ఎగుమతులు 42 శాతం జంప్, ద్రవ్యలోటు 19.9 బిలియన్ డాలర్లు
భారత మర్చంటైజ్ ఎగుమతులు అక్టోబర్ నెలలో 42.33 శాతం ఎగిసి 35.47 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ట్రేడ్ డెఫిసిట్ 19.9 బిలియన్ డాలర్లకు తగ్గింది. కొద్ది నెలలుగా ఎగుమతులు నిరాశాజనకంగా ఉన్నాయి. అక్టోబర్ నెలలో కాస్త పుంజుకున్నాయి. ఇంజినీరింగ్, పెట్రోలియం రంగాలు అంచనాలకు మించి రాణించాయి. దీంతో అక్టోబర్ నెలలో 42.33 శాతం వృద్ధిని నమోదు చేసింది. 35.47 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. ఏడాది క్రితం ఇదే నెలలో 24.92 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి కాగా, కరోనాకు ముందు అంటే 2019 అక్టోబర్ నెలలో 26.32 బిలియన్ డాలర్లుగా నమోదయింది. మరోవైపు నెలలో దిగుమతులు 62.49 శాతం వృద్ధి సాధించి 55.37 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2020 అక్టోబర్ నెలలో 34.07 బిలియన్ డాలర్లుగా ఉంది.
వాణిజ్య లోటు
కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం వాణిజ్యలోటు 19.9 బిలియన్ డాలర్లుగా నమోదయింది. 2020 అక్టోబర్ నెలలో నమోదయిన 5.1 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది మూడురెట్లు. ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్య లోటు. ఇక, ఏప్రిల్-అక్టోబర్ మధ్యకాలంలో వాణిజ్యలోటు 98.71 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎగుమతుల్లో టెక్స్టైల్ రంగం వాటా 3.5 శాతంగా ఉంది. ఎలక్ట్రానిక్ పరికరాలు 1.34 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. పెట్రోలియం, క్రూడ్ ఉత్పత్తుల దిగుమతి 140 శాతం పెరిగి 14.43 బిలియన్ డాలర్లుగా నమోదయింది. బంగారం దిగుమతులు 5.1 బిలియన్ డాలర్లుగా నమోదయింది. వంట నూనెల దిగుమతి గత ఏడాదితో పోలిస్తే 60 శాతం పెరిగి 1.62 బిలియన్ డాలర్లుగా నమోదయింది. ఇంజినీరింగ్, పెట్రోలియం ఉత్పత్తులు భారీగా పెరిగాయి.
ఏడు నెలల కాలంలో...
ఏప్రిల్-అక్టోబర్ మధ్య ఎగుమతులు 55 శాతం పెరిగి 232.58 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతుల వ్యాల్యూ 79 శాతం పెరిగి 331.29 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ మధ్య వాణిజ్యలోటు 98.71 బిలియన్ డాలర్లుగా నమోదు అయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 400 బిలియన్ డాలర్ల ఎగుమతులను నిర్దేశించుకుంది. ఇక దేశం నుండి సేవల ఎగుమతుల వ్యాల్యూ సెప్టెంబర్ నెలలో 22 శాతం పెరిగి 20.68 బిలియన్ డాలర్లుగా, దిగుమతులు 25 శాతం పెరిగి 12.21 బిలియన్ డాలర్లుగా నమోదయింది.
జీఎస్టీ వసూళ్లు అదుర్స్
జీఎస్టీ వసూళ్ళు అక్టోబర్ నెలలో అదరగొట్టాయి. ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంతో గత నెలలో రూ.1.30 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. ఈ పన్ను విధానం అమల్లోకి వచ్చిన జూలై 2017 తర్వాత ఒక్క నెలలో ఇంతటి స్థాయిలో వసూలవడం ఇది రెండోసారి. అంతకుముందు ఏప్రిల్ నెలలో రూ.1.41 లక్షల కోట్ల పన్నులు వసూలు అయ్యాయి. రూ.1లక్ష కోట్ల కంటే అధిక పన్ను వసూలవడం వరుసగా ఇది నాలుగో నెల. గత నెలలో వసూలైన రూ.1,30,127 కోట్లలో సీజీఎస్టీ కింద రూ.23,861 కోట్లు, ఎస్జీఎస్టీ కింద రూ.30,421 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.67,361 కోట్లు వసూలు అయ్యాయి.