ఆయుష్మాన్ భారత్ సూపర్, బ్యాంకుల్లో వాటా తగ్గించండి: మోడీకి అభిజిత్!
న్యూఢిల్లీ: నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఆయనతో సమావేశం అద్భుతంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థపై మీడియాతో మాట్లాడారు. మోడీ నేతృత్వంలోని జన్ ధన్ యోజన, మోడీ కేర్ వంటి పథకాలపై ప్రశంసలు కురిపించారు. అంతకుముందు నోట్ల రద్దుపై విమర్శలు గుప్పించారు. కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపును తప్పుబట్టారు. ట్యాక్సులు ఎక్కువగా ఉంటేనే మంచిది అనేది అభిజిత్ అభిప్రాయం. ఇదే సమయంలో ప్రభుత్వరంగ బ్యాంకుల పరిస్థితిపై కూడా మాట్లాడారు.
రెండింతలైన మీ సంపదన, ఒక్కోవ్యక్తి వద్ద రూ.10.5 లక్షలు
50 శాతానికి తగ్గించాలి... అందుకే ఇలా
ఇండియన్ బ్యాంకింగ్ రంగంలోని సంక్షోభంపై అభిజిత్ బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు బ్యాంకింగ్ రంగంలో చాలా మార్పులు అవసరమన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకు(PSB)ల ఈక్విటీలో ప్రభుత్వ వాటా 50% కంటే తక్కువగా ఉండాలన్నారు. అపుడే బ్యాంకుల ఉన్నతాధికారులు కేంద్ర విజిలెన్స్ కమిషన్ (CVC) భయం లేకుండా నిర్ణయాలు తీసుకోగలుగుతారన్నారు. బ్యాంకర్లు భయం లేకుండా పని చేయాలంటే ప్రభుత్వ వాటాను 50 శాతం కంటే తగ్గించాలన్నారు. 51 శాతానికి మించి ఉంటే CVC పరిధిలోకి వస్తాయని, ఆ విచారణకు భయపడి బ్యాంకర్లు తప్పులు కప్పిపుచ్చుతున్నారన్నారు.
బ్యాలెన్స్ షీట్లు సరిగ్గా లేకనే...
వివిధ రకాల విచారణలకు భయపడి బ్యాంకర్లు తప్పులు కప్పిపుచ్చుతూ కాలం గడుపుతున్నారని, అవి శృతిమించినప్పుడు బయటకు వస్తున్నాయని అభిజిత్ చెప్పారు. బ్యాంకులపై ఆర్బీఐ నియంత్రణ ఉందని, కాబట్టి సీవీసీ అవసరం లేదని చెప్పారు. బ్యాంకులు బాగానే కనిపిస్తున్నాయని, కానీ హఠాత్తుగా సమస్యల్లో చిక్కుకుంటున్నాయన్నారు. అందుకు బ్యాలెన్స్ షీట్లలో సరైన సమాచారం లేకపోవడం అన్నారు. వ్యవస్థల్లో తనిఖీలు ఉండాలని, కానీ పని చేసేందుకు ఇబ్బందికరంగా ఉండవద్దన్నారు.
రుణం ఇచ్చి అప్పు తీర్చేలా..
దర్యాఫ్తు సంస్థలకు భయపడి బ్యాంకర్లు పలు సందర్భాల్లో రుణాలు ఇవ్వరని అభిజిత్ అన్నారు. అంతేకాకుండా తాము తప్పు చేసి ఉంటే దాని నుంచి మరో తప్పుడు మార్గంలో బయటపడేందుకు ప్రయత్నిస్తారన్నారు. రుణం కట్టలేని వ్యక్తి నుంచి దానిని రాబట్టుకునేందుకు కొత్త రుణాలు ఇస్తారని, ఇలాంటివి దాచిపెట్టినంత కాలం బాగానే ఉంటాయన్నారు. కొన్నేళ్ల తర్వాత దాచిపెట్టలేని పరిస్థితి వస్తుందని, అప్పుడు ఇబ్బందులు వస్తాయని, బ్యాంకులు కుప్పకూలుతాయన్నారు. ఆర్బీఐ ఉన్నప్పుడు సీవీసీ అవసరం లేదన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రభుత్వరంగం కంటే బాధ్యతారహితంగా వ్యవహరిస్తాయని భావించడం లేదని, అందుకే ప్రభుత్వం వాటా 50 శాతం కంటే తక్కువ ఉండాలన్నారు. అలాగే సీవీసీకి అధికారం లేకుండా చేయాలన్నా
ఆయుష్మాన్ భారత్ సూపర్
మోడీ తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ పైన అభిజిత్ బెనర్జీ ప్రశంసలు కురిపించారు. ఆయుష్మాన్ భారత్ చాలా ముఖ్యమైనదని, ఇలాంటి పథకాల వల్ల అనారోగ్యంగా ఉన్నప్పుడు ఖర్చులు భరించలేని కుటుంబాలకు ఇది పెద్ద ఊరట అని అభిప్రాయపడ్డారు. మన ఆర్థిక నిర్మాణంలో ఇది ఒక పెద్ద అంతరాన్ని తగ్గిస్తుందని కొనియాడారు.
పన్నులు తగ్గిస్తే పెట్టుబడులు వస్తాయనేది అపోహ
అంతకుముందు, పన్నులు ఎక్కువగా ఉండాలని అభిజిత్ వివిధ సందర్భాలలో అభిప్రాయపడ్డారు. కార్పోరేట్ ట్యాక్స్ తగ్గిస్తే పెట్టుబడులు వస్తాయనేది అపోహ అన్నారు. ట్యాక్సులు ఎక్కువగా ఉండాలన్నారు. ఎక్కువ ట్యాక్స్ వేస్తేనే రెవెన్యూ గ్రోత్ ఉంటుందనేది ఆయన అభిప్రాయం. పన్నులు తగ్గించడం ద్వారా వృద్ధి ఉండదని, ఎక్కువ పన్ను వేసి, పీఎం కిసాన్ వంటి వాటి ద్వారా ప్రజలకు ఇస్తే వృద్ధి ఉంటుందన్నారు.