COVID 19: వచ్చే ఏడాదికి ఇండియా పరుగు, ఎందుకంటే: దువ్వూరి
కరోనా మహమ్మారి - లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020-21) 5 శాతం క్షీణతను నమోదు చేస్తుందని, మరుసటి ఆర్థిక సంవత్సరం (2021-22)లో తిరిగి 5 శాతానికి పుంజుకుంటుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు మైనస్ 5 శాతానికి పడిపోతుందని, స్వాతంత్ర్యం అనంతరం నాలుగో సంక్షోభం కావడంతో పాటు అన్నింటి కంటే పెద్దది అని పేర్కొన్న విషయం తెలిసిందే.
ఆఫీసుల్లో ఏసీ బంద్.. టేబుల్ ఫ్యాన్స్ తీసుకెళ్తున్న ఉద్యోగులు: ఏసీ కావాలంటే ఇది తప్పనిసరి
అందుకే జీడీపీ 5 శాతానికి పుంజుకుంటుంది
2021-22లో వృద్ధి రేటు 5 శాతానికి ఎగుస్తుందని చెబుతూ, ఇందుకు మద్దతిచ్చే అంశాలను కూడా దువ్వూరి సుబ్బారావు ప్రస్తావించారు. ఇది ప్రకృతి విపత్తు కాదని, మన పరిశ్రమలు ఇప్పటికే ఇలాగే నిలిచి ఉన్నాయన్నారు. మన మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థలు పని చేస్తూనే ఉన్నాయన్నారు. భావన్స్ ఎస్పీజేఐఎంఆర్ బిజినెస్ స్కూల్లో సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ స్టడీస్ (CFS) నిర్వహించిన 'ఇండియన్ ఎకానమీ-నావిగేటింగ్ త్రూ ఏ క్రైసిస్' కార్యక్రమంలో వెబినార్ ద్వారా మాట్లాడారు.
ఇవి కూడా ఊతమిస్తాయి
లాక్ డౌన్ ఎత్తివేశాక, ఆర్థిక వ్యవస్థను పునఃప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చాక త్వరగా కోలుకుంటామని అభిప్రాయపడ్డారు. వృద్ధి వేగంగా క్షీణించడం సర్దుబాటులో భాగమే అన్నారు. మనలాంటి పేద దేశానికి ఇది ఇబ్బందికరమైన అంశమని చెప్పారు. అయితే వ్యవసాయ ఉత్పత్తి పెరగడం, విదేశఈ వాణిజ్యం స్థిరంగా ఉండటం మన ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయన్నారు.
కేంద్రం ప్యాకేజీ విధానం బాగుంది
ప్రభుత్వానికి ద్రవ్యపరిమితుల నేపథ్యంలో రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన విధానం బాగుందని దువ్వూరి సుబ్బారావు కితాబిచ్చారు. 'ప్రభుత్వం తన ఆర్థిక పరిమితిలో మంచి పని చేసింది' అన్నారు. అదనంగా రుణాలు తీసుకోవాలన్న ప్రభుత్వం నిర్ణయం బాగుందన్నారు. సహజ విపత్తు కాకపోవడం, ఫ్యాక్టరీలు, మౌలిక వసతులు, రవాణా వ్యవస్థ తాత్కాలికంగా మూత బడినా వెంటనే తెరుచుకోవడానికి సిద్ధంగా ఉండటం మనకు కలిసి వచ్చే అంశమన్నారు.
రుణాలు తీసుకోవడం ఓకే.. కానీ
వృద్ధి రేటు గణనీయంగా ధనిక దేశాలకు కూడా విఘాతం కలిగించే అంశమేనని సుబ్బారావు అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనలాంటి పేద దేశానికి, తక్కువ ఆదాయం కలిగిన వారు ఎక్కువగా ఉంటారని, అనధికారిక రంగంలో ఎక్కువ మంది ఉంటారని, ఇది ఇబ్బందికరమే అన్నారు. ఎక్కువ ఖర్చుల కోసం ప్రభుత్వం ఎక్కువ రుణాలు తీసుకుంటుందని భావిస్తున్నానని, ఇది నైతిక, రాజకీయ అవసరమన్నారు. కానీ ప్రభుత్వం ఓపన్ ఎండ్ రుణాలు తీసుకోవాలనే అంశానికి మద్దతివ్వనని చెప్పారు.
మాంటెక్ సింగ్ అహ్లూవాలియాది అదే మాట
ప్రణాళికా సంఘం మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్సింగ్ అహ్లూవాలియా మాట్లాడుతూ FY22లో 5 శాతం నుండి 6 శాతం వృద్ధి రేటు సాధ్యమేనన్నారు. అయితే దీనిని రికవరీగా భావించకూడదని, ఈ ఆర్థిక సంవత్సరంలో మైనస్ 5గా ఉంటే వచ్చే ఏడాది 6 శాతానికి పెరిగడం ద్వారా గత ఏడాది (2019-20) జీడీపీకి సమానస్థాయిలో ఉంటుందని గుర్తు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తీవ్ర మాంద్యాన్ని చూస్తోందని, దీర్ఘకాలంగా పెండింగ్లోని పన్ను సంస్కరణలు వెంటనే తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు.