పెరిగిన ఎగుమతులు, భారత వాణిజ్య లోటు 20.88 బిలియన్ డాలర్లు
దేశ ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసాన్ని సూచించే వాణిజ్య లోటు ఫిబ్రవరి నెలలో భారీగా పెరిగింది. 2022 ఫిబ్రవరి నెలలో ఇది 20.88 బిలియన్ డాలర్లుగా నమోదయింది. గత ఏడాది (2021) ఇదే ఫిబ్రవరి నెలలో 13.12 బిలియన్ డాలర్లుగా నమోదయింది. క్రూడ్ దిగుమతుల బిల్లు భారం కావడంతో వాణిజ్య లోటు పెరుగుతోంది. ప్రధానంగా చమురు ధరలు ఇటీవల భారంగా మారాయి. ఫిబ్రవరి నెలలో ఎగుమతులు పెరిగినప్పటికీ, దిగుమతులు అంతకంటే ఎక్కువగా పెరిగాయి.
ఫిబ్రవరిలో భారత ఎగుమతులు 25.1 శాతం పెరిగి 34.57 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇదే నెలలో దిగుమతులు 36 శాతం పెరిగి 55.45 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో ఎగుమతులు, దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 20.88 బిలియన్ డాలర్లుగా ఉంది. మొత్తం దిగుమతుల్లో పెట్రోలియం, క్రూడ్ వాటా పెరుగుదల 69 శాతం నమోదు కావడం గమనార్హం. 2021 ఇదే నెలతో పోలిస్తే 15.28 బిలియన్ డాలర్లకు చేరింది.
ఫిబ్రవరి నెలలో ఎలక్ట్రానిక్ గూడ్స్ దిగుమతులు 29.53 శాతం పెరిగి 6.27 బిలియన్ డాలర్లు, ఇంజినీరింగ్ గూడ్స్ 32 శాతం పెరిగి 9.32 బిలియన్ డాలర్లు, పెట్రోలియం 88.14 శాతం పెరిగి 4.64 బిలియన్ డాలర్లు, రసాయనాలు 25.38 శాతం పెరిగి 2.4 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఫార్మా ఎగుమతులు 1.78 శాతం క్షీణించి 1.96 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
ఇక, హోల్ సేల్ ధరల సూచీ ఆధారిత (WPI) ద్రవ్యోల్భణం ఫిబ్రవరి నెలలో 13.11 శాతానికి చేరుకుంది. ఆహార పదార్థాల ధరలు తగ్గినా, ముడి చమురు, ఆహారేతర వస్తువుల ధరలు పెరగడం ఇందుకు కారణం. 2021 ఏప్రిల్ నుండి వరుసగా 11వ నెలలో ఇది రెండెంకెల స్థాయిలో నమోదయింది. 2022 జనవరిలో హోల్ సేల్ ద్రవ్యోల్భణం 12.96 శాతంగా నమోదు కాగా, 2021 ఫిబ్రవరి నెలలో 4.83 శాతంగా నమోదయింది.