వారికి నిర్మల వరం, ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ అవసరంలేదు: ఎన్నారైలకు గుడ్న్యూస్
న్యూఢిల్లీ: సీనియర్ సిటిజన్లకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అదిరిపోయే న్యూస్ చెప్పారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా పన్ను చెల్లింపు ప్రక్రియ సరళీకరణకు చర్యలు చేపట్టినట్లు ఆర్థికమంత్రి తెలిపారు. ఇదే సమయంలో సీనియర్ సిటిజన్లకు, ఎన్నారైలకు గుడ్ న్యూస్ తెలిపారు.
పెన్షన్ పైన మాత్రమే ఆధారపడే సీనియర్ సిటిజన్లకు రిటర్న్ ఫైలింగ్ నుండి మినహాయిస్తున్నట్లు తెలిపారు. అంటే 75 ఏళ్లు పైబడిన వారు ఇక ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవలసిన అవసరంలేదు. అలాగే, ఎన్నారైలకు డబుల్ ట్యాక్సేషన్ నుండి ఊరట ఇస్తున్నట్లు ప్రకటించారు. బడ్జెట్లో మధ్య తరగతి వారికి కూడా ఊరట ఇచ్చారు. గృహ రుణాలపై పన్ను మినహాయింపును మరో ఏడాది పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. అంటే దీనిని మార్చి 2022 వరకు పొడిగిస్తున్నారు.
చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం వివాద పరిష్కాల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రూ.50 లక్షల లోపు ఆదాయం, రూ.10 లక్షల లోపు ఆదాయం కలిగిన వాళ్లు వివాదాల పరిష్కారానికి నేరుగా కమిటీకి అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఇస్తున్నట్లు తెలిపారు. డివిడెండ్స్ పైన అడ్వాన్స్ ట్యాక్స్ ఉండదని శుభవార్త తెలిపారు.