చైనా సహా ఆ దేశాలకు ఇండియా షాక్, కలర్ టీవీల దిగుమతులపై కఠిన ఆంక్షలు
నాన్-ఎసెన్షియల్ ఐటమ్స్ తయారీని మన దేశంలోనే ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ఇటీవల కరోనా నేపథ్యంలో ఆత్మనిర్భర్ భారత్ను కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా తాజాగా కలర్ టీవీల దిగుమతులను పరిమితం చేసింది. ఇది దేశీయంగా ఉత్పత్తి పెంపును ప్రోత్సహించేందుకు, చైనా వంటి దేశాల నుండి అనవసర వస్తువుల దిగుమతులు తగ్గించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. కలర్ టెలివిజన్ల దిగుమతిని పరిమితం చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారన్ ట్రేడ్(DGFT) జూలై 30న ఓ నోటిఫికేషన్లో వెల్లడించింది.
ఐటీ కంపెనీల్లో 90 రోజుల్లో 11,000 మంది ఉద్యోగులు ఔట్!
దిగుమతి లైసెన్స్ తప్పనిసరి
36 సెంటీమీటర్ల నుండి 105 సెంటీమీటర్ల మధ్య గల అన్ని స్క్రీన్ సైజ్ల టీవీ సెట్స్ పైన ఈ నిర్ణయం తీసుకున్నారు. 63 సెంటీమీటర్ల లోపు పరిమాణం కలిగిన లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే (LCD) టెలివిజన్ సెట్స్ పైన కూడా ఈ పరిమితులు ఉన్నాయి. ఏదైనా దిగుమతి చేసుకునే వస్తువును రిస్ట్రిక్టెడ్ కేటగిరీ కిందకు తీసుకు వచ్చారంటే ఆ వస్తువు దిగుమతిదారు వాణిజ్యమంత్రిత్వ శాఖకు చెందిన DGFT నుండి దిగుమతి లైసెన్స్ పొందవలసి ఉంటుంది.
చైనా, వియత్నాం దేశాల వాట అధికం
భారత్కు టీవీలు అత్యధికంగా ఎగుమతి చేసే దేశం చైనా. డ్రాగన్ దేశం తర్వాత వియత్నాం, మలేషియా, హాంగ్ కాంగ్, కొరియా, ఇండోనేషియా, థాయ్లాండ్, జర్మనీ దేశాల నుండి ఎక్కువగా దిగుమతి అవుతాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో దిగుమతి చేసుకున్న కలర్ టీవీల వ్యాల్యూ 781 మిలియన్ డాలర్లు. ఇందులో వియత్నాం, చైనా దేశాల వాటా 428 మిలియన్ డాలర్లు, 293 డాలర్లుగా ఉంది. దిగుమతులు పరిమితం చేయడంతో చైనా, వియత్నాం వంటి దేశాలు ఎక్కువగా ప్రభావితం కానున్నాయి.
దేశీయ ఉత్పత్తికి ఊతం
పానాసోనిక్ ఇండియా సీఈవో, ప్రెసిడెంట్ మనీష్ శర్మ మాట్లాడుతూ.. ఇది విధానపరమైన ప్రభావం చూపుతుందని, డొమెస్టిక్ అసెంబ్లింగ్ పైన ఇది సానుకూల ప్రభావం చూపుతుందని చెప్పారు. ఇప్పటికే ప్రముఖ బ్రాండ్స్ భారత్లోనే మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లింగ్ యూనిట్లు కలిగి ఉన్నాయని, కాబట్టి అలాంటి వాటిపై ప్రభావం ఉండదని చెప్పారు.