భారత్లో దుబాయ్ తరహా మెగా షాపింగ్ ఫెస్టివెల్
న్యూఢిల్లీ: భారత్లో త్వరలో మెగా షాపింగ్ ఫెస్టివెల్ నిర్వహిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు నెలకొనడంతో పాటు ఆటో సేల్స్, రియల్ ఎస్టేట్, ఎఫ్ఎంసీజీ సేల్స్ తగ్గిన నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం మరోసారి ఊరట ప్రకటనలతో మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె దుబాయ్ తరహా షాపింగ్ ఫెస్ట్ అంశంపై మాట్లాడారు.
ప్రెస్ మీట్లో నిర్మలా సీతారామన్ ఏం చెప్పారంటే
ఉత్పత్తిదారులు, వినియోగదారుల మధ్య మార్పిడికి వీలుగా మెగా షాపింగ్ ఫెస్ట్ నిర్వహిస్తామన్నారు. ఈ మెగా షాపింగ్ ఫెస్ట్ మార్చి 2020 నాటికి దేశంలోని నాలుగు కేంద్రాల్లో నిర్వహిస్తామన్నారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్కు వెసులుబాటు కలుగుతుందన్నారు.
మరోవైపు, ఎగుమతులను ప్రోత్సహించేందుకు రూ.50,000 కోట్ల వ్యయంతో కొత్త పథకం తీసుకు వస్తున్నట్లు తెలిపారు. భారత్ ఎగుమతులు ఆగస్ట్ నెలలో 26.13 బిలియన్ డాలర్ల నుంచి 6.5 శాతం క్షీణించిన నేపథ్యంలో కేంద్రం నుంచి భారీ ఊరట ప్రకటన వచ్చింది.
భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు మూడో దశ ఉద్దీపన చర్యలను శనివారం కేంద్రం ప్రకటించింది. నిర్మలా సీతారామన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ద్రవ్యోల్భణం అదుపులో ఉందని చెప్పారు. ఎగుమతులపై పన్ను విషయంలో పునరాలోచించినట్లు తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికం వృద్ధి రేటు ఆశించిన స్థాయిలో ఉందని చెప్పారు.
పారిశ్రామిక ఉత్పత్తి ఆశాజనకంగా ఉందని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారత్ మెరుగుపడిందని, భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్తామని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యంగా ఎగుమతుల రంగానికి పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. వచ్చే అయిదేళ్లలో ప్రస్తుత ఎగుమతులను మూడింతలు చేసి 1 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని చెప్పారు. దీనికి అనుగుణంగా ప్రోత్సాహకాలు ప్రకటించినట్లు తెలిపారు.