రంగులు పూయించిన ఏషియన్ పేయింట్స్: సంక్షోభంలో ఉద్యోగుల వేతనాలు పెంపు... ఎందుకంటే
కరోనా మహమ్మారి సంక్షోభం-లాక్డౌన్ ఎన్నో కంపెనీలు వేతనాల్లో కోత లేదా ఉద్యోగుల కోత వైపు మొగ్గు చూపాయి. వేతనాలు తగ్గించని, అలాగే ఉద్యోగులను తొలగించని కంపెనీలు కూడా ఉన్నాయి. కానీ ఆర్థిక కార్యకలాపాలు నిలిచిన ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులకు వేతనాలు పెంచడం అతికొద్ది కంపెనీల్లో మాత్రమే కనిపిస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోను ఏషియన్ పేయింట్స్ తమ ఉద్యోగులకు ఇంక్రిమెంట్స్ ఇచ్చింది.
6,50,000 కంపెనీలకు EPF శుభవార్త: ఆలస్యంగా చెల్లించినా జరిమానా లేదు
ఏషియన్ పేయింట్స్ అందుకే వేతనాల పెంపు
విమానయాన రంగం నుండి టెక్ దిగ్గజాల వరకు వేతనాల కోత ఉంటుందని లేదా ఇంక్రిమెంట్ ఉండదని ప్రకటించాయి. ఏషియన్ పేయింట్స్ మాత్రం ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితుల్లో వేతనాల పెంపుతో సిబ్బందిలో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నాలు చేసింది. కష్టకాలంలో తమ ఉద్యోగులకు భరోసా కల్పించే ఉద్దేశ్యంతో వేతనాల పెంపు నిర్ణయించింది.
ఖర్చులు తగ్గించుకుంటూ.. ఉద్యోగులకు ఊరట కల్పిస్తూ..
ఈ క్వార్టర్లో ఆదాయాలు బలహీనంగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. అయినప్పటికీ ఉద్యోగులకు వేతనాల పెంపుతో ముందుకు సాగాలని ఎంచుకున్నట్లు తెలిపింది. ఖర్చులను తగ్గించుకునేందుకు, ఉద్యోగులపై భారం కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించడం చేయలేమని, అలాగే కష్టపెట్టలేమని తెలిపింది.
ఉద్యోగులకు, భాగస్వామ్యులకు అండగా..
సేల్స్ విభాగం ఉద్యోగులకు బీమాతో పాటు హాస్పిటల్ ఖర్చులకు సాయం అందిస్తామని ఏషియన్ పేయింట్స్ తెలిపింది. భాగస్వామ్య సంస్థలకు పూర్తి శానిటైజేషన్ సదుపాయాలు కల్పించి ప్రత్యక్ష నగదు తోడ్పాటు అందిస్తోంది. ప్రభుత్వాలకు కరోనా మహమ్మారి సహాయ నిధి కోసం రూ.35 కోట్లు విరాళం ఇచ్చింది. తమ కాంట్రాక్టర్ల బ్యాంకు అకౌంట్లకు రూ.40 కోట్లు బదలీ చేసింది.
అమ్మకందారులకు చెల్లింపులపై గడువు.. డిస్కౌంట్
వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ను నిర్వహించేందుకు అమ్మకందారుల నుండి చెల్లింపులకు గడువు ఇచ్చింది. సంస్థకు చేసే చెల్లింపులపై 45 రోజుల సమయం ఇచ్చింది. అంతేకాదు ఈ 45 రోజులలోపు చెల్లింపులు జరిపితే 2 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. కరోనా పోరులో భాగంగా ఏషియన్ పేయింట్స్ శానిటైజర్లు కూడా తయారు చేయడం ప్రారంభించింది.
ఏషియన్ పేయింట్స్ ధీమా అదే..
భాగస్వాములందరి బాగోగులు చూసుకొనే సంస్థగా మనం నిజమైన నాయకత్వానికి ఉదాహరణగా నిలవాలని, ఇందుకు చేపట్టిన చర్యలన్నింటినీ ఎప్పటికప్పుడు తమ బోర్డు డైరెక్టర్లకు వివరించి వారి ఆమోదం పొందామని ఏషియన్ పెయింట్స్ ఎండీ, సీఈవో అమిత్ సింగ్లే తెలిపారు. క్వార్టర్ 1లో లాభాలు తుడిచిపెట్టుకుపోయినా చాలా ఏళ్లుగా రుణరహిత సంస్థగా ఉన్న తమకు మరో నాలుగు నెలలు ఎలాంటి సమస్య ఉండదన్నారు.