చైనాకు ఫస్ట్ ఝలక్: ఇండియాకు ఆపిల్ ప్రొడక్షన్ యూనిట్ల తరలింపు, కేంద్రం ఆ అవరోధాలు తొలగించాకే..
కరోనా మహమ్మారి కారణంగా చైనా నుండి వేలాది కంపెనీలు బయటకు వెళ్లాలని భావిస్తున్నాయి. ఇప్పటికే వివిధ దేశాలు వాటిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇండియా కూడా వెయ్యికి పైగా కంపెనీలతో చర్చలు జరుపుతోంది. ఇందులో దాదాపు 300కు పైగా కంపెనీలు రావడానికి సిద్ధంగా ఉన్నాయని భావిస్తున్నారు. ఇందులో భాగంగా తమ ఉత్పత్తి యూనిట్ను చైనా నుండి భారత్కు తరలించాలని టెక్ కంపెనీ ఆపిల్ భావిస్తోంది.
చైనాకు మోడీ ప్రభుత్వం ఝలక్: 1,000 కంపెనీలతో చర్చలు, 300 రావడానికి సిద్ధం
ఆపిల్ లక్ష్యం.. భారత్కు ప్రయోజనకరం
చైనా నుండి ఉత్పత్తి యూనిట్ను మార్చి, భారత్ నుండి దాదాపు 40 బిలియన్ డాలర్లు లేదా రూ.3 లక్షల కోట్లకు పైగా విలువైన ఐఫోన్లను ఉత్పత్తి చేయడమే ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుందట. వచ్చే అయిదేళ్లలో ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోందట. మరోవైపు 2025 నాటికి 100 బిలియన్ డాలర్లు లేదా రూ.8 లక్షల కోట్ల విలువైన మొబైల్స్ను ఎగుమతి చేయాలని భారత్ భావిస్తోంది. ఇప్పుడు ఆపిల్ తీసుకున్న నిర్ణయం ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో భారత్కు ఉపయోగపడుతుందని అంటున్నారు.
అయిదో వంతు భారత్కు.. ఇన్సెంటివ్ స్కీంపై సానుకూలత
కరోనా పుట్టిన చైనా నుండి తమ ఉత్పత్తి కార్యకలాపాల్లో అయిదో వంతు భాగాన్ని భారత్కు తరలించేందుకు ఆపిల్ సిద్ధమవుతోంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్తో పాటు ఇతర గాడ్జెట్స్ తయారీ కాంట్రాక్టులను ఫాక్స్కాన్, విస్ట్రన్ లాంటి సంస్థలకు ఇస్తోంది ఆపిల్. ఇండియాలో దాదాపు 4 వేలకోట్ల డాలర్ల విలువైన స్మార్ట్ ఫోన్స్ను తయారు చేసేందుకు ఈ కాంట్రాక్టర్లను ఉపయోగించుకోనున్నట్లు తెలుస్తోంది. దీనిపై కంపెనీ స్పందించాల్సి ఉంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ (PLI) స్కీంలో కొన్ని అవరోధాలు ఉన్నాయని, వాటిని తొలగించాలని ఆపిల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ప్రభుత్వాన్ని కోరగా.. సానుకూలంగా స్పందన వచ్చినట్లుగా తెలుస్తోంది.
PLI ప్రోత్సాహకం
PLI పథకం ద్వారా లబ్ధి పొందేందుకు ఏ కంపెనీ అయినా 2020 నుంచి 2025 మధ్యకాలంలో దశలవారీగా కనీసం వెయ్యి కోట్ల డాలర్ల విలువైన మొబైల్ ఫోన్స్ను తయారు చేయాలి. ఈ పథకానికి ఎంపికైన కంపెనీ తమ వార్షిక లక్ష్యాలను తప్పక అధిగమించాలి. ఆగస్ట్ 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ పథకానికి ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలను ప్రకటించనుంది. ఈ మార్గదర్శకాలు జారీ కాగానే ఆపిల్తో పాటు శాంసంగ్, వివో, ఒప్పో లాంటి స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలు కూడా PLI స్కీంకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం ఈ స్కీం కోసం రూ.48,000 కోట్ల ప్రోత్సాహకాలు ప్రకటించింది.
ఇండియా లార్జెస్ట్ మొబైల్ ఎక్స్పోర్టర్
భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో స్వల్ప వాటా కలిగి ఉన్న ఆపిల్ ముఖ్యంగా ఎగుమతుల కోసమే తమ ఉత్పత్తి కార్యకలాపాలలో అధిక భాగాన్ని చైనా నుండి భారత్ తరలిస్తోంది. ప్రస్తుతం భారత్లో ఆపిల్ ఏటా దాదాపు 150 కోట్ల డాలర్ల ఐఫోన్లను విక్రయిస్తోంది. వీటిలో మూడోవంతు కంటే తక్కువ మాత్రమే స్థానికంగా తయారవుతున్నాయి. ఆపిల్ ఇప్పటికే భారత్లో ఐఫోన్ 7, ఐఫోన్ ఎక్స్ఆర్ మోడల్స్ తయారు చేస్తోంది. గతంలో ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 6ఎస్ మోడల్స్ను తయారు చేసింది. అయితే అంతర్జాతీయ ఉత్పత్తుల జాబితా నుండి వీటిని తొలగించింది. ఆపిల్ భారత్ రావడం కార్యరూపం దాల్చితే ఈ సంస్థ ఇండియా అతిపెద్ద ఎగుమతిదారుగా నిలుస్తుంది. అయితే ఉందుకు PLI స్కీంలో కొన్ని చికాకులు క్రమబద్దీకరించాల్సి ఉంది. చైనాలోని తయారీ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టిన కొద్ది సంస్థల్లో ఆపిల్ ఒకటి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్త చైనాలో దాదాపు 22వేల కోట్ల డాలర్ల విలువైన వస్తువులను ఉత్పత్తి చేసింది.
త్వరలో తొలి ఆపిల్ స్టోర్
గత క్వార్టర్ చివరి నాటికి భారత ప్రీమియం స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఆపిల్ 62.7% వాటాను కలిగి ఉన్నట్టు ఇంటర్నేషనల్ డాటా కార్పొరేషన్ ఇటీవల తెలిపింది. ప్రస్తుతం భారత్లో రీసెల్లర్స్ ద్వారా ఆపిల్ అమ్మకాలు జరుపుతోంది. ఇప్పటి వరకు ఇక్కడ సొంత స్టోర్స్ ప్రారంభించలేదు. వచ్చే ఏడాది భారత్లో ఆపిల్ తొలి రిటైల్ స్టోర్ ప్రారంభించే అవకాశముందని కంపెనీ సీఈవో టిమ్ కుక్ గతంలో తెలిపారు. లోకల్ సోర్సింగ్ నిబంధనలు సడలిస్తున్నట్లు ప్రకటించిన సమయంలో ఆపిల్ ఇండియాకు ధన్యవాదాలు తెలిపింది.