ఐటీలోనే అత్యధిక వేతనాలు: బెంగళూరులో ఎక్కువ ఆఫర్లు, హైదరాబాద్ వీరిదే హవా, వీరికి సూపర్ డిమాండ్!
ఢిల్లీ: దేశంలో అత్యధిక వేతనాలు ఇస్తున్న రంగం సాఫ్టువేర్ కాగా, నగరం బెంగళూరు. 2017, 2018 సంవత్సరాలలో అత్యధిక వేతనాలు ఇచ్చే రంగం, అత్యధిక వేతనాలు ఇస్తున్న నగరంపై రాండ్స్టడ్ గురువారం తన నివేదికను విడుదల చేసింది. ఇందులో ఐటీ రంగ నిపుణులకు ఎక్కువ శాలరీలు వస్తుండగా, బెంగళూరువాసులు ఎక్కువ శాలరీలు అందుకుంటున్నట్లు తేలింది. పదిహేను పారిశ్రామిక రంగాల్లోని లక్షల ఉద్యోగాల తీరును పరిశీలించారు.
బంగారంపై రుణం తీసుకుంటున్నారా? అయితే ఈ పొరపాటు చేయకండి!
మొదటి స్థానంలో బెంగళూరు.. వేతనాలు ఇలా...
రాండ్స్టడ్ ఇన్సైట్స్ శాలరీ ట్రెండ్స్ రిపోర్ట్ 2019 ప్రకారం.. అత్యధిక వేతనాలు ఇస్తున్న నగరాల్లో బెంగళూరు వరుసగా మూడోసారి మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు 2017, 2018లోను ఇదే నగరం ముందు ఉంది. బెంగళూరులో జూనియర్ ఉద్యోగులకు సగటు వార్షిక వ్యయం రూ.5.27 లక్షలుగా ఉంది. మిడ్ లెవల్ సిబ్బందికి రూ.16.45 లక్షలు, సీనియర్ లెవల్ సిబ్బందికి రూ.35 నుంచి రూ.45 లక్షల మధ్య ఉంది.
రెండో స్థానంలో హైదరాబాద్
రెండో స్థానంలో హైదరాబాద్ ఉంది. భాగ్యనగరంలో జూనియర్ ఉద్యోగులకు సగటు వార్షిక వ్యయం రూ.5 లక్షలుగా ఉంది. ముంబైలో జూనియర్ సిబ్బందికి రూ.4.59 లక్షలు, మధ్యస్థాయి సిబ్బందికి రూ.15.07 లక్షలు, సీనియర్ లెవల్ ఉద్యోగులకు రూ.33.95 లక్షలుగా ఉంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో మధ్యస్థాయి ఉద్యోగులకు రూ.14.5 లక్షలు ఉంది. పుణేలో సీనియర్ అధికారులకు రూ.32.68 లక్షలు ఉంది. ఇవి ఆయా విభాగాల్లో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. జూనియర్ సిబ్బంది పరంగా హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది.
ఐటీ రంగంలోనే ఎక్కువ
- ఐటీ రంగంలోని ప్రొఫెషనల్స్ అత్యధిక సగటు వార్షిక వేతనాలు కలిగి ఉన్నారు. జూనియర్ స్థాయిలో రూ.4.96 లక్షలు, సీనియర్ స్థాయిలో రూ.35.84 లక్షల వేతనం లభిస్తోంది.
- సీనియర్ స్థాయిలోని డిజిటల్ మార్కెటర్ల సగటు వార్షిక వేతనం రూ.35.65 లక్షలుగా ఉంది.
డిజిటల్లో వీరికి డిమాండ్
- క్లౌడ్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, ఎనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ (AI), ఆటోమేషన్ వంటి విభాగాల్లో డిజిటల్ నైపుణ్యాలు కలిగిన ప్రొఫెషనల్స్కు డిమాండ్ పెరుగుతోంది.
జీఎస్టీ నిపుణులకు డిమాండ్
- జీఎస్టీ వృత్తి నిపుణులకు తయారీ, సేవా రంగాల నుంచి డిమాండ్ ఉంది. ఈ ప్రత్యేకత కలిగిన స్పెషలిస్టులు, అకౌంటెంట్లు, మేనేజ్మెంట్ కన్సల్టెంట్లు, లాయర్లకు ఎక్కువ అవకాశాలు కలిగాయి.
- ఐటీ తర్వాత ప్రొఫెషనల్ రంగం అధిక వేతనాల రంగంలో రెండో స్థానంలో నిలిచింది.
- జూనియర్లకు, సీనియర్లకు మంచి వేతనాలు లభిస్తున్నాయి.
ఎక్స్పీరియన్స్
- ఆయా కంపెనీలు లేదా ఆయా రంగాల్లో 6 నుంచి 10 ఏళ్ళ వరకు అనుభవం కలిగిన వారికి మంచి వేతనాలు లభిస్తున్నాయి.
- కాంప్లియెన్స్ స్పెషలిస్ట్స్ సగటు వార్షిక వ్యయం రూ.31.09 లక్షలుగా ఉంది. తర్వాత స్థానాల్లలో పైథాన్ స్పెషలిస్టులు ఉన్నారు. వీరి సగటు వార్షిక వ్యయం 20.24 లక్షలుగా ఉంది. హడూప్ స్పెషలిస్ట్స్ వేతనం రూ.19.01 లక్షలుగా ఉంది. స్పెషలిస్ట్ డాక్టర్లకు రూ.18.01 లక్షలుగా ఉంది.
టాలెంట్ ఉంటే చాలు..
- వివిధ విభాగాల్లో మంచి నైపుణ్యం కలిగిన వారికి మరింత ఎక్కువ వేతనాలు లభిస్తున్నాయి.
- అన్ని రంగాల్లోనూ నిపుణులకు డిమాండ్ ఎక్కువగా ఉంది.
- ఎనిమిది ప్రధాన నగరాల్లో 15 పరిశ్రమ విభాగల్లోని లక్ష ఉద్యోగాలను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు.