రష్యా నుండి మరింత చమురు దిగుమతికి భారత్ ప్రణాళికలు
రష్యా నుండి ముడిచమురు దిగుమతులను రెట్టింపు చేసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. రష్యా సంస్థ రోస్నెస్ట్ నుండి భారీ చౌక ధరకు మరింత ముడి చమురును కొనుగోలు చేయడానికి దేశీయ ప్రభుత్వ-ప్రయివేటురంగ రిఫైనరీస్ ఆసక్తి చూపిస్తున్నాయి. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో కొన్ని దేశాలు రష్యా నుండి ముడి చమురు కొనుగోలును ఆపివేయాలని నిర్ణయించాయి. దీంతో ఆ మేరకు ముడి చమురును డిస్కౌంట్ పైన భారత్ తీసుకోవాలని భావిస్తుంది.
కొత్తగా ఆరు నెలల కాలానికి సరఫరా కాంట్రాక్ట్స్ కుదుర్చుకోవడానికి సంప్రదింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది. సరఫరా బాధ్యతతో పాటు బీమా వ్యవహారాలను రోస్ నెస్ట్ చూసుకోవాలి. ఈ ఒప్పందం ఖరారైతే రష్యా నుండి భారత్ చమురు దిగుమతులు మరింతగా పెరుగుతాయి. ఆర్థిక సాయం కోసం బ్యాంకులతో భారత్ చర్చిస్తోంది.
భారత్కు అవసరమయ్యే క్రూడాయిల్లో 80 శాతం దిగుమతుల పైనే ఆధారపడవలసి వస్తోంది. గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు మన దేశం 193.5 మిలియన్ టన్నుల క్రూడాయిల్ను దిగుమతి చేసుకుంది. ఇందులో ఎక్కువగా మిడిల్ ఈస్ట్, యూఎస్ నుండి ఎక్కువగా ఉంది. రష్యా నుండి కూడా చమురు దిగుమతులు ఉన్నాయి. కానీ 2021 క్యాలెండర్ ఏడాదిలో 12 మిలియన్ బ్యారెల్స్ దిగుమతి మాత్రమే చేసుకున్నాం. ఇది మొత్తం దిగుమతుల్లో రెండు శాతమే. ఫిబ్రవరి నుండి మే ప్రారంభం వరకు రష్యా నుండి 40 మిలియన్ బ్యారెళ్లకు పైగా ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంది.