నో ప్రాసిక్యూషన్: రూ.25 లక్షల వరకు డిఫాల్టర్లపై కేంద్రం ఊరట
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు నెలకొనడంతో పాటు ఆటో సేల్స్, రియల్ ఎస్టేట్, ఎఫ్ఎంసీజీ సేల్స్ తగ్గిన నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం మరోసారి ఊరట ప్రకటనలతో మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె చిన్న చిన్న ట్యాక్స్ అఫెన్సెస్ విషయంలో శుభవార్త చెప్పారు. చిన్న మొత్తాల్లో పన్ను చెల్లింపుదారులకు కఠిన నిబంధనలు ఉండవని, ఐటీ దాఖలులో జరిగే చిన్న పొరపాట్లకు గతంలో మాదిరి పెద్ద చర్యలు ఉండవన్నారు.
ప్రెస్ మీట్లో నిర్మలా సీతారామన్ ఏం చెప్పారంటే
చిన్న చిన్న పన్ను ఉల్లంఘనలపై ఇక నుంచి ఆదాయపన్ను శాఖ నుంచి ప్రాసిక్యూషన్ వంటి కఠిన చర్యలు ఉండవని చెప్పారు. అర్హులైన కేసులకు మాత్రమే ప్రాసిక్యూషన్ ఉంటుందన్నారు. చిన్న చిన్న ట్యాక్స్ పేయర్స్కు దీని నుంచి ఊరట ఉంటుందని చెప్పారు.
ఇద్దరు సీనియర్ అధికారులతో కూడిన కొలీజియం ఆమోదం తర్వాత మాత్రమే రూ.25 లక్షల లోపు డిఫాల్టర్స్పై ప్రాసిక్యూషన్ ఉంటుందని చెప్పారు. ప్రాసిక్యూషన్కు అంత ఈజీగా అనుమతి ఉండదని తెలిపారు. స్వల్ప పొరపాట్లు లేదా తప్పులకు సంబంధించి ఆదాయపన్ను శాఖ ప్రాసిక్యూషన్ ప్రారంభించదని చెప్పారు. చిన్న మొత్తాల్లో పన్ను చెల్లింపుదారులకు కఠిన చర్యలు ఉండవన్నారు.