అందుకే, PSB సీఈవోలతో నిర్మలా సీతారామన్ భేటీ వాయిదా
న్యూఢిల్లీ: పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు (PSBs) సీఈవోలతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం వాయిదా పడింది. ఈ రోజు (మే 11వ తేదీ) వారితో భేటీ జరగాల్సి ఉంది. కానీ ఇది వాయిదా పడింది. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడే కార్యక్రమంలో ఆర్థిక మంత్రి కూడా పాల్గొన్నారు. ఈ కారణంగా PSBs సీఈవోలతో భేటీ కాలేకపోయారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే ప్రయత్నాల్లో భాగంగా వివిధ అంశాలపై చర్చించేందుకు ఈ భేటీ జరగాల్సి ఉంది. ఇటీవల ఆర్బీఐ గవర్నర్ శక్తకాంత దాస్ ప్రయివేటు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకర్లతో భేటీ అయ్యారు. ఆర్థిక పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఆర్థిక వ్యవస్థ మరింత దారుణం: అమెరికా-చైనా ట్రేడ్ వార్తో కరోనా రికవరీపై దెబ్బ
వివిధ అంశాలపై చర్చకు..
సోమవారం నిర్మలా సీతారామన్తో భేటీ జరిగి ఉంటే బ్యాంకుల వద్ద ఉన్న అధిక నిధులకు సంబంధించిన రివర్స్ రెపో రేటు అంశం కూడా చర్చకు వస్తుందని భావించారు. అయితే తర్వాత జరగనున్న భేటీలో ఈ అంశం చర్చకు రానుంది. లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి బ్యాంకులు.. ఎంఎస్ఎంఈలకు, కార్పోరేట్లకు రూ.42,000 కోట్ల రుణాలు మంజూరు చేశారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.5.66 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేశాయి. లాక్ డౌన్ ఎత్తివేశాక ఈ నిధులు పంపిణీ చేయబడతాయి.
డీఫాల్టులు పెరిగే అవకాసం
ఎన్బీఎఫ్సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు బ్యాంకులు మార్చి 1వ తేదీ నుండి మే 4వ తేదీ మధ్య రూ.77,383 కోట్లు సాంక్షన్ చేసినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గతంలో తెలిపారు. గత కొన్నాళ్లుగా బ్యాంకులు రుణాలు పెద్ద మొత్తంలో మంజూరు చేశాయి. వీటన్నింటిపై సమీక్షించాల్సి ఉండెను. కరోనా - లాక్ డౌన్ నేపథ్యంలో సెప్టెంబర్ నాటికి 30 శాతం నుండి 40 శాతం మధ్య వసూళ్ల కొరత ఏర్పడే అవకాశముందని, 10 శాతం మేరకు డిఫాల్టర్లు అయ్యే అవకాశముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మైక్రోఫైనాన్స్..
కరోనా - లాక్ డౌన్ నేపథ్యంలో మైక్రోఫైనాన్స్ రుణగ్రహీతల నుండి డిమాండ్ పెరిగే అవకాశముంది. అవి నిలదొక్కుకోవాలంటే, వారి ఆదాయాలు స్థిరంగా ఉండాలంటే అత్యవసరంగా క్రెడిట్ అవసరం. కరోనా-లాక్ డౌన్ కారణంగా వివిధ కంపెనీలు, కస్టమర్ల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం తప్పనిసరిగా పడుతుంది. MFI అసోసియేషన్ (మైక్రోఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్) సా-ధన్ ఆర్థికమంత్రి ఇచ్చిన నివేదికలో రానున్న ఆరు నెలల కాలంలో రూ.50,000 కోట్ల రుణాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపింది. మిడ్, స్మాల్ MFIల ఆపరేషనల్ ఖర్చుల కోసం రూ.1500 కోట్ల నుండి రూ.2000 కోట్ల వరకు అవసరమవుతాయి. అలాగే ఈ రంగాల్లో పని చేస్తున్న 2 లక్షల మంది ఉద్యోగులకు భద్రత అవసరం.