అక్టోబర్-డిసెంబర్లో నియామకాలు పెరుగుతున్నాయ్: ఈ సవాళ్లున్నాయ్
దేశంలో నియామకాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. కరోనా సెకండ్ వేవ్ అనంతరం వివిధ రంగాల్లో ఉద్యోగాలు ఊపందుకుంటున్నాయి. కరోనా థర్డ్ వేవ్ లేకపోతే వచ్చే నెల (అక్టోబర్) నుండి డిసెంబర్ వరకు నియామకాలు మరింత పెరుగుతాయని మ్యాన్పవర్ గ్రూప్ సర్వే తెలిపింది. దాదాపు 3,046 కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి మ్యాన్పవర్ గ్రూప్ నెట్ ఎంప్లాయిమెంట్ ఔట్లుక్ పేరుతో ఈ సర్వేను రూపొందించారు.
సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో 44 శాతం కంపెనీలు వచ్చే మూడు నెలల కాలంలో నియామకాలు పెంచనున్నయ్లు తెలిపాయి. నియామకాలపై కంపెనీలు గత ఏడేళ్లలో ఇంత ఆశాభావంతో ఎప్పుడూ లేవని తెలిపింది. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుండటంతో సరైన నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులు దొరకడం ప్రస్తుతం కంపెనీలకు సమస్యగా మారిందని సర్వేలో తేలింది.
జాబ్ మార్కెట్ అదుర్స్
ప్రముఖ జాబ్ వెబ్ సైట్స్ నౌకరీ, మ్యాన్పవర్ ఇలా వరుసగా ప్రతిది కూడా కరోనా ప్రభావం తగ్గి భారత్లో ఉద్యోగాలు పెరుగుతున్నాయని వెల్లడిస్తోంది. దేశంలో జాబ్ మార్కెట్ వేగంగా పుంజుకుంటోన్న సంకేతాలు కనిపిస్తున్నట్లు వెల్లడిస్తున్నాయి. వచ్చే కొద్ది నెలల్లో నియామకాలు జోరుగా కనిపిస్తాయని తెలిపింది మ్యాన్పవర్ గ్రూప్ ఇండియా నివేదిక.
అక్టోబర్ - డిసెంబర్ కాలంలో నియామకాలు గత ఏడేళ్లతో పోలిస్తే అత్యంత ఆశాజనకంగా ఉన్నట్లు తెలిపింది. మరింత మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంటామని దాదాపు సగం కంపెనీలు చెప్పాయి. కార్పోరేట్ల నుండి కొత్త కొలువుల పట్ల ఇంత సానుకూలత గత ఏడేళ్లలో ఇదే మొదటిసారి అని తెలిపింది. కరోనా కారణంగా మందగించిన నియామకాలు ఇప్పుడు వేగవంతం కానున్నాయి. డిసెంబర్ నెలలోగా మరింత మందిని నియమించుకుంటామని తెలిపాయి.
ఇవి సవాళ్లు
అన్ని రంగాల్లోను హైరింగ్ పట్ల సానుకూల సెంటిమెంట్ కనిపిస్తోందని ఈ నివేదిక తెలిపింది. సేవా రంగం, మ్యానుఫ్యాక్చరింగ్, ఫైనాన్స్, ఇన్సురెన్స్, రియల్ ఎస్టేట్ సహా వివిధ రంగాల్లో త్రైమాసికం త్రైమాసికానికి పుంజుకుంటున్నట్లు వెల్లడించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆర్థిక రికవరీలో కీలక పాత్రను పోషించినట్లు తెలిపారు.
చాలా వరకు కార్పోరేట్ ఇండియా సెకండ్ వ్యాక్సీన్కు సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం పండుగ సీజన్లో విక్రయాలు పుంజుకుంటాయనే ఆశాభావం కనిపిస్తోంది. వివిధ రంగాల్లో కొత్త కొలువులకు అవకాశాలు మెరుగైనట్లు తెలిపింది. కానీ థర్డ్ వేవ్ ఆందోళనలు కనిపిస్తున్నాయని, దీంతో కొన్ని పరిశ్రమలకు ఇది ప్రతిభావంతుల కొరత ఏర్పడవచ్చునని, అలాగే శిక్షణ, నైపుణ్యాభివృద్ధి ప్రధాన సవాళ్లు అని తెలిపింది.
ఆరోగ్యకర సంకేతాలు
కార్పోరేట్ ఇండియా రికవరీకి ఆరోగ్యకరమైన సంకేతాలు కనిపిస్తున్నాయని, మార్కెట్లో పూర్తి సానుకూల సెంటిమెంట్ కనిపిస్తోందని, భౌగోళిక రాజకీయ స్థిరత్వం, విభిన్న ఆర్థిక వ్యవస్థ, జనాభా వంటి అంశాలు గత కొన్నేళ్లుగా భారత ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన లోతైన వేరువంటి నిర్మాణాత్మక అంశాలు సాధారణ స్థితిలో కీలక పాత్రను పోషించే అవకాశాలు ఉన్నాయని మ్యాన్ పవర్ గ్రూప్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ గులాటీ అన్నారు.
దేశీయ కార్పొరేట్లు రికవరీపై విశ్వాసంతో ఉన్నారని, మార్కెట్లో మళ్లీ సాధారణ పరిస్థితులు త్వరలోనే నెలకొంటాయనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని, అందుకే కంపెనీలు అన్ని రంగాల్లో నియామకాలకు సిద్ధం అవుతున్నాయన్నారు.