రూ.10 లక్షల కంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే మీపై ఎంత భారం?
న్యూఢిల్లీ: నల్లధనాన్ని అరికట్టేందుకు, అధిక విలువ కలిగిన నగదు లావాదేవీలను నియంత్రించేందుకు, అలాగే డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు సామాన్యులకు ఇబ్బందులులేని విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం... ఏడాదిలో రూ.10 లక్షల కంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే ట్యాక్స్ విధానాన్ని తీసుకువచ్చేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. వచ్చే నెల ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో దీనిని ప్రస్తావించే అవకాశముంది. దీని వల్ల సామాన్యులకు ఎలాంటి భారం లేదు. ఎందుకంటే ఉదాహరణకు ఓ ఉద్యోగికి నెలకు రూ.85 వేలకు పైగా సంపాదన ఉంటే తప్ప ఏడాదికి రూ.10 లక్షలు అవ్వవు. అంటే ఇది సామాన్యులపై భారం కాదు. ఇక, ఇతర కొనుగోళ్ళు, విక్రయాలు పారదర్శకంగా ఉండేందుకు కూడా ఉపకరిస్తుంది.
చదవండి: అలర్ట్: రూ.10 లక్షల కంటే ఎక్కువ డ్రా చేస్తే ట్యాక్స్.. కేంద్రం షాకింగ్ నిర్ణయం!!
రూ.10 లక్షలకు మించి విత్ డ్రా చేస్తే ఎంత భారం?
ఏడాదికి రూ.10 లక్షలకు మించి బ్యాంకుల నుంచి విత్ డ్రా చేస్తే ఎంత మొత్తం వడ్డీ పడుతుంది, ఏ మేరకు వసూలు చేస్తారో తెలుసా....? పరిమితికి మించి డబ్బులు ఉపసంహరిస్తే 3 శాతం నుంచి 5 శాతం వరకు పన్ను విధించాలని కేంద్రం యోచిస్తోంది. ఏడాదికి రూ.10 లక్షలకు పైగా ఉపసంహరించడం వల్ల రూ.30 వేల నుంచి రూ.50 వేల దాకా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో విత్ డ్రా చేసేవారు రూ.50 వేల వరకు నష్టపోతారు. దీనివల్ల భారీస్థాయి నగదు లావాదేవీలకు అడ్డుకట్ట పడుతుందని మోడీ ప్రభుత్వం భావిస్తోంది.
పేద, మధ్య తరగతిపై భారం లేకుండా
రూ.10 లక్షలకు పైగా నగదు ఉపసంహరణ చాలామంది వ్యక్తులకు, చాలా వ్యాపార సంస్థలకు అవసరముండదని ప్రభుత్వం భావిస్తోంది. ఏ నిర్ణయం తీసుకున్నా... పేద, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బంది కలగకుండా, వారిపై ఎలాంటి భారం వేయకుండా ఉండాలని మోడీ ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. ఈ నిర్ణయంపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోందని తెలుస్తోంది. ప్రధానంగా ఎంత శాతం వడ్డీ విధించాలనే అంశంపై చర్చ సాగుతోందట. 3 శాతం నుంచి 5 శాతం మధ్య ఉండవచ్చునని భావిస్తున్నారు.
అందుకే ఆన్లైన్ బదలీలపై చార్జ్ ఎత్తివేత
ప్రస్తుతం బ్యాంకులు ఆన్లైన్ నగదు బదిలీలపై విధించే ఆన్లైన్ బదలీ సేవలు NEFT, RTGSపై విధించి ఛార్జీలను ఇటీవల ఎత్తివేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ను ప్రోత్సహించడంతో పాటు రూ.10 లక్షలకు పైగా విత్ డ్రాయల్స్పై ఛార్జీ వసూలు చేసే ఉద్దేశ్యంలో భాగంగానే ఈ ఎత్తివేత జరిగిందని చెబుతున్నారు. అలాగే, ఏటీఎం నుంచి చేసే విత్ డ్రాలపై కూడా విధించే ఛార్జీలను సమీక్షించనున్నారు. ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్నాయని, ఇవి చర్చల స్థాయిలో ఉన్నాయని చెబుతున్నారు. బడ్జెట్ నాటికి నిర్ణయం వస్తుందంటున్నారు.
అలాగే, అధిక విలువైన నగదు ఉపసంహరణలు అన్నింటికీ ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనను సైతం పరిశీలిస్తున్నారు. దీనివల్ల వ్యక్తిగత స్థాయిలో పరిశీలన ఉండటంతోపాటు, పన్ను చెల్లింపులపైనా నిఘా ఉంటుందని భావిస్తున్నారు.
గతంలో ఇలా...
2005-08 మధ్యన కరెంట్ అకౌంట్స్ నుంచి రూ.50వేలకు మించి చేసే విత్ డ్రాలపై యూపీఏ ప్రభుత్వం పన్ను విధించింది. కానీ ప్రజాగ్రహంతో వెనక్కి తగ్గింది. 2017లో నాటి సీఎం చంద్రబాబు నేతృత్వంలో డిజిటల్ చెల్లింపులపై ఏర్పాటైన అత్యున్నతస్థాయి కమిటీ నగదు లావాదేవీలపై పన్ను ఉండాలని, భారీ స్థాయి నగదు లావాదేవీలపై పరిమితి ఉండాలని, డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహకంగా కార్డు చెల్లింపులపై ఛార్జీలను పూర్తిగా ఎత్తివేయాలని సూచనలు చేసింది. రూ.50 వేలు, అంతకుమించి విత్ డ్రాలపై బ్యాంకింగ్ నగదు లావాదేవీల పన్ను(బీసీటీటీ) విధించాలని సూచించింది. భారీస్థాయిలో నగదు లావాదేవీలు అరికట్టేందుకు, బ్లాక్ మనీని నిరోదించేందుకు రూ.3 లక్షలకు మించే లావాదేవీలపై నిషేధం విధింపును 207-18 బడ్జెట్లో నాటి ఆర్థిక మంత్రి జైట్లీ ప్రతిపాదించారు. బిల్లు సవరణ ద్వారా దీని పరిమితిని రూ.2 లక్షలకు తగ్గించారు.