భారత్కు వొడాఫోన్ గుడ్బై? మా కంపెనీ పరిస్థితి ఆందోళనకరం: సీఈవో
న్యూఢిల్లీ: భారత్కు వొడాఫోన్కు గుడ్బై చెప్పనుందా? బ్రిటిష్ టెలికం దిగ్గజం వొడాఫోన్ అప్రమత్తమైంది. పరిస్థితులు అనుకూలించకుంటే త్వరలో భారత్ మార్కెట్ నుంచి వైదొలగాల్సి రావొచ్చని సంకేతాలిచ్చింది. భారత్లో మనుగడ సాగించలేమని, ఇక్కడ క్రిటికల్ పరిస్థితులు ఉన్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. కంపెనీ సీఈవో నిక్ రీడ్ తాజా వ్యాఖ్యలు ఈ అనుమానాలకు తావిస్తోంది. భారత్లో తమ భవిష్యత్తుపై అనుమానమేనని ఆయన అన్నారు. అధిక పన్నులు, చార్జీల భారాన్ని ఆపకుంటే కొనసాగలేమన్నారు.
వీక్ ఆఫ్: ఉద్యోగులకు గుడ్న్యూస్: ప్రభుత్వం ఏం కోరుకుంటోంది?
ఐడియాతో కలిసి నిర్వహణ నష్టం రూ.692 మిలియన్ యూరోలు
లైసెన్స్ ఫీజులపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా వేల కోట్ల రూపాయలు చెల్లించవలసి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వొడాఫోన్ - ఐడియా కలిసి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) తొలి అర్థ సంవత్సరంలో సెప్టెంబర్ వరకు ఆర్థిక ఫలితాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఈసారి వొడాఫోన్ ఇండియా నిర్వహణ నష్టం 692 మిలియన్ యూరోలకు చేరుకుందని, గత ఏడాది ఇదే సమయంలో సంస్థ నష్టం 133 మిలియన్ యూరోలుగా ఉందన్నారు. విలీనం నేపథ్యంలో భారత టెలికం పరిశ్రమకు వ్యతిరేకంగా సుప్రీం ఇచ్చిన తీర్పుతో గ్రూప్ నష్టం 1.9 బిలియన్ యూరోలకు చేరిందని తెలిపారు.
ప్రభుత్వం స్పందించకుంటే ప్రశ్నార్థకం
సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో టెలికం కంపెనీలు చెల్లించాల్సిన వేల కోట్ల ఏజీఆర్ బకాయిల విషయంలో ప్రభుత్వం కొంత ఊరట కల్పించాలని, లేదంటే భారత్లో కంపెనీ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడనుందని నిక్ రీడ్ అన్నారు. దశాబ్ద కాలం నుంచి వివాదం నెలకొన్న ఈ బకాయిల గురించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రొవిజనింగ్ జరపలేదన్నారు.
కేంద్రం సహకారం అవసరం
అనుకూలంగాలేని నిబంధనలు, అధిక పన్నుల వల్ల ఆర్థికంగా భారమవుతోందని, సుప్రీం కోర్టు తీర్పు వల్ల ఇది మరింత భారంగా మారిందని పేర్కొన్నారు. ఇండియన్ టెలికం మార్కెట్లో సవాళ్లున్నాయని, ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారిందని అభిప్రాయపడ్డారు. వొడాఫోన్ ఐడియా నిలబడాలంటే ప్రభుత్వం సహకారం అవసరమన్నారు. సుప్రీం తీర్పు ప్రకారం చెల్లింపులు కాకుండా, తమకు ఊరట కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. టెలికం పరిశ్రమ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, మరింత భారం కాకుండా చూడాలన్నారు.
ప్రమాదకర పరిస్థితులు
కొన్ని విధానపరమైన నిర్ణయాలు తమకు వ్యతిరేకంగా, ఇతర టెలికం కంపెనీలకు అనుకూలంగా ఉన్నాయని జియోను ఉద్దేశించి అన్నారు. ధీటైన రెగ్యులేటరీ విధానాలు లేకుంటే భారత్లో పెద్దగా పెట్టుబడులు పెట్టే యోచన కూడా లేదన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందకపోతే వొడాఫోన్ మనుగడ సాగించగలదా అని ప్రశ్నించగా.. సవాళ్లు ఉన్నాయని, ఇప్పుడు మరింత ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయన్నారు.
గతంలోనే ఊహాగానాలు
వొడాఫోన్ భారత మార్కెట్ నుంచి వైదొలగవచ్చునని గతంలోనే ఊహాగానాలు వినిపించాయి. లైసెన్స్, ఇతర రెగ్యులేటరీ ఫీజుల గణనపై టెలికం ఆపరేటర్లతో ఉన్న వివాదంలో టెలికం శాఖకు అనుకూలంగా సుప్రీం తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. జరిమానా, వడ్డీతో కలిపి బకాయిలను చెల్లించాలని ఆదేశించింది. ఫలితంగా టెలికం పరిశ్రమపై రూ.1.4 లక్షల కోట్ల భారం పడింది. సుప్రీం ఆదేశాల ప్రభావం వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ సంస్థలపై ఎక్కువగా ఉంది. జియో స్వల్ప మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది.
ఐడియా వొడాఫోన్ను వీడుతున్న కస్టమర్లు
వొడాఫోన్ భారత జాయింట్ వెంచర్.. వొడాఫోన్ ఐడియా నష్టాలు భారీగా పెరిగాయి. ప్రతి నెల చాలామంది ఈ నెట్ వర్క్ను వీడుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత కంపెనీ మార్కెట్ విలువ కూడా ఒడిదుడుకుల్లో ఉంది. ఇదిలా ఉండగా ఏప్రిల్ - సెప్టెంబర్ కాలానికి వొడాఫోన్ భారత వ్యాపార నష్టం 692 మిలియన్ యూరోలుగా ఉంది. ఈ గ్రూప్ మొత్తం నష్టం 190 కోట్ల డాలర్లు.