జీఎస్టీ ఫ్రాడ్: డైరెక్టర్లు జైలుకే? కంపెనీలు, సప్లయర్ల పై నాన్-బేలబుల్ కేసులు!
జీఎస్టీ చట్టానికి మరింత పదును పెడుతున్నారు. ఆఫీసర్ల కు విశేష అధికారాలు కట్టబెట్టనున్నారు. ఇకపై జీఎస్టీ ఫ్రాడ్ జరిగితే... సంబంధిత కంపెనీల డైరెక్టర్లు, సీఈఓ, జీఎస్టీ అమలు చేసే కంపెనీ ఇతర అధికారులు నేరుగా జైలుకే వెళ్లాల్సి ఉంటుంది. పైగా ఇలాంటి కేసులను నాన్- బేలబుల్ కేసులుగా పరిగణించబోతున్నారు. అంటే జైలుకు వెళ్ళటమే గానీ బెయిల్ దొరకదన్నమాట. ఈ మేరకు వచ్చే బడ్జెట్ లోనే కొన్ని నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది.
ఇండియాలో ఒకే దేశం ఒకే పన్ను అంటూ రెండేళ్ల క్రితం జీఎస్టీ ని ప్రవేశ పెట్టారు. అయితే, ఆరంభ శూరత్వమే గానీ దీని అమలు అస్తవ్యస్తంగా తయారయ్యింది. చట్టం లోనూ, సాఫ్ట్ వేర్ లోనూ చాలా లోపాలున్నాయి. వాటిని ఆసరాగా చేసుకుని చాలా కంపెనీ లు ఫ్రాడ్ కు తెరలేపుతున్నాయి. రూ కోట్ల లో అక్రమ మార్గంలో ఇన్పుట్ క్రెడిట్ ను దండుకుంటున్నాయి. ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద కంపెనీలపై జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించి అనేక అక్రమాలను వెలికి తీశారు.
డమ్మి కంపెనీలతో దందా..
జీఎస్టీ చట్టం లో ఉన్న కొన్ని లోపాలు... అక్రమ మార్గంలో వెళ్లే వారికి వరంలా మారుతున్నాయి. వాటిని ఆసరాగా చేసుకుని డొల్ల కంపెనీల పేరుతొ నకిలీ ఇన్వాయిస్ సృష్టిస్తున్నారు. వాటితో ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ ను ప్రభుత్వం నుంచి పొందుతున్నారు. ఇలాంటి డమ్మి కంపెనీలను నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా, భారీ మొత్తంలో జరిమానాలు విధించేలా చర్యలు చేపట్టబోతున్నారు. అందుకే, ఇకపై నకిలీ ఇన్వాయిస్ ఇచ్చిన వారితో పాటు, దానిని తీసుకున్న కంపెనీలు, సంస్థలపై కూడా కేసులు నమోదు చేసేలా నిర్ణయాలు ఉండబోతున్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎదో ఒకరిపైనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అందుకే సంబంధిత సెక్షన్ల లో మార్పులు చేర్పులు చేయబోతున్నారు.
రూ 5 కోట్లు దాటితే నాన్-బేలబుల్...
కొత్త నిబంధనల ప్రకారం ఫ్రాడ్ విలువరూ 5 కోట్లు దాటితే ... ఇక దానిని నాన్- బేలబుల్ కేసుగా పరిగణిస్తారు. సంబంధిత డైరెక్టర్లు, ఉన్నతాధికారులను అరెస్ట్ చేసి జైలు కు పంపిస్తారు. ఈ ఫ్రాడ్ తో సంబంధం ఉన్న అటు వైపు కంపెనీ పై కూడా ఇలాంటి చర్యలే ఉంటాయి. అందుకే జీఎస్టీ చట్టం లోని సెక్షన్ 122, 132 సెక్షన్ల లో సవరణలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సవరణలకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. న్యాయ శాఖ కూడా సమ్మతినిచ్చినట్లు సమాచారం. ఇక బడ్జెట్ లో ప్రకటించిన తర్వాత దానిని చట్టంలో సవరణ చేపట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.
అకౌంట్లు బ్లాక్...
జీఎస్టీ ఫ్రాడ్ కు పాల్పడిన కంపెనీల పై కేవలం కేసులతో సరిపెట్టకుండా సదరు కంపెనీ క్రెడిట్ ఫెసిలిటీస్ ను, అకౌంట్ల ను ఫ్రీజ్ చేసే అధికారాన్ని జీఎస్టీ అధికారులకు కట్టబెట్టనున్నారు. ఇందుకోసం జీఎస్టీ చట్టం లోని సెక్షన్ 49కి పదును పెడుతున్నారు. దీనిని కూడా బడ్జెట్ సందర్భంగా ప్రకటించే అవకాశం ఉందని ఉన్నతాధికారుల సమాచారం. ఇదిలా ఉండగా గత ఏడాది కాలంలో హైదరాబాద్, విశాఖపట్నం జీఎస్టీ అధికారుల దాడుల్లో రూ వందల కోట్లలో పన్ను ఎగవేతలు, లేదా తప్పుడు పత్రాల ద్వారా ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ తీసుకున్న కేసులు బయటపడ్డాయి. ఇందులో చాలా పేరున్న కంపెనీలతో పాటు కొందరు సెలెబ్రిటీల పేర్లు కూడా ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. సో... అక్రమార్కులారా... బీకేర్ఫుల్!