Covid 19: రాష్ట్రాలకు రూ.46,038 కోట్లు బదలీ, తెలుగు రాష్ట్రాలకు 'పన్ను' షాక్!
కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు రూ.46,038 కోట్ల నిధులను ట్రాన్సుఫర్ చేసింది. కరోనా మహమ్మారిపై పోరు కోసం ఏప్రిల్ నెలలో చెల్లించాల్సిన సెంట్రల్ ట్యాక్స్, డ్యూటీస్లో రాష్ట్రాల వాటాను ఆయా రాష్ట్రాలకు పంపించింది. అంతకుముందు ఈ నెల ప్రారంభంలో వివిధ రాష్ట్రాలకు డిజాస్టర్ రెస్పాన్స్ మిటిగేషన్ ఫండ్ (SDRMF) కింద రూ.17,287 కోట్లు విడుదల చేసింది. కరోనా కారణంగా లాక్ డౌన్ ఉండటంతో కేంద్రానికి, రాష్ట్రాలకు రాబడి భారీగా తగ్గిన విషయం తెలిసిందే.
కరోనా దెబ్బతో ఐటీ కంపెనీల సరికొత్త ప్రయోగం, రియల్ ఎస్టేట్కు దెబ్బ?
29.5 శాతం వాటా తగ్గింది
లాక్ డౌన్ కారణంగా రాబడిపై ప్రభావం పడటంతో ఏప్రిల్ నెలకు గాను రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటాలో కేంద్ర ఆర్థిక శాఖ 29.5 శాతం మొత్తాన్ని తగ్గించింది. 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక ఆధారంగా ఈ ఏప్రిల్ నుండి రాష్ట్రాలకు ఇచ్చే కేంద్ర పన్నుల వాటాను కేంద్రం బడ్జెట్లో పేర్కొంది. ఆ మొత్తం పూర్తిగా వస్తుందని భావించాయి. కానీ ఇప్పుడు తగ్గింది.
తెలుగు రాష్ట్రాలకు షాక్
ఏప్రిల్ నెలలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటాగా రూ.1,195 కోట్ల నిధులు రావాలి. కానీ రూ.982 కోట్లు మాత్రమే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్కు రూ.2,686 కోట్లు రావాల్సి ఉండగా రూ.1,892 కోట్లు మాత్రమే విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రానికి రూ.212 కోట్లు, ఏపీకి రూ.794 కోట్లు కోత పడింది. మొత్తంగా రెండు రాష్ట్రాలకు రూ.1,000 కోట్లు కోత పడింది.
చెప్పింది ఎంత.. ఇచ్చింది ఎంత
ఈ ఆర్థిక సంవత్సరం (2020-21)లో తెలంగాణకు పన్నుల వాటాగా రూ.16,726 కోట్లు అందుతుందని బడ్జెట్లో తెలిపారు. ఈ లెక్కన రూ.1,393 కోట్లు అందాల్సి ఉంది. ఏపీకి రూ.32,237 కోట్లు అందుతుందని తెలిపింది. కానీ రూ.1,892 కోట్లు ట్రాన్సుఫర్ చేసింది.
ఆశలు పెట్టుకున్న రాష్ట్రాలు
లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రాలకు పన్నులు, పన్నేతర రాబడులు పడిపోయాయి. దీంతో కేంద్రం నుండి వచ్చే నిధులపై రాష్ట్రాలు ఆశలు పెట్టుకున్నాయి. కానీ నిధులు తగ్గి రావడం ఇబ్బందికరమే. కానీ కరోనా లాక్ డౌన్ ప్రభావం కేంద్ర నిధులపై కూడా భారీగానే పడింది.
రూ.19,312 కోట్లు కోత
28 రాష్ట్రాలకు ఏప్రిల్ నెలకు గాను రూ.65,348 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేంద్ర ఆర్థిక శాఖ రూ.46,036 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మొత్తంగా రూ.19,312 కోట్ల కోత విధించింది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్కు రూ.8,255 కోట్లు, బీహార్కు రూ.4,632 కోట్లు, మధ్యప్రదేశ్కు రూ.3,630.6, మహారాష్ట్రకు రూ.2,824.5 కోట్లు ట్రాన్సుఫర్ అయ్యాయి.