భారీగా తగ్గిన బంగారం ధర: కరోనా వ్యాక్సిన్ పరీక్షలు సక్సెస్ అయితే...!
బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. రెండు రోజులుగా పెరిగిన ధరలు ఈ రోజు (మే 19) అస్థిరంగా ఉన్నాయి. మధ్యాహ్నం గం.11.30 సమయానికి మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో 10 గ్రాములకు నిన్నటితో పోలిస్తే రూ.950 తగ్గి రూ.46,765 పలికింది. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.47,000కు పైన ట్రేడ్ అయిన విషయం తెలిసిందే. ఓ దశలో రూ.47,980 రికార్డ్ స్థాయిని తాకింది. వెండి ధర కిలో రూ.47,746 పలికింది.
భారీగా పెరుగుతున్న బంగారం ధర: ఆ తర్వాత ధర ఆగిపోతుందా! 'ఒత్తిళ్లు' సహా కారణాలివే?
అంతర్జాతీయ మార్కెట్లోను తగ్గిన ధర
అంతర్జాతీయ మార్కెట్లోనూ నిన్న పసిడి ధర భారీగా పెరిగింది. ఈ రోజు స్వల్పంగా తగ్గింది. నిన్నటితో పోలిస్తే దాదాపు 20 డాలర్లకు పైగా పతనమైంది. ఔన్స్ బంగారం ధర 1,730కి పైగా ట్రేడ్ అవుతోంది. స్పాట్ గోల్డ్ 1731 వద్ద దాదాపు స్థిరంగా ఉంది. అంతకుముందు సెషన్లో 0.5 శాతం పెరిగింది. నిన్న గోల్డ్ ఫ్యూచర్ ట్రాయ్ ఔన్స్ 1,772 డాలర్ల వరకు పలికింది. వెండి ట్రాయ్ ఔన్స్ 17.80 డాలర్లు పలికింది.
ఈ ఏడాది 14 శాతం పెరుగుదల
కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల కోత, అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తత, పరిమిత కరోనా ఆర్థిక ప్యాకేజీ కారణంగా బంగారం ధర ఈ ఏడాది 14 శాతం వరకు పెరిగింది. వడ్డీ రేట్లు తగ్గిస్తే ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడికి ఆసక్తి చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.
కరోనా వ్యాక్సిన్ విజయవంతం నేపథ్యంలో...
కరోనా వ్యాక్సిన్ పరీక్షలు విజయవంతమయ్యాయని తెలిసిన తర్వాత ఇప్పుడు బంగారం ధరలు అస్థిరంగా ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఔన్స్ బంగారం అంతర్జాతీయ మార్కెట్లో 1,714 డాలర్లు, దేశీయంగా 46,100 మద్దతు ధరగా చెబుతున్నారు. ట్రాయ్ ఔన్స్ 1,745 డాలర్లకు పైగా పెరిగితే $1745-1755 మధ్య ఉంటుందని చెబుతున్నారు. ఎంసీఎక్స్లో 46,920 నుండి 47,000 మధ్య పరీక్ష ఎదుర్కోవచ్చునని చెబుతున్నారు.
హైదరాబాద్లో రూ.50వేలకు చేరువలో..
కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలపై తీవ్రప్రభావం పడింది. ఇలాంటి పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడులు పెట్టుబడికి ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. దీంతో పసిడి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 10 గ్రాముల బంగారం రూ.50 వేలకు చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,408కు, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,510కు చేరుకుంది. బంగారం ధరలు రూ.50 వేలకు చేరువలో ఉన్నాయి.