బజాజ్ ఆటో సిబ్బందికి షాక్, మే 3 వరకు క్లోజ్ అయితే 10% శాలరీ కట్
కరోనా మహమ్మారి కారణంగా కంపెనీల ఆదాయం పడిపోయింది. ఉత్పత్తి-డిమాండ్ పడిపోయింది. దీంతో వివిధ కంపెనీలు తమ ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నాయి. ఆటో దిగ్గజం బజాజ్ ఆటో మేనేజ్మెంట్ తమ సిబ్బంది వేతనాల్లో కోత విధించాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
COVID 19: శాలరీ లేకుండానే.. కఠిన సమయంలో విప్రో కఠిన నిర్ణయాలు తప్పవా?
ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత
బజాజ్ ఆటో థర్డ్ బిగ్గెస్ట్ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరర్. ఇది తమ ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధించాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ను పొడిగించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఉత్పత్తి నిలిచిపోయింది. ఇది మరో మూడు వారాలు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
వేతన కోతలు అవసరం
లాక్ డౌన్ కారణంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (MD) రాజీవ్ బజాజ్ తన మొత్తం వేతన కోతకు సిద్ధమయ్యారు. ఈయన వేతనంలో 100 శాతం కోత ఉంటుంది. ఉద్యోగులకు కంపెనీ మానవ వనరుల విభాగం రాసిన లేఖలో లాక్ డౌన్ కారణంగా నియమిత ఖర్చులను తగ్గించుకోవడానికి కోతలు అవసరమని తెలిపింది.
అలా అయితే 10 శాతం కోత వర్తించదు
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఏప్రిల్ 21వ తేదీ నుండి ఓ కంపెనీ కనుక ఉత్పత్తిని తిరిగి ప్రారంభిస్తే మేనేజ్మెంట్ ప్రతిపాదించిన 10 శాతం వేతన కోత అమలు వర్తించదని అంటున్నారు. కానీ ఉత్పత్తి ప్రారంభం కాకుంటే మాత్రం 10 శాతం కోత ఉండవచ్చునని తెలిపింది.
తగ్గిన సేల్స్
మార్చి నెలలో బజాజ్ ఆటో టూ వీలర్ సేల్స్ ఏకంగా 55 శాతం పడిపోయి 98,412కు పరిమితమైన విషయం తెలిసిందే. కరోనా లాక్ డౌన్ కారణంగా సేల్స్ భారీగా పడిపోయాయి. బజాజ్ ఆటో మొత్తం సేల్స్ 38 శాతం పడిపోయి 2,42,575కు పరిమితమైంది. ఎగుమతుల మార్కెట్ 8 శాతం క్షీణించింది.