Budget 2022: కో-ఆపరేటివ్ సర్ఛార్జ్ భారీగా తగ్గింపు, ఆ ఉద్యోగులకు భారీ ఊరట
కేంద్ర బడ్జెట్ అంటే అందరి చూపు ఆదాయపు పన్ను వైపు ఉంటుంది. వ్యక్తిగత, కార్పోరేట్ ట్యాక్స్ను ఏమైనా తగ్గిస్తారా, పన్నులకు సంబంధించి ఎలాంటి ఊరట కలిగిస్తారనే అంశంపై ఉద్యోగులు, సంస్థలు, వ్యాపారులు ఎదురు చూస్తారు. అలాంటి పన్నులకు సంబంధించి 2022-23 బడ్జెట్లో కేంద్రం కొన్ని ఊరట ప్రకటనలు చేసింది. ఇందులో భాగంగా వ్యక్తిగత ఆదాయపు పన్ను రిటర్న్స్, కో-ఆపరేటివ్ సొసైటీ సర్ఛార్జీ గురించి కీలక ప్రకటన చేశారు నిర్మలమ్మ. కార్పోరేట్ సర్ఛార్జీని 12 శాతం నుండి 7 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు.
అలాగే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల NPS డిడక్షన్ పరిమితిని 10 శాతం నుండి 14 శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సామాజిక భద్రతా ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తీసుకు వచ్చేందుకు ఈ మినహాయింపు పరిమితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు 10 శాతం నుండి 14 శాతానికి పెంచింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పీఎస్ మినహాయింపు. ఈ మినహాయింపును 14 శాతం వరకు పెంచుకునే అవకాశం.
ఇదిలా ఉండగా, క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్ పైన 30 శాతం పన్ను విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. డిజిటల్ కరెన్సీ ద్వారా ఆదాయం, ఆస్తుల బదలీపై 30 శాతం పన్ను ఉంటుందని తెలిపారు. డిజిటల్ కరెన్సీల ఆదాయంపై పన్ను మినహాయింపుకు అవకాశం లేదు. అలాగే, ఆదాయపు పన్ను చెల్లింపుల్లో సవరణలకు రెండేళ్లలో అప్ డేట్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు. అంటే రిటర్న్స్ సమర్పించిన తర్వాత రెండేళ్లలో సవరణలు చేసుకోవచ్చు.