కరోనా ఎఫెక్ట్: కంపెనీలకు జీఎస్టీ తలనొప్పి! చిన్న కంపెనీల దివాలాతో చిక్కుల్లో పెద్ద సంస్థలు
కరోనా వైరస్ తెచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చైనా లో పుట్టిన ఈ మాయదారి మహమ్మారి కేవలం ప్రాణాంతకం మాత్రమే కాదు. ఆర్థికంగా కోట్ల మందిని దెబ్బతీసింది. ప్రపంచంలోని 150కి పైగా దేశాలు ఈ మహమ్మారి బారిన పడి విలవిలలాడుతున్నాయి. ఒకవైపు తమ పౌరులు వైరస్ తో పోరాడుతూ.. మరో వైపు వైరస్ దెబ్బకు ప్రాణాలు వదిలేస్తుంటే ఉన్న వారికేమో ఉపాధి లేమి, ఆకలి కేకలు. ఇండియాలోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. మన వద్ద కూడా లాక్ డౌన్ విధించటంతో లక్షల్లో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కోట్ల మంది ఉపాధి కరువై వీధిన పడుతున్నారు.
అయితే, ఇది ప్రజల సమస్య. ఇక కంపెనీల సమస్యలు చెప్పుకుంటూ పోతే అంతు లేకుండా ఉంటోంది. ప్రస్తుతం లాక్ డౌన్ నుంచి భారీ సడలింపులు ఇచ్చినా... ఒక్కో సమస్య ఇప్పుడే బయటపడుతోంది. తాజాగా కంపెనీలు గుర్తించిన అతి పెద్ద సమస్య జీఎస్టీ. చిన్న కంపెనీలు ఎలాగూ చితికి పోయాయి కాబట్టి జీఎస్టీ చెల్లించలేవు. పెద్ద కంపనీలేమో చెల్లించిన జీఎస్టీ కి ఇన్పుట్ క్రెడిట్ పొందలేవు. ఇలా రెండు వైపులా కంపెనీలు దెబ్బతింటున్నాయి.
New tax rule: ఆస్తి, షేర్ల వివరాలు సహా... జూన్ 1 నుంచి కొత్త ఐటీ ఫామ్-26ఏఎస్
నో పేమెంట్... నో ఇన్పుట్...
దేశంలో అత్యంత హడావిడిగా పౌరులపై రుద్దిన పన్ను ఏదైనా ఉందంటే అది జీఎస్టీ. మొదటి నుంచీ ఒక పధ్ధతి... పాడు లేకుండా అమలు చేశారు. వందల సవరణలు చేస్తూ పోయారు. అయినా ఇప్పటికీ జీఎస్టీ అనేది ఎవరికీ కొరకరాని కొయ్యలా మిగిలిపోయింది. ఒకవైపు అధిక పన్ను రేట్లు పడుతుండటం... మరోవైపు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో అనేక లొసుగులు ఉండటంతో రోజురోజుకూ ఇది సంక్లిష్టంగా తయారవుతోంది. ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ వల్ల అన్ని రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఇందులో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలు (ఎం ఎస్ ఎం ఈ ) మరింత దారుణంగా దివాళా అంచుకు చేరుకున్నాయి.
దీంతో అవి జీఎస్టీ చెల్లింపులు చేసే పరిస్థితిలో లేవు. దీని వల్ల పెద్ద కంపెనీలకు కొత్త చిక్కొచ్చి పడింది. పెద్ద కంపెనీలకు చాలా వరకు వస్తు, సేవల సరఫరా చిన్న కంపెనీల నుంచే జరుగుతుంది. అయితే పెద్ద కంపెనీలు చెల్లించిన వ్యాపార లావాదేవీలపై చిన్న కంపెనీలు తప్పనిసరిగా జీఎస్టీ చెల్లించాలి. జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 16 ఇదే స్పష్టం చేస్తోంది. కానీ ప్రస్తుతం చిన్న కంపెనీలు దివాళా దిశగా పయనిస్తుండటంతో పెద్ద కంపెనీలు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ రాక ఇబ్బంది పడతాయి. చెల్లింపుల్లో ఇవి గరిష్టంగా 18% ఉండటం వాటి వర్కింగ్ కాపిటల్ ను ప్రభావితం చేస్తుంది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోని డొల్లతనం...
ఇండియా లో రోజురోజుకూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (సులభతర వాణిజ్యం) కు అనుకూల పరిస్థితులు నెలకొంటున్నాయని ప్రభుత్వం జబ్బలు చరుచుకొంటోంది. ప్రపంచ ర్యాంకింగ్స్ లో ఇండియా స్థానం మెరుగు అవుతోంది. కానీ వాస్తవిక పరిస్థితులు మాత్రం అందులోని డొల్లతనాన్ని వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం జీఎస్టీ చెల్లింపుల తకరారు కూడా ఇందుకు ఒక అత్యుత్తమ ఉదాహరణగా చెప్పొచ్చు. పరిస్థితిని అంచనా వేసిన పెద్ద కంపెనీలు ఇప్పుడు వ్యూహాలు మారుస్తున్నాయి.
ఎలాగైనా చిన్న సంస్థలను దారిలోకి తెచ్చుకునేందుకు కొత్త ఉపాయాలను అమలు చేస్తున్నాయి. ఈ పరిస్థితి చిన్న సంస్థలను పెనం లో నుంచి పొయ్యిలోకి విసిరేసినట్లు అవుతుండటం విచారకరం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పన్ను చెల్లించని సంస్థలను బ్లాక్ లిస్ట్ లో పెట్టి.. వాటి చెల్లింపులను నిలిపివేస్తున్నాయి. లేదా వాయిదా వేస్తున్నాయి.
చిన్న సంస్థలకు పెద్ద చిక్కు...
ఒక వైపు బిజినెస్ దెబ్బతిని సతమతమవుతున్న చిన్న సంస్థలకు ఊహించని మరో ఉపద్రవం ముంచుకొస్తోంది. తమ ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకునేందుకు పెద్ద కంపెనీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. జీఎస్టీ చెల్లింపులు చేయలేని చిన్న వెండర్ల నుంచి ఇండెమ్నిటి లెటర్లు తీసుకుంటున్నాయి. దీంతో భవిష్యత్ లో పన్ను చెల్లింపు ఆలస్యం జరగటం వల్ల పెద్ద కంపెనీకి ప్రభుత్వం పెనాల్టీ విధిస్తే... దానికి చిన్న కంపెనీలే బాధ్యత వహించాలన్నమాట.
దీంతో చిన్న కంపెనీలకు చిక్కులు పెరుగుతాయి. అసలే జీఎస్టీ చెల్లించలేని పరిస్థితిలో ఉన్న సంస్థలకు పెద్ద కంపెనీకి విధించే పెనాల్టీ లు చెల్లించే స్థోమత ఎలా ఉంటుందో ప్రభుత్వమే తెలుసుకోవాలి. వెంటనే దీనిపై ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుని చిన్న సంస్థలను ఈ పెద్ద గండం నుంచి గట్టెక్కించాలి. లేదంటే చిన్న కంపెనీల్లో మెజారిటీ సంస్థలు పూర్తిగా దివాళా తీసి... అసలు బిజినెస్ చేయాలన్న ఆలోచనే మానుకోవచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.