కొత్త ఐటీ పోర్టల్లో సమస్యలు, ఇన్ఫోసిస్ ఎండీకి సమన్లు, రెడీగా ఉందన్న ఇన్ఫీ
ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి రూపొందించిన కొత్త వెబ్ సైట్ శనివారం నుండి ఆదివారం రాత్రి వరకు తెరుచుకోలేదు. ఈ వెబ్సైట్ను తయారు చేసిన ఇన్ఫోసిస్కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వెబ్సైట్లోని ఎర్రర్స్ పైన వివరణ కోరింది. ఇన్ఫీ పైన ఆదాయపు పన్ను విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి పరిస్థితులను వివరించాలని ఇన్ఫోసిస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సలీల్ పరేఖ్ను ఐటీ శాఖ కోరింది. అత్యవసర నిర్వహణ నిమిత్తమే పోర్టల్ను నిలిపివేశామని, ఆదివారం రాత్రి నుండి ఇది పని చేస్తోందని ఇన్ఫోసిస్ ఈ మేరకు ట్వీట్ చేసింది.
ఈ కొత్త ఆదాయపు పన్ను వెబ్ సైట్ జూన్ 7వ తేదీన ప్రారంభమైంది. ప్రారంభం నుండి ఈ పోర్టల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. సమస్యలను పరిష్కరించాలని నిర్మలా సీతారామన్.. ఇన్ఫోసిస్ను వెంటనే ఆదేశించారు. అయినప్పటికీ సమస్యలు పూర్తిగా కొలిక్కిరాలేదు. జూన్ 22వ తేదీన ఇన్ఫీ ప్రతినిధులతో ఆర్థికమంత్రి భేటీ అయ్యారు. త్వరగా సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఇన్ఫోసిస్ అధిపతి నందన్ నీలేకని నుండి కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని మంత్రి తెలుసుకుంటున్నారు.
వెబ్సైట్లో పూర్తిగా సమస్యలు తొలగిపోలేదు. దీంతో రెండున్నర నెలలుగా ఈ-ఫైలింగ్ పోర్టల్లో టెక్నికల్ సమస్యలు పరిష్కారం కాలేదని, ఈ విషయాలపై వివరణ ఇచ్చేందుకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ముందు హాజరు కావాల్సిందిగా ఇన్ఫోసిస్ ఎండీ కమ్ సీఈఓ సలీల్ పరేఖ్ను పిలుస్తున్నట్లు ఆదాయపు పన్ను విభాగం ట్విట్టర్ ద్వారా పేర్కొంది.
మరోవైపు, ఐ అండ్ బీ కూడా తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి ఇన్ఫోసిస్ గందరగోళం చేసిన రెండో ప్రాజెక్టు ఇది అని, మొదటిది జీఎస్టీ పోర్టల్ అని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు ఆదాయపు పన్ను పోర్టల్ కూడా అలాగే ఉందని వెల్లడించింది. రెండు వరుస వైఫల్యాలనేవి కాకతాళీయంగా అనుకోవడానికి లేదని పేర్కొంది.
రెండు రోజుల పాటు టెక్నికల్ కారణాల వల్ల పనిచేయకుండా పోయిన ఆదాయపుపన్ను శాఖ కొత్త పోర్టల్ www.incometax.gov.in ఇప్పుడు రిటర్న్స్ ఫైలింగ్కు రెడీగా ఉందని, దానిని డెవలప్ చేసిన ఇన్ఫోసిస్ ఓ ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి ఈ పోర్టల్ ప్రారంభమైన జూన్ 7వ తేదీ నుండి సాంకేతిక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు రెండు రోజుల పాటు ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడం గమనార్హం. కొత్త ఐటీ పోర్టల్లోని పలు విభాగాలు పని చేయడం లేదని పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీంతో ఇన్ఫీ స్పందించింది. శనివారం నుండి వివిధ కారణాలతో కొత్త పోర్టల్ అందుబాటులో లేకుండా పోయిందని, అత్యవసర మెయింటెనెన్స్ పూర్తి కావడంతో పోర్టల్ తిరిగి అందుబాటులోకి వచ్చిందని ఆదివారం సాయంత్రం పేర్కొంది.
రిటర్న్స్ ప్రాసెసింగ్ వ్యవధిని 63 రోజుల నుండి ఒక్కరోజుకు తగ్గించడం, రీఫండ్స్ వేగవంతం చేయడమే లక్ష్యంగా కొత్త ఐటీ పోర్టల్ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఈ కొత్త పోర్టల్ అభివృద్ధికి కేంద్రం రెండేళ్ల క్రితం రూ.4వేల కోట్లకు పైగా ఫండ్స్కు ఆమోదం తెలిపింది. జూన్ వరకు రూ.164 కోట్లు చెల్లించింది. నిర్వహణ, జీఎస్టీ, రెంట్, పోస్టేజ్ సహా 8.5 సంవత్సరాలలో ప్రాజెక్టు నిధులను మొత్తం చెల్లించాలి.