income tax portal issue: ఐటీ రిటర్న్స్ గడువును డిసెంబర్ వరకు పొడిగించాలంటూ..
ఆదాయపుపన్ను శాఖ చివరకు కొత్త ఇన్కం ట్యాక్స్ పోర్టల్లోని సాంకేతిక సమస్యలను అంగీకరించిందని, ఈ నేపథ్యంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే గడువును డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించాలని ప్రముఖ జీఎస్టీ కన్సల్టెంట్ దివ్యేష్ జైన్ ట్వీట్ చేశారు. ఆయన సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ఆదాయపు పన్ను శాఖ చేసిన ట్వీట్ను రీట్వీట్ చేస్తూ గడువు పొడిగించాలని కోరారు.
ఏం జరిగిందంటే?
ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి రూపొందించిన కొత్త వెబ్ సైట్ శనివారం నుండి ఆదివారం రాత్రి వరకు తెరుచుకోలేదు. ఈ వెబ్సైట్ను తయారు చేసిన ఇన్ఫోసిస్కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వెబ్సైట్లోని ఎర్రర్స్ పైన వివరణ కోరింది. ఇన్ఫీ పైన ఆదాయపు పన్ను విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి పరిస్థితులను వివరించాలని ఇన్ఫోసిస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సలీల్ పరేఖ్ను ఐటీ శాఖ కోరింది. అయితే అత్యవసర నిర్వహణ నిమిత్తమే పోర్టల్ను నిలిపివేశామని, ఆదివారం రాత్రి నుండి ఇది పని చేస్తోందని ఇన్ఫోసిస్ ఈ మేరకు ట్వీట్ చేసింది.
ఈ నేపథ్యంలో ప్రముఖ కన్సల్టెన్సీ డైరెక్టర్ అయిన దివ్యేష్ జైన్ స్పందించారు. కొత్త ఐటీ వెబ్ సైట్లో సాంకేతిక సమస్యల పరంపర కొనసాగుతున్నందున ఐటీ రిటర్న్స్ గడువును పొడిగించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాత ఇన్కం ట్యాక్స్ పోర్టల్ను రిస్టోర్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
మరో ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ చిరాగ్ చౌహాన్ కూడా ఓ ట్వీట్ చేశారు. గతంలో టీసీఎస్ సంస్థ ఎంసీఏను బాగా హ్యాండ్లింగ్ చేసిందని, ప్రస్తుతం పాస్ పోర్ట్ ఆపరేషన్స్ను బాగా నిర్వహిస్తోందని చెబుతూ, కొత్త ట్యాక్స్ పోర్టల్ అసైన్ను టీసీఎస్కు హ్యాండిల్ చేసి, ఏడాది సమయం ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే, పాత ఇన్కం ట్యాక్స్ పోర్టల్ను రిస్టోర్ చేయాలని పేర్కొన్నారు. దివ్యేష్ జైన్ ఈ ట్వీట్ను కూడా రీట్వీట్ చేస్తూ, పాత ఆదాయపు పన్ను శాఖ పోర్టల్ను రిస్టోర్ చేయాలన్నారు.
ఆదాయపు పన్ను శాఖ పోర్టల్ సాంకేతిక సమస్యలకు ఇన్ఫోసిస్తో పాటు ఆదాయపు పన్ను శాఖ కూడా సమానమైన బాధ్యత వహించాలని కూడా సీఏ చిరాగ్ చౌహాన్ సూచించారు. ఇన్ఫోసిస్ అధికారులకు సమ్మన్స్ ఇచ్చారని, ఇక పోర్టల్ను మూసివేస్తున్నట్లు ప్రకటించాలన్నారు.