చైనాతో ట్రేడ్ వార్పై ట్రంప్ రివర్స్ గేర్, పశ్చాత్తాపపడుతున్నారా?
ఫ్రాన్స్: గత కొంతకాలంగా ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతోంది. వందల బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై పరస్పరం టారిఫ్ పెంచుకుంటున్నారు. ఈ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన సంకేతాలకు ఈ ట్రేడ్ వార్ కూడా ఓకారణం. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చైనాపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్తో అల్పాహార విందు సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి. దీనిపై శ్వేతసౌధం వివరణ ఇచ్చింది.
చైనాపై మరో 5% టారిఫ్ పెంచిన ట్రంప్, అమెరికన్లకు చుక్కలు!
పశ్చాత్తాపపడుతున్నాను కానీ...
చైనాతో వాణిజ్య యుద్ధం విషయంలో పశ్చాత్తాపపడుతున్నానని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ట్రేడ్ వార్కు దిగినప్పటికీ తన వద్ద ప్రతి దానికి ప్రత్యామ్నాయం ఉందని వెల్లడించారు. జీ-7 సదస్సుకు వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల చైనాకు చెందిన 250 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై 25 శాతం నుంచి 30 శాతానికి టారిఫ్ పెంచుతున్నట్లు ప్రకటించారు. 300 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై 10 శాతం నుంచి పదిహేను శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై టారిఫ్ పెంచింది.
చైనాది సిగ్గుమాలిన చర్య
చైనాతో ట్రేడ్ వార్ పైన పశ్చాత్తాపపడుతున్నట్లు చెప్పిన ట్రంప్.. ఈ విషయంలో తగ్గేది లేదని కూడా స్పష్టం చేశారు. చైనా ఇలాగే దూకుడుగా వ్యవహరిస్తే తాను ట్రేడ్ వార్ను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు వెనుకాడే ప్రసక్తి లేదని కూడా హెచ్చరించారు. చైనా చేసిన పని సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు.
చైనాలోని అమెరికా కంపెనీల్ని వెనక్కి రప్పించగలం
చైనాలోని అమెరికా కంపెనీలను వెనక్కి రప్పించే సామర్థ్యం తనకు ఉందని కూడా ట్రంప్ చెప్పారు. కానీ, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య పరిస్థితులు బాగానే ఉండటంతో ఆ దిశగా ఆలోచించడం లేదని స్పష్టం చేశారు. శ్వేతసౌధం అధికారులు కూడా దీనిపై స్పందించారు. చైనాలోని అమెరికా కంపెనీలను వెనక్కి రప్పించగలరని, కానీ అతను అలా చేయడం లేదన్నారు. అంతకుముందు, ట్విట్టర్ ద్వారా ట్రంప్ చైనాలోని అమెరికా కంపెనీలకు పిలుపునిచ్చారు. అమెరికా కంపెనీలు చైనాకు ప్రత్యామ్నాయం చూసుకోవాలని, ముఖ్యంగా అమెరికా నుంచి ఉత్పత్తి చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు.
అందుకే ట్రేడ్ వార్ మొదలు...
శాంతియుత వాణిజ్యం తమ అజెండా అని, జాతీయ అత్యవసర పరిస్థితి విధించేందుకు ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేవని, కానీ మేధాసంపత్తి హక్కులను చైనా దొంగిలించిందని, అందుకే ట్రేడ్ వార్ మొదలైందని ట్రంప్ చెప్పారు. అందుకే అత్యవసర పరిస్థితి విధించాల్సి వచ్చిందని చెప్పారు.
ట్రంప్ పశ్చాత్తాపం అందుకు కాదు...
చైనా విషయంలో పశ్చాత్తాపపడుతున్నట్లు ట్రంప్ ప్రకటన, ఆయన రెండో ఆలోచన చేస్తున్నారా అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో వైట్ హౌస్ స్పందించింది. చైనా ఉత్పత్తులపై అధిక టారిఫ్ విధించినందుకు ఆయన పశ్చాత్తాపపడలేదని వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్ స్టీఫానీ గ్రీషమ్ పేర్కొన్నారు. సుంకాలను మరింత పెంచకపోవడంపై ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారన్నారు.
ప్రతి విషయంలోను సెకండ్ థాట్...
చైనాతో వాణిజ్య యుద్ధాన్ని ఉద్దేశించి ట్రంప్కు ఓ ప్రశ్న ఎదురైంది. ఈ విషయంలో మీకు సెకండ్ థాట్ (మరో ఆలోచన) ఉందా అని ఓ రిపోర్టర్ నుంచి ప్రశ్న వచ్చింది.దానికి ట్రంప్ స్పందిస్తూ... 'యస్, తప్పకుండా, ఎందుకు లేదు' అన్నారు.చైనాతో వాణిజ్య యుద్ధంపై రెండో ఆలోచన ఉందా అని మరో రిపోర్టర్ ప్రశ్నించారు. దానికి ట్రంప్.. తనకు ప్రతి అంశంలోను రెండో ఆలోచన ఉంటుందని తెలిపారు.