డిసెంబర్ 31 దాకా ఊరట: పాన్-ఆధార్ అనుసంధానం గడువు 3 నెలలు పెంపు
న్యూఢిల్లీ: పాన్ కార్డును ఆధార్ కార్డు అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. పాన్ - ఆధార్ లింకింగ్ తేదీని మరోసారి పొడిగించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. పాన్ - ఆధార్ లింకింగ్కు సెప్టెంబర్ 30 చివరి తేదీగా ఉంది. అయితే ఈ గడువును మరో మూడు నెలలు పొడిగిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం (CBDT) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
చదవండి: సెప్టెంబర్ 30లోగా పాన్-ఆధార్ లింక్ చేయకుంటే..? లింకింగ్ ఇలా...
గత మార్చి నెలలో ఆధార్ - పాన్ కార్డు అనుసంధానాన్ని ఆరు నెలల పాటు పొడిగించింది. ఇప్పుడు మరో మూడు నెలలు పొడిగించింది. అంటే డిసెంబర్ 31వ తేదీలోగా వీటిని లింక్ చేసుకోవాలి. నిర్దేశిత డెడ్ లైన్ లోగా (డిసెంబర్ 31) పాన్తో ఆధార్ను లింక్ చేయకుంటే మీ పాన్ కార్డు పని చేయదు. ఈ క్రమంలో పాన్ను తప్పనిసరిగా పేర్కొనాల్సిన ఆర్థిక లావాదేవీలను కొనసాగించడంలో తమ పాన్తో ఆధార్ను లింక్ చేయకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం మరో మూడు నెలలు గడువు పెంచినందున లింక్ చేసుకోని వారికి భారీ ఊరట.
పాన్ చాలా సందర్భాల్లో తప్పనిసరి. పలు రకాల ఆర్థిక లావాదేవీలు నిర్వహించే సమయంలో పాన్ నెంబర్ తెలియజేయాలన్న నిబంధనలు అమల్లో ఉన్నాయి. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, కో-ఆపరేటివ్ సొసైటీ, ప్రభుత్వ ఏజెన్సీలు, లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్ షిప్, ట్రస్ట్ లతో పాటు పెద్ద మొత్తంలో ఆర్ధిక లావాదేవీలు నిర్వహించే వారు, ఆదాయ పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చే వారందరికీ పాన్ కార్డు అవసరం ఉంటుంది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారికి ఓ ఊరట కూడా కల్పించింది. పాన్ కార్డు లేకపోయినప్పటికీ ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఆధార్ కార్డును ఉపయోగించుకోవచ్చునని కేంద్రం తెలిపింది. ఇటీవల పాన్ కార్డు లేనివారు కూడా తమ ఆధార్ ద్వారా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినవారు ఉన్నారు. పాన్ లేకుండా ఆధార్ ద్వారా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినవారికి ఐటీ డిపార్టుమెంట్ ఆటోమేటిక్గా పాన్ కార్డును జారీ చేస్తోంది.
ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, జండర్, ఫోటో, అడ్రస్, ఇండివిడ్యువల్స్ బయోమెట్రిక్ వంటి వివరాలు కలిగి ఉంటుంది. 10 డిజిట్ నెంబర్ కలిగిన పాన్ కార్డును ఇన్కం ట్యాక్స్ డిపార్టుమెంట్ జారీ చేస్తుంది. కంపెనీలకు, వ్యక్తులకు వీటిని జారీ చేస్తుంది.
దేశంలో 120 కోట్ల మందికి ఆధార్ కార్డుఉంది. 41 కోట్ల మందికి పైగా పాన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 22 కోట్లకు పైగా ఆధార్ కార్డులు పాన్ కార్డుతో లింక్ చేశారు. హోటల్ లేదా ఫారన్ ట్రావెల్ బిల్స్ రూ.50,000 మించిన ట్రాన్సాక్షన్స్కు పాన్ తప్పనిసరి. అలాగే రూ.10 లక్షలకు పైన స్థిరాస్థి కొనుగోలుకు కూడా పాన్ తప్పనిసరి.