ఆదాయపు పన్ను రేట్లు తగ్గే ఛాన్స్, రాయితీలు, డివిడెండ్ ఊరట..
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతోంది. దాదాపు ఏడాది కాలంగా భారత్లోను ఇదే పరిస్థితి. రెండు నెలలుగా నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వివిధ ఉద్దీపన చర్యలు తీసుకుంది. మరిన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఆర్థిక మందగమనం నుంచి బయటపడే ప్రయత్నంలో భాగంగా మరో కీలక అడుగు వేస్తోందని తెలుస్తోంది. ఆదాయపు పన్ను తగ్గింపు దిశగా అడుగులు వేస్తోందని వార్తలు వస్తున్నాయి. వినిమయ సామర్థ్యం తగ్గింది. దీంతో డిమాండ్ పెంచేందుకు ప్రత్యక్ష, పరోక్ష పన్నులలో కోత విధించనుందని వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా పరిశ్రమ, వాణిజ్య సంఘాల నుంచి సూచనలు కోరుతోంది.
ఆదాయపు పన్ను స్లాబ్స్, ప్రత్యక్ష, పరోక్ష పన్నులు తగ్గించేనా?
సలహాలు.. సూచనలివ్వండి
తదుపరి బడ్జెట్ రూపకల్పనకు ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో మార్పులపై సలహాలు ఇవ్వాలని పరిశ్రమ, వాణిజ్య సంఘాలను కోరింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెడతారు. వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులతో ముందస్తు బడ్జెట్ సంప్రదింపులు జరుపుతారు. వ్యక్తిగత, కార్పోరేట్ పన్నులతో పాటు ఎక్సైజ్, కస్టమ్ సుంకం వంటి పరోక్ష పన్నుల్లో మార్పులపై సలహాలు ఇవ్వాలని ఆర్థిక శాఖకు చెందిన రెవెన్యూ విభాగం కోరింది. ఈ నెల 11వ తేదీన రెవెన్యూ శాఖ సర్క్యులర్ విడుదల చేసింది.
ఆదాయపు పన్ను హేతుబద్దీకరణకు సముఖత
గతంలో ఎప్పుడూ ప్రభుత్వం తామంత తాము ఆదాయపుపన్ను కోతల ఆలోచనకు వచ్చిన దాఖలాలు లేవని, కానీ ప్రస్తుత మందగమన పరిస్థితుల్లో అటు వ్యక్తిగత, ఇటు కార్పోరేట్ ఐటీ కోతలకు సానుకూలత వ్యక్తం చేస్తోందని అంటున్నారు. తద్వారా ఆదాయపు పన్ను హేతుబద్దీకరణకు సుముఖంగా ఉన్నామనే సంకేతాలు ఇస్తోందని చెబుతున్నారు.
వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి ఎక్సైజ్, కస్టమ్స్ వరకు...
ఏడాదికి రూ.5 లక్షల ఆదాయం ఉన్నవారికి ఇప్పటికే పన్ను మినహాయింపు ఉంది. ఇటీవల కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించింది. ఇప్పుడు వివిధ పన్నులపై అభిప్రాయాలు సేకరిస్తోంది. అభిప్రాయాలను సేకరించి, వాటిని క్రోడీకరించి వచ్చే బడ్జెట్లో కేంద్రం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాల వంటి పరోక్ష పన్నుల తగ్గింపుకు కూడా కేంద్రం సుముఖంగా ఉన్నట్లుగా చెబుతున్నారు.
డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్
డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్లోను మార్పులకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇది ఇన్వెస్టర్లకు ప్రయోజనం చేకూర్చనుంది. అలాగే విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వం నియమించిన ఓ కమిటీ తన సిఫార్సుల్లో ఈ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ సర్దుబాట్లు చేస్తోందని తెలుస్తోంది. వీటి ద్వారా ఖజానాకు వచ్చే ఆదాయంపై ప్రభావం పడే అవకాశముంది.
డివిడెండ్ ఊరట
ప్రస్తుతం కంపెనీలు తమ లాభాల నుంచి వాటాదారులకు చెల్లించే డివిడెండ్ పైన ప్రభుత్వం 15 శాతం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (DDT) వసూలు చేస్తోంది. సర్ఛార్జ్తో కలిపి 20 శాతం వరకు ఉంది. అలాగే ఏ వ్యక్తికైనా వార్షిక డివిడెండ్ ఆదాయం రూ.10 లక్షలు మించితే అదనపు మొత్తాన్ని ఆయా వ్యక్తుల వ్యక్తిగత ఆధాయపు పన్ను స్లాబుల్లో కలిపి ట్యాక్స్ వేస్తున్నారు. వీటిపై వచ్చే బడ్జెట్లో రాయితీలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. DDTని పక్కన పెట్టి ఓ పరిమితికి మించిన డివిడెండ్ ఆదాయంపై వ్యక్తుల స్థాయిలో పన్ను విధించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.