అర్ధరాత్రి నుంచి బస్సు ఛార్జీల పెంపు, హైదరాబాద్లో బస్సు ఛార్జీలు, బస్సుపాస్ ధరలు
హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం డిసెంబర్ 2వ తేదీ నుంచి ఆర్టీసీ ఛార్జీలు పెంచాలని తొలుత నిర్ణయించింది. అయితే ఆదివారం కార్మికులతో భేటీ సందర్భంగా దీనిని ఒకరోజు (డిసెంబర్ 3) వాయిదా వేసింది. తాజాగా, సోమవారం బస్సు ఛార్జీల పెంపును ఖరారు చేసింది. బస్సు ఛార్జీలు ఈ రోజు (సోమవారం) అర్ధరాత్రి 12 గంటల నుంచి అమలులోకి రానున్నాయి. ఛార్జీల పెంపుతో రూ.760 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.
ప్రయాణీకులపై ఆర్టీసీ భారం! కి.మీ.కు ఎంత, ఎప్పటి నుంచి, ఏ సిటీ నుంచి ఎంత?
ధరల పెరుగుదల ఇలా...
- కిలో మీటరుకు 20 పైసల చొప్పున ఛార్జీల పెంపు
- సెమీ ఎక్స్ప్రెస్ బస్సు ఛార్జీలు కిలో మీటరుకు 75 పైసల నుంచి 95 పైసలకు పెంపు
- ఎక్స్ప్రెస్ బస్సు ఛార్జీలు కిలో మీటరుకు 87 పైసల నుంచి 107 పైసలకు పెంపు
- పల్లె వెలుగు, ఆర్డినరీ బస్సుల్లో కనీస ఛార్జీ రూ.10గా నిర్ణయం.
- పల్లె వెలుగు బస్సులో కిలో మీటరుకు ఇప్పటి వరకు 63 పైసలుగా ఉన్న ఛార్జీ నేడు అర్ధరాత్రి నుంచి 83 పైసలకు పెంపు.
ఆయా బస్సుల్లో పెరిగిన కనీస ఛార్జీ
పల్లె వెలుగులో కనీస ఛార్జీ రూ.10కి పెంపు
ఎక్స్ప్రెస్ బస్సులో కనీస ఛార్జీ రూ.20కి పెంపు
సూపర్ లగ్జరీలో కనీస ఛార్జీ రూ.25కి పెంపు
రాజధాని, వజ్ర ఏసీలో కనీస ఛార్జీ రూ.35కు పెంపు
గరుడ ఏసీలో కనీస ఛార్జీ రూ.35కి పెంపు
వెన్నెల ఏసీ ప్లస్లో కనీస ఛార్జీ రూ.70కి పెంపు
బస్సు పాస్ ధరలు..
అన్ని బస్ పాస్ ధరలు కూడా పెంచారు. హైదరాబాద్ నగరంలో పెరిగిన బస్సు పాస్ ఛార్జీల ధరలు ఇలా...
సిటీ ఆర్డినరీ పాస్ ఛార్జీ రూ.770 నుంచి రూ.950కి పెంపు.
మెట్రో పాస్ రూ.880 నుంచి రూ.1070కి పెంపు
మెట్రో డీలక్స్ పాస్ రూ.990 నుంచి రూ.1,180కి పెంపు
స్టూడెంట్ బస్ పాస్ రూ.130 నుంచి రూ.165కి పెంపు
గ్రేటర్ పరిధిలో కనీస ధర, పెరుగుదల
- గ్రేటర్ హైదరాబాదులో రౌండింగ్ ధర రూ.5గా ఉంది. అది అలాగే కొనసాగుతుంది. కనీస ఛార్జీ మాత్రం రూ.10గా నిర్ణయించారు.
- ఆర్డినరీ ప్రస్తుత కనీస ధర రూ.5గా ఉంది. దీనిని రూ.10కి పెంచారు. గరిష్ట ధరను రూ.30 నుంచి రూ.35కు పెంచారు.
- మెట్రో ఎక్స్ప్రెస్ కనీస ధర రూ.10 ఉంది. మార్పులు లేవు. గరిష్ట ధర రూ.30 నుంచి రూ.35కు పెంచారు.
- మెట్రో డీలక్స్ కనీస ఛార్జీ రూ.10గా ఉంది. దీనిని రూ.15కు పెంచారు. గరిష్ట ధరను రూ.30 నుంచి రూ.45కు పెంచారు.
ఇటీవలి వరకు ఆర్టీసీ కార్మికుల దాదాపు రెండు నెలల పాటు సమ్మెలో పాల్గొన్న విషయం తెలిసిందే. వారికి గత గురువారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. వారిని విధుల్లోకి హాజరు కావాలని చెప్పారు. అదేసమయంలో బస్సుల్లో ప్రయాణించే వారికి చేదువార్త వినిపించారు. ఆర్టీసీ సంస్థ మనుగడ కోసం బస్సు ఛార్జీలు పెంచుతున్నట్లు తెలిపారు.
ఛార్జీల పెంపుదల ద్వారా ఏటా రూ.752 కోట్ల నుంచి రూ.760 కోట్ల అదనపు ఆదాయం అంచనా వేస్తున్నారు. విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (TRS) అధికారంలోకి వచ్చాక ఛార్జీలు పెంచడం ఇది రెండోసారి. దాదాపు నాలుగేళ్ల తర్వాత కేసీఆర్ ప్రభుత్వం మరోసారి ఛార్జీలు పెంచుతోంది.
ఆర్టీసీ అధికారులు ధరల పెంపుపై భారీ కసరత్తు చేశారు. కిలో మీటరుకు ఎంత చొప్పున పెరిగితే ఆర్టీసీకి ఎంత ప్రయోజనం అని లెక్కలు వేశారు. 20 పైసలు అయితే ఆదాయం వస్తుందని తేల్చారు. దీంతో అన్ని బస్సులకు ఇదే రీతిన పెంచాలని నిర్ణయించారు.