ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్ యుద్ధం (Iran War) కేవలం రెండు దేశాల మధ్య పోరాటం మాత్రమే కాదు, ఇది ప్రపంచ ఇంధన వ్యవస్థను కుదిపేస్తున్న ఒక భారీ భౌగోళిక రాజకీయ వ్యూహంగా మారుతోంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గం 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' (Strait of Hormuz) గుండా ట్యాంకర్ల రాకపోకలు అకస్మాత్తుగా నిలిచిపోవడం ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు దారితీసింది. ఎనర్జీ ఎకనామిస్ట్ అనస్ అల్హాజీ విశ్లేషణ ప్రకారం.. ఈ సంక్షోభం వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక రహస్య అజెండాను అమలు చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

యుద్ధం కంటే ఇదే ప్రమాదకరం
సాధారణంగా యుద్ధం అంటే బాంబు దాడులు, క్షిపణి దాడులు అనుకుంటాం. కానీ, ఈసారి ఇరాన్ నేరుగా ట్యాంకర్లపై దాడి చేయకముందే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక 'ఫైనాన్షియల్ షాక్' తగిలింది. ప్రముఖ యూరోపియన్ ఇన్సూరెన్స్ కంపెనీలు హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలకు 'వార్ రిస్క్ కవరేజ్'ను రద్దు చేశాయి లేదా ప్రీమియం ధరలను విపరీతంగా పెంచేశాయి. దీనివల్ల నౌకల యజమానులు తమ ట్యాంకర్లను నడపడం ఆపేశారు. ఫలితంగా ప్రపంచవ్యాప్త ముడి చమురు, ఎల్ఎన్జీ (LNG), ఎరువుల సరఫరా స్తంభించిపోయింది.
ట్రంప్ మౌనం వెనుక మర్మమేంటి?
ముడి చమురు ధరలు పెరిగితే సాధారణంగా విమర్శలు గుప్పించే డొనాల్డ్ ట్రంప్, ఈ ఇన్సూరెన్స్ సంక్షోభంపై మౌనంగా ఉండటం ఆశ్చర్య కలిగిస్తోంది. అమెరికా నౌకాదళం ద్వారా ట్యాంకర్లకు రక్షణ కల్పిస్తామని ఆయన ప్రతిపాదించారు. ఇది 1980ల నాటి కోల్డ్ వార్ వ్యూహాన్ని గుర్తుకు తెస్తోంది. అయితే ఇలా సైనిక రక్షణతో నౌకలను నడపడం వల్ల రవాణా ఖర్చులు భారీగా పెరుగుతాయి. దీనివల్ల గల్ఫ్ దేశాల ఆయిల్ కంటే అమెరికా నుంచి వచ్చే ఆయిల్, గ్యాస్ మార్కెట్లో పోటీని ఇచ్చే స్థాయికి చేరుకుంటాయి. అంటే ఈ సంక్షోభం వల్ల పరోక్షంగా అమెరికా ఎనర్జీ మార్కెట్ లాభపడుతోంది.
భారత్ పై పడనున్న తీవ్ర ప్రభావం
ఈ ఇరాన్ యుద్ధం కారణంగా భారత్ 'క్రాస్ హెయిర్స్' (లక్ష్యం)లో ఉన్నట్లు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భారత్ తన ఎరువుల దిగుమతుల్లో నాలుగో వంతు హోర్ముజ్ జలసంధి ద్వారానే పొందుతుంది. గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగడంతో.. భారత అధికారులు ఇప్పటికే ఎరువుల ఉత్పత్తిదారులను గ్యాస్ వినియోగం తగ్గించుకోవాలని ఆదేశించారు. సరిగ్గా పంటలు వేసే సమయంలో (Planting Season) ఈ ఎరువుల కొరత ఏర్పడితే, వ్యవసాయ ఉత్పత్తి పడిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు భారత్ ఆహార ఉత్పత్తుల కోసం అమెరికాపై ఆధారపడాల్సి వస్తుంది. వాషింగ్టన్ చాకచక్యంగా కోరుకుంటున్న ఫలితం ఇదేనని అల్హాజీ అభిప్రాయపడ్డారు.
ఆకాశాన్ని తాకనున్న ఆయిల్ ధరలు?
ప్రస్తుతం చమురు ధరలపై భౌగోళిక రాజకీయ రిస్క్ ప్రీమియం బ్యారెల్కు 18 డాలర్ల వరకు ఉంది. ఒకవేళ హోర్ముజ్ జలసంధిలో సరఫరా పునరుద్ధరించబడకపోతే.. ముడి చమురు ధర బ్యారెల్కు 100 డాలర్ల పైకి చేరుకోవచ్చని ఉడ్ మెకెంజీ వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇది కేవలం ఇంధన ధరలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభానికి దారితీయవచ్చు. ఈ ఇరాన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, సరఫరా గొలుసు మళ్ళీ ఎప్పుడు గాడిలో పడుతుందోనని ప్రపంచ దేశాలు ఆందోళనతో వేచి చూస్తున్నాయి.


Click it and Unblock the Notifications