హువావేకు ట్రంప్ ఊరట: నిషేధం ఎత్తివేత, టెక్నాలజీ విక్రయించవచ్చు
వాషింగ్టన్: చైనాకు చెందిన దిగ్గజ మొబైల్ కంపెనీ హువావేపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అలాగే, అమెరికాకు చెందిన కంపెనీలు తమ టెక్నాలజీని చైనీస్ మొబైల్ సంస్థలకు విక్రయించవచ్చునని చెప్పారు. ఇటీవల హువావేపై నిషేధం నేపథ్యంలో ఫేస్బుక్, గూగుల్ వంటి సంస్థలు తమ టెక్నాలజీని నిలిపేస్తామని చెప్పాయి. ఇప్పుడు వాటికి ట్రంప్ అనుమతి ఇచ్చారు.
జపాన్లోని ఒసాకాలో జరుగుతున్న జీ20 సమ్మిట్లో ఆయన ఈ నిర్ణయాన్ని ట్రంప్ వెల్లడించారు. దీని ప్రకారం కంపెనీలు హువావేకు పరికరాలను విక్రయించవచ్చు. ప్రస్తుతం అమెరికా-చైనా చర్చల్లో హువావే ఓ భాగమన్నారు. జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లనంతకాలం దీనిని కొనసాగిస్తారు.
అమెరికా - చైనా వాణిజ్య యుద్ధానికి తాత్కాలిక బ్రేక్
జీ20 సమ్మిట్ నేపథ్యంలో చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్తో ట్రంప్ భేటీ అయ్యారు. ట్రేడ్ వార్ అంశంపై చర్చించుకొన్నారు. దీనిపై హువావే ట్విటర్లో స్పందించింది. తాను హువావేకు అనుమతిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారని, మరోసారి హువావే అమెరికా టెక్నాలజీని కొనుగోలు చేయవచ్చునని పేర్కొంది. మే నెలలో అమెరికా కామర్స్ డిపార్ట్మెంట్ హువావేకు టెక్నాలజీ విక్రయంపై నిషేధం విధించింది. అమెరికా జాతీయభద్రతకు హువావే ముప్పుగా మారడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపింది. ఇప్పుడు ఈ నిషేధాన్ని ఎత్తివేశారు.
ఒసాకాలో ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ... హువావేకు అనుమతిస్తున్నామని, ట్రేడ్ అగ్రిమెంట్ ఏమవుతుందో చూడాలన్నారు. అలాగే, ప్రస్తుతానికి 300 బిలియన్ డాలర్ల చైనీస్ దిగుమతులపై టారిఫ్ విధించమని కూడా చెప్పిన విషయం తెలిసిందే.
అమెరికా ఉత్పత్తులను చైనా కొనుగోలు చేసేందుకు అంగీకరించిందని, అలాగే, చైనా నుంచి కూడా అవసరమైన ఉత్పత్తులను వాషింగ్టన్ దిగుమతి చేసుకుంటుందని ట్రంప్ చెప్పారు.