చైనా హువావేపై బ్రిటన్ కీలకనిర్ణయం, అమెరికాకు బిగ్ విన్.. ఎందుకంటే
చైనాకు చెందిన 59 యాప్స్ను గత నెల భారత ప్రభుత్వం నిషేధించింది. భద్రతా కారణాలతో భారత్తో పాటు పలు దేశాలు చైనా వస్తువులు, యాప్స్ను బ్యాన్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే హువావేపై అమెరికాలో ఆంక్షలు ఉన్నాయి. చైనాకు చెందిన ఈ టెలికం దిగ్గజంపై యునైటెడ్ కింగ్డమ్ నిషేధం విధించింది. యూకేలోని 5జీ నెట్ వర్క్ల నుండి 2027 వరకు హువావే పరికరాలను పూర్తిగా తొలగించాలని నిర్ణయించింది.
మరో కీలక అడుగు: 666 చైనా వస్తువులకు చెక్, రూ.వేలకోట్లు ఆదా, అదొక్కటే ఆందోళన..
డిసెంబర్ 31 నుండి హువావే పరికరాలకు చెక్
యూకే మొబైల్ ప్రొవైడర్లు డిసెంబర్ 31, 2020 నుండి హువావే 5జీ పరికరాలు కొనుగోలు చేయవద్దు. హువావేపై అమెరికా తాజా ఆంక్షలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు సైబర్ నిపుణుల నుండి సలహాలు తీసుకున్న తర్వాత నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ సమీక్ష అనంతరం యూకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాని బోరిస్ జాన్సన్ ఆధ్వర్యంలో జరిగిన యూకే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఈ మేరకు తీర్మానాలు ఆమోదించింది. ఇప్పటికే హువావేపై ఆంక్షలు విధిస్తూ చైనా తీరుతో ఆగ్రహంతో ఉన్న అమెరికాకు... బ్రిటన్ నిర్ణయం ఎంతో బలం ఇచ్చినట్లు. ఓ విధంగా బ్రిటన్ రూపంలో అమెరికాకు చైనా-హువావేపై గొప్ప విజయం దక్కిందని చెబుతున్నారు. ఎందుకంటే అమెరికా ప్రభావితం చేయాలని ప్రయత్నించినా బ్రిటన్ పడదని భావించిన హువావేకు ఇది భారీ షాక్ అంటున్నారు.
దేశభద్రత కోసం..
5జీ మన దేశ తీరును మార్చనుందని, అయితే ఆ నెట్ వర్క్ మన దేశ భద్రత, మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉన్నప్పుడేనని యూకే డిజిటల్ మంత్రి ఓలివర్ డౌడెన్ అన్నారు. 2021 జనవరి నుండి హువావే పరికరాలు వేటినీ యూకే 5జీ నెట్ వర్క్స్లో కొత్తగా అమర్చరని తెలిపారు. యూకే 5జీ నెట్ వర్క్స్లో 2027 వరకు హువావే పరికరాలు ఉండవని స్పష్టం చేశారు. పకడ్బందీ టెలికం సెక్యూరిటీ బిల్లును తీసుకు రానున్నారు.
బ్యాడ్ న్యూస్.. హువావే
ఇదిలా ఉండగా, భద్రతా కారణాల ఉల్లంఘనను చైనీస్ టెలికం ఎక్విప్మెంట్స్ దిగ్గజం హువావే ఖండించింది. యూకేలో మొబైల్ ఫోన్ ఉన్న వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని, బ్రిటన్ తీసుకున్న నిర్ణయం డిజిటల్ వృద్ధి నెమ్మదించేలా ఉందని హువావే అధికార ప్రతినిధి అన్నారు. ఇటీవల చైనీస్ కంపెనీలకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్న విషయం తెలిసిందే.