ఆకాశం నుంచి పాతాళానికి..: ఒకే ఏడాదిలో భారత ఆర్థిక వ్యవస్థ, పుంజుకుంటుందా?
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది చేదు జ్ఞాపకంగా ఉండనుంది. గత ఏడాది వెలుగు వెలిగిన ఎకానమీ ఈ ఏడాది చివరి నాటికి మసకబారింది. గత ఏడాది జీడీపీ ఆకాశంలో తాకగా, ఈ ఏడాది పాతాళానికి పడిపోయింది. వృద్ధి రేటు గత రెండు త్రైమాసికాలలో ఆరేళ్ల కనిష్టానికి చేరుకుంది. నిరుద్యోగ రేటు నాలుగున్నర దశాబ్దాల గరిష్టానికి చేరుకుంది. ద్రవ్యోల్భణం కలవరపెడుతోంది. పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది. వినిమయ సామర్థ్యం ప్రజల్లో తగ్గింది. దీంతో ఆటో, రియల్ ఎస్టేట్, ఎఫ్ఎంసీజీ రంగాలు పెద్ద ఎత్తున నష్టపోయాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిన భారత్, ఇప్పుడు జీడీపీ అంచనాలు కోత పెట్టే పరిస్థితి వచ్చింది.

ఎన్నో కారణాలు...
ఈ ఏడాది ప్రారంభం వరకు బాగున్న ఆర్థిక వ్యవస్థ, చివరి నాటికి దిగజారింది. భారత ఆర్థిక వ్యవస్థ ఆకాశం నుంచి పాతాళానికి పడిపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనది వినియోగ శక్తి సన్నగిల్లడం. ఏప్రిల్ నెల నుంచి వృద్ధి రేటు క్షీణిస్తున్న సంకేతాలు వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో 5 శాతం, రెండో క్వార్టర్లో 4.5 శాతానికి పడిపోయింది. నిరుద్యోగ రేటు 6.1 శాతానికి చేరుకుంది.
ఆహార ఉథ్పత్తుల ధరలు పెరిగింది. దీంతో ద్రవ్యోల్భణం పెరిగింది. రిటైల్, హోల్ సేల్ ద్రవ్యోల్భణం కూడా పెరిగింది. రిటైల్ ద్రవ్యోల్భణం నవంబర్ నెలలో 5.54 శాతంతో మూడేళ్ల గరిష్టానికి చేరుకుంది. పారిశ్రామికోత్పత్తి మూడు నెలలుగా నెగిటివ్తో ఉంది. బ్యాంకింగ్ రంగ మోసాలు, ఎన్బీఎఫ్సీ స్కాంలు కూడా జీడీపీని దెబ్బతీశాయి. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కూడా కారణం. అలాగే పెద్ద నోట్ల రద్ద, జీఎస్టీ ప్రభావం కూడా ఉంది.

ప్రభుత్వం చర్యలు
ఆర్థిక వ్యవస్థ దిగజారుతున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వివిధ రంగాలకు ఉద్దీపనలు ప్రకటించింది. పెట్టుబడులు వెల్లువెత్తేందుకు కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించింది. ఎన్నో సంస్కరణలు చేపట్టింది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండటంతో ఈ సంస్కరణల ఫలితం కనిపించలేదు. అయితే వీటి ఫలితం ముందు ముందు ఉంటుందని చెబుతున్నారు.

కోలుకునే అవకాశాలు..
ప్రభుత్వం చర్యల కారణంగా వచ్చే ఏడాది వృద్ధి రేటు కోలుకునే అవకాశాలు ఉన్నాయని CII ఆశాభావం వ్యక్తం చేసింది. కేంద్రం, ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు ఫలితాలు ఇస్తాయని చెబుతున్నాయి. జీడీపీ తిరిగి పరుగులు పెట్టేందుకు అవసరమైన సూచనలను సీఐఐ కూడా కేంద్రానికి చేసింది. ద్రవ్య లోటు లక్ష్యాలను సవరించుకోవాలని పేర్కొంది. జీఎస్టీ రేట్ల సంఖ్యను తగ్గించాలని, కస్టమ్స్ సుంకాలను హేతుబద్దం చేయాలని తెలిపింది. కాగా 2019లో భారత్ వృద్ధి రేటు 5 శాతం, 2020లో 6 శాతం ఉండవచ్చునని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications