జీఎస్టీ షాకింగ్: ఆంధ్రప్రదేశ్లో ఒక్కరి నుంచి రూ.6.45 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: జీఎస్టీ అమలై రెండేళ్లవుతున్నా పన్నుల వ్యవస్థలోని లోపాలను సవరించుకోలేకపోయిందని కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (CAG) తన నివేదికలో వెల్లడించింది. ఇన్పుట్ ట్రాక్స్ క్రెడిట్ (ITC) వినియోగంలో పలు లోపాలు ఉన్నాయని, పన్ను ఎగవేతను అరికట్టేందుకు ప్రవేశపెట్టిన ఈ-ట్యాక్స్ వ్యవస్థ వల్ల ఆశించిన ప్రయోజనం కలగడంలేదని అభిప్రాయపడింది. 2018-19 ఏడాదిలో ఫేక్ ఇన్వాయిస్లకు సంబంధించి అధికారులు రూ.11,251 కోట్ల విలువ కలిగిన 1,620 కేసులు నమోదు చేశారని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోను రూ.2,500 విలువ కలిగిన 535 కేసులు నమోదు చేశారని తెలిపింది. గత రెండేళ్లలో 190 మందికి పైగా అరెస్టులయ్యాయని చెప్పారు.
ఎలక్ట్రిక్ వెహికిల్స్పై జగన్ ఆసక్తి, జపాన్ కాన్సులేట్తో భేటీ
ఏపీ నుంచి రూ.6.49 లక్షల కోట్ల క్లెయిమ్స్
కాగ్ నివేదిక ప్రకారం.. జీఎస్టీ అమల్లోకి వచ్చాక దేశవ్యాప్తంగా 2017 జూలై 1వ తేదీ నుంచి 2018 ఆగస్ట్ 8వ తేదీ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ పన్ను చెల్లింపుదారులు రూ.8.19 లక్షల కోట్ల ఇన్పుట్ ట్రాక్ క్రెడిట్ క్లెయిమ్ దరఖాస్తు పెట్టుకున్నారు. ఇందులో కేవలం ఏపీ నుంచి రూ.6.49 లక్షల కోట్ల క్లెయిమ్స్ ఉన్నాయి. జీఎస్టీ ప్రారంభమైన మొదటి సంవత్సరం అంటే 2017 జూలై 1 నుంచి 2018 జూలై 31 వరకు సీజీఎస్టీ, ఐజీఎస్టీ, ఎస్జీఎస్టీలు కలిపి రూ.11.93 లక్షల కోట్లు వసూలయ్యాయి.
కాగ్ ఆశ్చర్యం
ఇందులో రూ.8.19 లక్షల కోట్లు ITC కింద క్లెయిమ్ చేసుకునేందుకు దరఖాస్తు పెట్టుకున్నారని, ఇది ఆశ్చర్యపరిచినట్లు కాగ్ పేర్కొంది. వసూలైన పన్నుతో పోలిస్తే ట్యాక్స్ పేయర్స్ క్లెయిమ్ చేసుకున్న మొత్తం నిష్పత్తి ఎక్కువగా ఉందని తెలిపింది. దీనిని కాగ్ గత ఏడాది ఆగస్టులో జీఎస్టీఎస్ దృష్టికి తీసుకువెళ్లగా, జరిగిన పొరపాటును గుర్తించి వివరణ ఇచ్చింది.
ఒకే ట్యాక్స్ పేయర్ నుంచి అంత మొత్తమా?
ITC కోసం ఏపీ నుంచి రూ.6.49 లక్షల కోట్ల క్లెయిమ్లలో రూ.6.45 లక్షల కోట్ల క్లెయిమ్ ఒకే ట్యాక్స్ పేయర్ నుంచి జనరేట్ అయినట్లు పేర్కొంది. 2018 జూన్ నెలలో జీఎస్టీఆర్ 3B దాఖలు చేసే సమయంలో సదరు ట్యాక్స్ పేయర్ తప్పుగా క్లెయిమ్ చేశారని, అదే ఏడాది ఆగస్ట్ నెలలో దానిని సరిదిద్దారని తెలిపింది. జూన్ నెలలో వచ్చిన మొత్తం ITC క్లెయిమ్స్లలో ఇతనొక్కడే క్లెయిమ్ చేసిన మొత్తం 79 శాతమని తెలిపింది. ఇలాంటి క్లెయిమ్స్ను అనుమతించడాన్ని ఆక్షేపించింది. దీనిని బట్టి మోసపూరితమైన ITCలను అనుమతిస్తున్నట్లుగా కనిపిస్తోందని పేర్కొంది.