట్యాక్స్ రెవెన్యూ, కార్పోరేట్ రెవెన్యూ తగ్గుదల 23.2 శాతం
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ప్రభుత్వ పన్నులు 32.6 శాతం మేర క్షీణించాయి. కరోనా మహమ్మారి వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఇది నిదర్శనం. 1999 నుండి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఓ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో ఇది హయ్యెస్ట్ ఆర్థిక లోటు. కరోనా మహమ్మారి కారణంగా దాదాపు మూడు నెలల పాటు లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో వివిధ రంగాలపై ప్రభావం పడటంతో పాటు ప్రభుత్వ ఆదాయం కూడా పెద్ద మొత్తంలో తగ్గింది.
1970 తర్వాత అత్యంత దారుణంగా దెబ్బతిన్న ఆ దేశ ఆర్థిక వ్యవస్థ
జీఎస్టీలో భారీ తగ్గుదల
కరోనా కారణంగా రెవెన్యూ తగ్గింది. అలాగే ఏప్రిల్-జూన్ క్వార్టర్లో వార్షిక లక్ష్యంలో ఆర్థిక లోటు 83.2 శాతానికి చేరుకుంది. రెవెన్యూ తగ్గుదలలో సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(GST)పై గరిష్టంగా 53 శాతం దెబ్బపడింది. ఈ మేరకు శుక్రవారం డేటా విడుదలైంది. వినియోగం పెద్ద ఎత్తున పడిపోవడంతో ప్రభావం పడిందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో జీడీపీ వృద్ధి 40 శాతం మేర క్షీణించవచ్చునని అంచనాలున్నాయి. ఫస్ట్ క్వార్టర్ జీడీపీ అంచనాలు ఆగస్ట్ 31వ తేదీన విడుదల కానున్నాయి.
క్రమంగా పుంజుకుంటున్న కార్యకలాపాలు
ఆదాయం తగ్గిన నేపథ్యంలో వివిధ కార్యకలాపాల కోసం ప్రభుత్వం అఫ్పులను రికార్డ్స్థాయిలో రూ.12 లక్షల కోట్లకు పెంచింది. అయితే జూన్లో గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ 23 శాతం తగ్గింది. దీంతో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నట్లుగా వెల్లడవుతోంది. మే నెల నుండి క్రమంగా వ్యాపారాలు తెరుచుకున్నాయి. దీంతో జూన్ నెలలో ట్యాక్స్ రెవెన్యూ కాస్త పుంజుకుంది. జూన్ నెలలో సెంట్రల్ జీఎస్టీ 14.8 శాతం తగ్గింది. మే నెలలో గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ 41 శాతం మేర పడిపోగా, జూన్ నెలకు 23 శాతానికి తగ్గింది. అన్ లాక్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందనడానికి ఇది నిదర్శనం అంటున్నారు.
23.2 శాతం తగ్గిన కార్పోరేట్ ట్యాక్స్
ఏడాది ప్రాతిపదికన ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కార్పోరేట్ ట్యాక్స్ రెవెన్యూ 23.2 శాతం తగ్గింది. ఉద్యోగాల కోత, వేతనాల కోత నేపథ్యంలో ఇన్కం ట్యాక్స్ కలెక్షన్లు 36 శాతం తగ్గాయి. జూన్ మాసంలో పర్సనల్ ట్యాక్స్లో స్వల్ప వృద్ధి కనిపించింది. ఇక, ప్రభుత్వం ఖర్చులకు సంబంధించి FY21 తొలి క్వార్టర్లో అంచనాలు 26.8 శాతం అంచనా కాగా, గత ఏడాది ఇది 25.9 శాతంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఆదాయాలు లేవని, దీంతో ప్రభుత్వం ఖర్చుల్లోను గణనీయమైన పెరుగుదల లేదని ఇది సూచిస్తోంది. ఆదాయాలు తక్కువ ఉండటం వల్ల ఇది ఆర్థిక ఒత్తిడికి నిదర్శనమని చెబుతున్నారు.