అలర్ట్: రూ.10 లక్షల కంటే ఎక్కువ డ్రా చేస్తే ట్యాక్స్.. కేంద్రం షాకింగ్ నిర్ణయం!!
న్యూఢిల్లీ: నల్లధనాన్ని అరికట్టడంతో పాటు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏడాదిలో రూ.10 లక్షల కంటే ఎక్కువ క్యాష్ విత్ డ్రా చేసుకుంటే వారిపై పన్ను విధించే అంశంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. అంతేకాదు, ఎక్కువ మొత్తం విత్ డ్రా చేసుకోవడానికి ఆధార్ ధృవీకరణ తప్పనిసరి చేయాలని యోచిస్తోందని తెలుస్తోంది.
రూ.50 కోట్ల టర్నోవర్కు ఇ-ఇన్వాయిస్, ఈ ఇక్కట్లు తప్పినట్టే!
డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించేందుకు
ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. NEFT/RTGS చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేయమని వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై బ్యాంకులకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరగడానికి ఇది దోహదపడనుంది. దీనికి తోడు ఇప్పుడు ఏడాదికి రూ.10 లక్షలకు పైగా డబ్బు విత్ డ్రా చేసుకుంటే ట్యాక్స్ ప్లాన్తో డిజిటల్ ట్రాన్సాక్షన్కు మరింత ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
ఏడాదికి రూ.10 లక్షలకు మించి విత్ డ్రా చేస్తే...
రూ.10 లక్షల కంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే పన్నులు విధించే అంశం ప్రస్తుతం ప్రతిపాదన దశలో ఉంది. దీని సాధ్యాసాధ్యాలపై కేంద్రం కసరత్తు చేస్తోంది. పేద, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందుకే రూ.10 లక్షల విత్ డ్రాను పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఈ లెక్కన నెలకు సరాసరిన రూ.90 వేలకు పైగా విత్ డ్రా చేసుకోవచ్చు. కాబట్టి పేద, మధ్య తరగతి వారికి ఇబ్బందులు ఉండవు.
యూపీఏకు సెగ
గతంలో యూపీఏ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకొని, ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. బ్యాంకులో నగదు లావాదేవీలపై పన్నులను నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. దీనిపై విమర్శలు వచ్చాయి. ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తింది. దీంతో ఈ పన్నులు ఎత్తివేసింది. మూడేళ్ల క్రితం డిమోనటైజేషన్ సమయంలోను విత్ డ్రాలపై పన్నులు వసూలు చేయాలనే ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, ఇప్పుడు సామాన్యులకు ఇబ్బంది కలగని క్యాష్ విత్ డ్రా పైన పన్ను విధించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది.
బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశం
ఎక్కువమంది ఇండివిడ్యువల్స్, వ్యాపారులకు ఏడాదికి రూ.10 లక్షల విత్ డ్రా అంటే ఎక్కువేనని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే మెజార్టీ ఈ మొత్తాని కంటే తక్కువ విత్ డ్రానే చేసుకుంటుంది. జూలై 5వ తేదీన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లో ఆమె రూ.10 లక్షల కంటే ఎక్కువ విత్ డ్రాపై పన్నుల అంశంపై ప్రకటన చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. NEFT/RTGS ఛార్జీలు తొలగించినప్పుడు, డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సహిస్తున్న సమయంలో రూ.10 లక్షల మొత్తం విత్ డ్రా చేయాల్సిన అవసరం ఏముందని అంటున్నారు.
ఆధార్ అథంటికేషన్
మరోవైపు, ఎక్కువ మొత్తం క్యాష్ విత్ డ్రాకు ఆధార్ అథంటికేషన్ తప్పనిసరి చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా ఇండివిడ్యుయల్స్ ట్యాక్స్ రిటర్న్స్ను టాలీ చేసేందుకు సులభం కానుందని భావిస్తోంది. రూ.50,000 పైన చేసే డిపాజిట్స్కు పాన్ కార్డు అనుసంధానించి ఉంటుంది. అలాంటి సమయాల్లో ఆధార్ కార్డ్ వివరాలు తీసుకుంటారు. అయితే ఇక ముందు దీనిని ధృవీకరించుకుంటారు. ఆధార్ నెంబర్ను మిస్ యూజ్ చేయకుండా OTP పంపిస్తారు.
నాడు చంద్రబాబు సూచనలు...
2016లో నాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని చీఫ్ మినిస్టర్స్ ప్యానెల్ కేంద్రానికి ఓ సూచన చేసింది. రూ.50,000 కంటే ఎక్కువ చేసే విత్ డ్రా పైన ఛార్జీలు వసూలు చేయాలని సూచించింది. క్యాష్ను తగ్గించేందుకు కూడా పలు సూచనలు చేసింది. అయితే అప్పుడు క్యాష్ విత్ డ్రా ట్యాక్స్ను అమలు చేయలేదు.