Budget 2021: ఖర్చును ప్రోత్సహించే ప్లాన్! రూ.80,000 వరకు రిలీఫ్?
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే బడ్జెట్లో సామాన్యులకు ఊరట ఇవ్వడంతో పాటు డిమాండ్ పెంచడం కోసం స్పెండింగ్స్ ప్రోత్సాహ పథకాలు, ప్రకటనలు చేయవచ్చునని భావిస్తున్నారు. నిర్మలమ్మ ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నారు. కరోనా కారణంగా మార్చి చివరి వారం నుండి దాదాపు మూడు నెలల పాటు లాక్ డౌన్ విధించగా, ఆ తర్వాత క్రమంగా సడలింపులు ఇస్తూ వచ్చారు.
గత నాలుగైదు నెలలుగా క్రమంగా ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే కేంద్రం రూ.30వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చింది. ఈ బడ్జెట్లో ఖర్చుకు ప్రోత్సాహమిచ్చి, డిమాండ్ పెంచేలా నిర్ణయాలు వెలువడవచ్చునని భావిస్తున్నారు.
బడ్జెట్కు సంబంధించిన మరిన్ని కథనాలు
రూ.80,000 వరకు ఉపశమనం
బడ్జెట్ ప్రకటనలో ఆదాయ పన్ను చెల్లింపుదారులకు పన్ను లయబిలిటీలో రూ.50,000 నుండి రూ.80,000 మధ్య ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. పాత ఆదాయ పన్నుకు సంబంధించి స్టాండర్డ్ డిడక్షన్ తగ్గింపును పెంచే అవకాశముందని అంటున్నారు. స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఒక వ్యక్తి జీతం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుండి తీసివేయబడుతుంది. తద్వారా పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం తగ్గుతుంది. పొదుపును ప్రోత్సహించేందుకు 2020 బడ్జెట్లో నిర్మలమ్మ మూడు ఆదాయ పన్ను స్లాబ్స్ను చేర్చారు.
రూ.1 లక్ష వరకు పెంచాలని
శాలరైడ్ ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.1 లక్ష వరకు పెంచాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(FICCI) విజ్ఞప్తి చేసింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ప్రామాణిక తగ్గింపు పరిమితిని పెంచవలసి ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) కూడా సూచించింది.
బడ్జెట్ పైన ఆశలు
FY22 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. కరోనా నేపథ్యంలో ఈ బడ్జెట్ పైన ఎన్నో ఆశలు ఉన్నాయి. ప్రధానంగా ఎప్పటిలాగే ఆదాయపు పన్నుకు సంబంధించి సవరణలు ఆశిస్తున్నారు. ప్రస్తుత కీలక పరిస్థితుల్లో ప్రజల చేతుల్లో డబ్బులు ఉంచేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం సామాన్యులకు పలు పన్ను ప్రయోజనాలు కల్పించే అవకాశాలు ఉన్నాయని చాలా ఆశలు ఉన్నాయి. శాలరైడ్ నుండి ఎంఎస్ఎంఈల వరకు ఊరట ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నారు.