ఎయిర్లైన్స్కు భారీ నష్టం, ఇలా చేయండి: ఆ ఉద్యోగుల శాలరీ కనీసం 20% వచ్చేలా...
విమానయాన రంగంపై కరోనా మహమ్మారి ప్రభావం భారీగానే ఉండనుంది. దేశీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలు పెద్ద మొత్తంలో కోల్పోనున్నాయి. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా విమానాలు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి. దీంతో నగదు నిల్వలు త్వరితగతిన తరిగి పోతున్నాయి. ఇటివలి వరకు పోటీ కారణంగా, ఆర్థిక మందగమనం వల్ల విమాన రంగాలు నష్టాల్లోకి వెళ్లాయి. ఇప్పుడు కరోనా భారీగా దెబ్బతీసింది.
సూపర్: Forbes 30 అండర్ 30 లిస్ట్లో 5గురు హైదరాబాదీలు, కేటీఆర్ అభినందన
వారికి లేఖ
విమానయాన సంస్థల వద్ద నగదు నిల్వలు వేగంగా తరిగిపోతున్నాయని, అవి దివాలా స్థితిలోకి పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని ఫిక్కీ ఏవియేషన్ కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. దయనీయమైన స్థితిని పరిగణనలోకి తీసుకుని మద్దతు చర్యలు ప్రకటించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురిలకు లేఖ రాసింది.
ఇలా చేయండి
విమానయాన సంస్థలు, ఆయా సంస్థలకు చెందిన బ్యాంకులు జారీ చేసిన స్టాండ్ బై లెటర్స్ ఆఫ్ క్రెడిట్, విదేశీ గ్యారంటీలు, బ్యాంకు గ్యారంటీ వంటివి 90 రోజుల నుండి 180 రోజుల పాటు వాయిదా వేయాలని ఆర్బీఐని ఆదేశించాలని కోరింది. విమానయాన సంస్థలపై ఎలాంటి వడ్డీలు, పెనాల్టీలు, జాప్యానికి చార్జీలు విధించకూడదని సూచించింది. అందుకు ఎయిర్ పోర్ట్ ఆపరేటర్లకు ఏర్పడే ఆదాయం నష్టాన్ని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
కనీసం 20 శాతం శాలరీ వచ్చేలా..
నెలకు రూ.30,000 లేదా అంతకంటే తక్కువ వేతనం కలిగిన ఉద్యోగుల వేతన బిల్లులో కనీసం 20 శాతం సహకారం కోసం ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలని కోరింది. ఈ చర్యలు విమానయాన సంస్థల ఉద్యోగులను నిలబెట్టేందుకు ఉపయోగపడతాయని తెలిపింది. ఎయిరిండియా సహా ప్రయివేటు సంస్థలు వేతనాలు, ప్రోత్సాహకాలు తగ్గించిన విషయం తెలిసిందే. గోఎయిర్, ఇండిగో, విస్తారా, స్పైస్ జెట్ వంటివి సిబ్బంది వేతనాల్లో కోత విధిస్తామని చెప్పాయి. జూన్ త్రైమాసికంలో విమానయాన రంగం 3 నుండి 3.6 బిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేస్తాయని అంచనా. డొమెస్టిక్ క్యారియర్స్ నష్టం 1.75 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా.
ఎయిరిండియాకు రోజుకు రూ.35 కోట్ల నష్టం
ఎయిరిండియాను కరోనా మరింతగా కుంగదీసింది. సర్వీసుల రద్దు నేపథ్యంలో ఈ సంస్థకు రోజుకు రూ.30 నుంచి రూ.35 కోట్ల వరకు నష్టం వస్తోంది. ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితుల్లో ఇంధనం, గ్రౌండ్ హ్యాండ్లింగ్, ఎయిర్ పోర్ట్ ఫీజుతోపాటు సిబ్బంది వేతనాలు, అలవెన్స్, లీజు రెంటల్స్, నిర్వహణ చార్జీలు, వడ్డీల భారం పడుతోందని అంటున్నారు. ఎయిరిండియానే కాదు.. అన్ని విమానయాన సంస్థలదీ ఇదే పరిస్థితి. ఎయిరిండియాకు 90 శాతం ప్రయాణీకుల నుండే ఆదాయం వస్తోంది.
భారీ నష్టం
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్రం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఒకవేళ విమాన సర్వీసులు జూన్ చివరి వరకు నిలిపివేస్తే వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి త్రైమాసికంలో భారత విమానయాన రంగానికి 330-360 కోట్ల డాలర్ల (సుమారు రూ.25,000-27,000 కోట్లు) నష్టం ఉంటుందని ఏవియేషన్ కన్సల్టెన్సీ సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ (కాపా) ఇండియా అంచనా వేసింది. కానీ లాక్ డౌన్ త్వరలో ముగియనుంది. అయినప్పటికీ భారీగానే ఆదాయాలు కోల్పోనున్నాయి. ఏప్రిల్ 15 వరకు విమాన సర్వీసుల్ని నిలివేయబడ్డాయి.