ఎఫ్ఎంసీజీ ధరల మంట- మధ్యతరగతికి చుక్కలు-తప్పదంటున్న నిపుణులు
ఫాస్ట్ మూవింగ్ కన్య్సూమర్ గూడ్స్గా పిలిచే వేగంగా అమ్ముడయ్యే ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల ధరలు నానాటికీ పెరుగుతున్నాయి. సబ్బులు, డిటర్జెంట్లు, ప్యాకేజ్డ్ ఆహార పదార్ధాల ధరలు నెలల వ్యవధిలోనే 7 నుంచి 9 శాతం పెరిగాయి. టీపొడి ధరలైతే ఏకంగా 10 నుంచి 15 శాతం వరకూ పెరిగాయి. దీనికి ప్రధాన కారణం ఎఫ్సీజీ సంస్ధలకు పెరుగుతున్న ఇన్ఫుట్ ఖర్చులతో పాటు వస్తు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఆయా సంస్ధలు చేస్తున్న ప్రయత్నాలే అని తెలుస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో నిత్యావసరాలు మంటపుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
గోల్డ్ ETFలలోకి పెట్టుబడుల వెల్లువ, ఫిబ్రవరిలో రూ.491 కోట్లు
ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల ధరలకు రెక్కలు
మార్కెట్లో వేగంగా అమ్ముడయ్యే నిత్యావసర వస్తువులు, ప్యాక్ చేసిన ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కొన్ని నెలల వ్యవధిలోనే సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్లు, తల నూనే, ప్యాకేజ్జ్ ఉత్పత్తుల ధరలు 7 నుంచి 9 శాతం పెరిగిపోయాయి. అదే సమయంలో దాదాపు ప్రతీ ఇంట్లో వాడే టీపొడి ధరలైతే ఏకంగా 10 నుంచి 15 శాతం పెరిగాయి. దీంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. అసలే కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వేళ మధ్యతరగతికి ఈ ధరల పెంపు మంటపుట్టిస్తోంది. చాలా కంపెనీలు ఇప్పటికే ధరల పెంపు బాట పట్టగా మిగతా కంపెనీలు సైతం త్వరలో అదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నాయి.
ముడిసరుకుల ధరల మంటే కారణం
ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల ధరల్లో పెరుగుదలకు ప్రధానంగా ఇన్పుట్ ఖర్చుల్లో పెరుగుదలే కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ముడిసరుకుల ధరల్లో పెరుగుదల నమోదవుతుండటంతో సంస్ధలు కూడా చేసేది లేక తమ మనుగడ కోసం ధరల పెంపుపై ఆధారపడుతున్నాయి. క్రూడాయిల్, పామాయిల్, తేయాకు ముడిసరుకు ధరల్లో పెరుగుదల చాలా ఉత్పత్తులపై ప్రభావం చూపుతోంది. అంతెందుకు మనం ఇంట్లో వాడే ఆహార, సౌందర్య ఉత్పత్తుల తయారీలో ఉపయోగించే పామ్ ఫాటీ యాసిడ్ డిస్టిలేట్ ధర ఏడాదిలో 36 శాతం పెరిగింది. కరోనా తర్వాత రవాణా, ప్యాకేజింగ్ ఖర్చులు కూడా భారీగా పెరిగిపోయాయి.
పెంపు తప్పదంటున్న నిపుణులు
ప్రస్తుతం దేశీయ మార్కెట్తో పాటు అంతర్జాతీయ మార్కెట్లో చూసినా ముడిసరుకుల ధరలు ఆకాశాన్నంటున్నాయి. నిర్వహణా ఖర్చులు పెరిగాయి. దీంతో ధరల పెరుగుదల కూడా తప్పనిసరని నిపుణులు చెప్తున్నారు. కొన్ని సంస్ధలు ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న డిమాండ్ను వదులుకోలేక ధరల పెంపుకు వెనకాడుతున్నాయి. కానీ ఆపరేటింగ్ మార్జిన్లు రావాలంటే ధరల పెంపు తప్పనిసరని నిపుణులు చెప్తున్నారు. ఉదాహరణకు పామాయిల్ వాడే ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తుల బ్రాండ్లు కనీసం 3-16 శాతం ధరలు పెంచాల్సిన పరిస్ధితి ఉందని విశ్లేషిస్తున్నారు. అలాగే హోం, పర్సనల్ కేర్ ఉత్పత్తుల బ్రాండ్లు 13 శాతం ధరలు పెంచక తప్పదని చెప్తున్నారు.
వినియోగదారులకు మంట తప్పదా ?
ప్రస్తుత పరిస్ధితుల్లో నిర్వహణా ఖర్చులు భరించాలన్నా, సంస్ధలు మనుగడ సాగించాలన్నా ధరల పెంపు ఒక్కటే మార్గమని విప్రో, డాబర్ వంటి దిగ్గజాలే చెప్తున్నాయంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. హిందుస్ధాన్ యూనిలీవర్ వంటి సంస్ధలు కూడా తమ సబ్బులు, షాంపూలు, టీపొడి, ఇతర ఉత్పత్తులపై ధరల పెంపును ఆశ్రయించక తప్పని పరిస్ధితి ఉందని స్పష్టం చేస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే ఇప్పటికే ధరల మంటతో సతమతం అవుతున్న వినియోగదారులపై మరో పిడుగు పడటం ఖాయంగా తెలుస్తోంది. ఈ ధరల పెంపు కూడా మధ్యతరగతి వాడే ఆయిల్స్, పర్సనల్ కేర్ ఉత్పత్తులపైనే కావడంతో రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు తప్పేలా లేవు.