ఆ కంపెనీలకు ఆర్బీఐ గుడ్న్యూస్, షరతులు ఇవే..
కరోనా మహమ్మారి నేపథ్యంలో డిమాండ్ లేక కంపెనీలు నష్టాల్లోకి వెళ్లాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒత్తిడిలో ఉన్న ఎంఎస్ఎంఈలకు ఆర్బీఐ రుణాల పునర్వ్యవస్థీకరణపై శుభవార్త చెప్పింది. జనవరి 1, 2020 నాటికి సరైన చెల్లింపులు జరిపిన వారు రుణ పునర్వ్యవస్థీకరణకు అర్హులు అని తెలిపింది. రుణాల పునర్వ్యవస్థీకరణ పథకం పెద్ద మొత్తంలో ఎంఎస్ఎంఈలకు ఉపశమనం కలిగించినట్లు తెలిపారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.
మీ చేతికి ఎక్కువ డబ్బు: బంగారు ఆభరణాల రుణాలపై ఆర్బీఐ గుడ్న్యూస్
రుణాల పునర్వ్యవస్థీకరణ
కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో సాధారణ కార్యకలాపాలకు చాలా కంపెనీలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. క్యాష్ ఫ్లో ఇబ్బందులు ఉన్నాయి. దీంతో ఎంఎస్ఎంఈల రంగంపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో వాటికి మద్దతు అవసరం. దీని ప్రకారం ఒత్తిడితో కూడిన ఎంఎస్ఎంఈ రుణగ్రహీతలు తమ రుణాలను ప్రస్తుత ఫ్రేమ్వర్క్ కింద పునర్వ్యవస్థీకరణకు అర్హులు. మార్చి 31, 2021 నాటికి పునర్వ్యవస్థీకరణను పూర్తి చేసుకోవాలి.
ఆర్బీఐ నిర్దేశించిన షరతులు
- రూ.25 కోట్ల రుణాలు తీసుకున్న వారికి రుణ పునర్వ్యవస్థీకరణ వర్తిస్తుంది. మార్చి 1, 2020 నాటికి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల నుండి తీసుకున్న రుణాలు నిధులేతర సౌకర్యాలతో సహా ఈ మొత్తం మించరాదు.
- మార్చి 1, 2020 నాటికి రుణగ్రహీత అకౌంట్ స్టాండర్డ్ అసెట్గా ఉండాలి.
- మార్చి 31, 2021 నాటికి పునర్వ్యవస్థీకరణ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.
- రీస్ట్రక్చరింగ్ తేదీ నాటికి జీఎస్టీ రిజిస్టర్ అయి ఉండాలి. జీఎస్టీ రిజిస్ట్రేషన్ నుండి మినహాయింపు పొందిన ఎంఎస్ఎంఈలకు ఇది వర్తించదు. మార్చి 1, 2020 నాటికి మినహాయింపు పరిమితి ఆధారంగా ఇది నిర్ణయించబడుతుంది.
పునర్వ్యవస్థీకరణకు ఓకే.. మారటోరియానికి నో!
రుణాలను పునర్వ్యవస్థీకరించాలని పారిశ్రామిక వర్గాల నుండి డిమాండ్లు వినిపించాయి. కార్పోరేట్ కంపెనీల కోసం ఏకకాల రుణ పునర్వ్యవస్థీకరణపై ప్రకటన వెలువడవచ్చునని భావించారు. అలాగే, మారటోరియంపై కొన్ని రంగాలు ఆశలు పెట్టుకున్నాయి. దీనిపై ప్రకటన చేయలేదు. ఈ నెలాఖరుతో రుణ వాయిదాలపై మారటోరియం ముగుస్తోంది. మారటోరియంను రిటైల్ కస్టమర్ల కంటే కార్పోరేట్ సంస్థలే ఎక్కువగా వినియోగించుకుంటున్నాయని, ఆర్థికంగా బలంగా ఉన్న కార్పోరేట్లు ఉపయోగించుకునే మారటోరియాన్ని పొడిగించుకునే అవసరం లేదని కూడా కొంతమంది భావిస్తున్నారు.