కొత్త డిమాండ్: ఆదాయపన్ను రద్దు, FD వడ్డీ పెంపు, లోన్ వడ్డీ తగ్గింపు
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి ఆదాయపన్నును తొలగించాలని కేంద్రప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు 24వ తేదీన మాట్లాడుతూ... ఆదాయపన్ను తొలగించాలని, ఫిక్స్డ్ వడ్డీ రేట్లు పెంచాలని, లోన్ వడ్డీ రేట్లు తగ్గించాలన్నారు. ఈ నిర్ణయాలు ఆర్థిక వృద్ధికి ప్రోత్సాహాన్నిస్తాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఉంది. ఈ ప్రభావం భారత్ పైన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. మందగమనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే ఆదాయపన్నును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆదాయపన్ను సహా మూడింటిని సవరిస్తే..
GDP తిరిగి గాడిలో పడాలంటే పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని సుబ్రహ్మణ్య స్వామి సూచించారు. 'ఫిక్స్డ్ డిపాజిట్స్ (FD)పై వడ్డీరేటును పెంచాలి. అదేవిధంగా లోన్లపై వడ్డీ రేట్లు తగ్గించాలి. ముఖ్యంగా ఐటీని రద్దు చేయాలి.' అని ఆయన పేర్కొన్నారు. ఈ మూడింటిని ఆచరిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందన్నారు. వచ్చే నెల 5న ఆర్థిక పురోగతిపై ఓ పుస్తకాన్ని తీసుకువస్తున్నట్లు తెలిపారు.
9 శాతానికి పరిమితం చేయాలి..
ఫిక్స్డ్ డిపాజిట్ల పైన వడ్డీ రేటును 9 శాతానికి పెంచాలని సుబ్రహ్మణ్య స్వామి సూచించారు. అలాగే రుణాలపై వడ్డీ రేటును కూడా 9 శాతానికి తగ్గించాలని చెప్పారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే, పరిస్థితులు అనుకూలంగా ఉంటాయన్నారు.
చేయాల్సింది ఎంతో ఉంది..
భారత ఆర్థిక వ్యవస్థ కోసం చేయాల్సింది ఎంతో ఉందన్నారు. సెప్టెంబర్ 5న తీసుకువచ్చే పుస్తకంలో ఏమేం చేయాలో వివరించానన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేపట్టిన చర్యలు వృద్ధిని పునరుద్ధరిస్తాయా అని మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన పైవిధంగా సమాధానం చెప్పారు.
ఊతమిచ్చిన నిర్మలా సీతారామన్
ఇటీవల ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. రియల్ ఎస్టేట్ సహా ఇతర రంగాలు కూడా ఆశించిన మేర వృద్ధి సాధించడం లేదు. దీంతో ఆర్థిక మందగమనం భయాలు అందరిలోను కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు ఆర్థికమంత్రి సీతారామన్ సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆటో రంగానికి ఊరట కల్పించారు. బ్యాంకింగ్ వ్యవస్థకు ఊతమిచ్చారు.