గూగుల్, ఫేస్బుక్లకు షాక్: కొత్త తరహా పన్ను విధించే యోచనలో సర్కారు!
విదేశీ టెక్నాలజీ కంపెనీలకు త్వరలోనే ఇండియాలో ఒక పెద్ద షాక్ తగలబోతోంది. గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, నెట్ ఫ్లిక్స్, ఈబే, అలీబాబా వంటి ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీలపై కొత్త తరహా పన్ను విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అది అమల్లోకి వస్తే ఇకపై భారత వాటి పన్ను రేటు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ కంపెనీలు విదేశీ సెర్వర్ల ద్వారా అక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న అంశాలపై పన్నులు చెల్లించటం లేదు.
కానీ మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం ఇకపై ఎక్కడి సర్వర్లు ఉన్నా... భారత దేశంలో, మన డేటా ఆధారంగా జరిగే లావాదేవీలు, అడ్వార్టైజ్మెంట్ల పై పన్ను విధించాలని యోచిస్తోంది. గ్లోబల్ డిజిటల్ టాక్స్ అనే అంశంపై ప్రస్తుతం ఆర్గనైజషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) చర్చలు జరుగుతున్నాయి. ఇవి ఒక కొలిక్కి వస్తే ఇండియన్ గవర్నమెంట్ గూగుల్ సహా విదీశీ దిగ్గజ కంపెనీలపై కొత్త పన్ను విధించనుంది.
ఇప్పటికే 6% పన్ను...
ఈ దిశగా మోడీ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఈక్వలైజషన్ టాక్స్ పేరిట 2016 లో ఇలాంటి సర్వీసులు అందిస్తున్న విదేశీ టెక్నాలజీ కంపెనీలకు 6% పన్ను వసూలు చేస్తున్నారు. దీనిని గూగుల్ టాక్స్ అని కూడా పేర్కొంటున్నారు. గ్లోబల్ డిజిటల్ టాక్స్ పై ఓఈసీడీ ఫ్రేమ్ వర్క్ రూపొందించిన తర్వాత ... ఇండియా మరో కొత్త పన్ను ను ప్రవేశపెట్టనుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే, పన్ను ఎంత శాతం ఉంటుందనేది మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. గూగుల్ టాక్స్ విధించినపుడు పెద్ద దుమారమే లేచింది. మరి కొత్త పన్ను విధిస్తే ఇంకా ఎంత రచ్చ అవుతుందో చూడాలి.
ఐపీ అడ్రస్ తో బాదుడు...
ప్రపంచంలోని ఏ దేశం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీ అయినా... ఇండియన్ ఐపీ అడ్రస్ తో ఏదేని సర్వీస్, ట్రాన్సక్షన్ జరిగినా దానిపై పన్ను విధించాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి సరికొత్త ఆదాయ వనరు ఏర్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని సేవలు డిజిటలైజ్ అవుతున్న సమయంలో డిజిటల్ ఎకానమీ కి తగ్గట్లు డిజిటల్ పన్నులు కూడా ఉండాలనేది భారత ప్రభుత్వ ఆలోచన. ఈ మేరకు ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఫైనాన్స్ బిల్లులో కూడా ఆదాయ పన్ను చట్టంలో కొన్ని మార్పులు చేశారు. వాటిని ఆధారంగా చేసుకుని కొత్తగా గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి కంపెనీలపై పన్ను బాదాలని మోడీ ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది.
గ్లోబల్ ఇబ్బందులు...
గ్లోబల్ డిజిటల్ టాక్స్ విధింపు అంశం ప్రతిపాదన దశలోనే ఉన్నప్పటికీ... దీనిని అమల్లోకి తీసుకొస్తే ప్రపంచ దేశాలతో కుదుర్చుకున్న అనేక పన్ను ఒప్పందాలతో ఇబ్బందులు తప్పేలా లేవని కొందరు టాక్స్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఉన్న పన్నులు కూడా కొత్త పన్నులతో ఓవర్ లాప్ అవుతాయని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, మరికొంత మంది మాత్రం.. ఇప్పటి వరకు మన దేశ మార్కెట్ ను పరిశీలించని కొత్త కంపెనీలు కూడా పన్నులు చెల్లించి ఇక్కడ తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి. ఇది ఎటునుంచి ఎటు వెళుతుందో.. చివరకు పన్ను బాదుడు ఎవరైపై పడుతుందో! ఏది ఏమైనా పన్నులు కంపెనీలపై బాదినా... చివరకు అవి మాత్రం కస్టమర్లపైనే మోపటం సహజం.