కరోనా కష్టకాలం: 3వేలకుపైగా ఉద్యోగుల తొలగింపు, 45 ఆఫీసుల మూసివేత
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక క్యాబ్ నెట్వర్క్ కలిగిన ఉబెర్ సంస్థపై కరోనా మహమ్మారి ప్రభావం భారీగానే పడింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 3700 మంది ఉద్యోగులను తొలగించిన ఈ సంస్థ.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మరో 45 కార్యాలయాలను మూసివేసింది.
ఈ క్రమంలో మరో 3వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. తాజాగా మూసివేసిన ఆఫీసుల్లో శాన్ఫ్రాన్సిస్కో కార్యాలయం కూడా ఉంది. ఈ ఒక్క కార్యాలయం మూసివేయడంతో సుమారు 500 మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగులను తీసివేసిన విషయాన్ని వారికి ఈ మెయిల్స్ ద్వారా తెలియజేసినట్లు ఉబెర్ సీఈవో డారా కోప్రోవ్ షాహి మీడియాకు వెల్లడించారు.
కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితులతో గత సంవత్సరం కంటే తమ కంపెనీ క్యాబ్ల రైడింగ్ 80 శాతం పడిపోయిందని ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉబెర్ కంపెనీలో సుమారు 22 వేల మందికిపైగా పనిచేస్తుండగా.. ఇప్పటి వరకు దాదాపు 7వేల మందిని తొలగించారు.
కాగా, కాంట్రాక్టుపై పనిచేసే క్యాబ్ డ్రైవర్లు ఉద్యోగుల పరిధిలోకి రారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా లాక్ డౌన్తో క్యాబ్ల కార్యకలాపాలు కూడా నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో క్యాబ్ సంస్థలతోపాటు ఆయా కంపెనీల్లో పనిచేసే డ్రైవర్లు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు ఉబెర్ తోపాటు పలు కంపెనీలు ఇలా ఉద్యోగాలను తీసివేస్తూ, కార్యాలయాలను మూసివేస్తుండటంతో డ్రైవర్ల పరిస్థితి మరీ దయనీయంగా మారింది.