నరేంద్ర మోడీ ముందు సవాళ్లు: ఈ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చా?
ప్రధాని నరేంద్ర మోడీ రెండోసారి అధ్భుత విజయం సాధించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 2014లోని సీట్ల కంటే ఎక్కువగా సాధించింది. స్వతంత్ర భారతదేశంలో సంపూర్ణ మెజార్టీతో వరుసగా రెండోసారి గెలిచిన కాంగ్రెస్సేతర పార్టీ బీజేపీ. గత మూడున్నర దశాబ్దాలుగా సంపూర్ణ మెజార్టీ వచ్చిన ఏకైక పార్టీ బీజేపీ. అయితే ఇప్పుడు ప్రధాని మోడీ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. మందగింపు సంకేతాలు, పలు కీలకమైన సెక్టార్లలో వృద్ధి రేటు, పలు రంగాల్లో ఉద్యోగాల సృష్టి వంటి ఎన్నో టాస్క్లు మోడీ ముందు ఉన్నాయి.
కొత్త రేషన్ కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
మోడీ ముందు ఉన్న సవాళ్లు ఇవే!
మోడీ ప్రభుత్వం ముందు ఉన్న మొదటి, అతిముఖ్యమైన టాస్క్ ఉద్యోగాల డేటా రిలీజ్, ఉద్యోగాల సృష్టి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు కాస్త మందగించిందని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. క్రెడిట్, జాబ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే మూడు పెద్ద టాస్క్లు ఈ ప్రభుత్వం ముందు ఉన్నాయని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగతున్నాయి. ఇంధనంపై ఎక్కువగా ఆధారపడే భారత్పై ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇది మోడీకి పెను సవాల్. రూరల్ డిమాండ్ కూడా సవాలే. వాణిజ్య యుద్ధ భయాలు ఆంతర్జాతీయ మార్కెట్ను కుదిపేస్తున్న నేపథ్యంలో ఎగుమతుల విషయంలో ఆందోళన ఉంది.
భారత్ అందిపుచ్చుకోవాలి
గత బడ్జెట్లు వినియోగాన్ని పెంచేలా చేశాయి. ప్రభుత్వం ద్రవ్యలోటుకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలి. అలా చేస్తేనే ఆర్థిక వ్యవస్థ రాణిస్తుంది. మార్కెట్లు బాగుంటాయి. ఎన్నికల తర్వాత విధానాలపై ఎక్కువ దృష్టి సారించాలి. ప్రభుత్వ బ్యాంకులకు మూలధన పునర్మిర్మాణం చేయాలి. తద్వారా వృద్ధికి ఊతమివ్వాలి. ఎగుమతులకు ప్రోత్సాహం ఇవ్వాలి. అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం అంతర్జాతీయ ఐటీ రంగంపై ప్రభావం చూపుతోంది. దీనిని అందిపుచ్చుకోవాలి. బీజేపీకి వచ్చిన మెజార్టీ చూస్తే ఆర్థిక, విధానపరమైన అంశాలకు పరిష్కారం లభిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
షేర్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారా.. కాస్త ఆగండి...
స్థిరమైన ప్రభుత్వం వచ్చింది.. పైగా మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి మార్కెట్లకు పండుగ. 2014లో బీజేపీ గెలిచిన సమయంలో కొన్ని కంపెనీల్లో షేర్లు పెట్టిన వారు ఇప్పుడు భారీగా లాభపడ్డారు. మోడీ వస్తే ఆర్థిక వ్యవస్త బాగుంటుందనే అంచనాతో మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు, నిన్న మోడీ గెలిచినప్పుడు మార్కెట్లు రికార్డులు సృష్టించాయి. అంటే గెలుపు ప్రభావం సూచీలపై కనిపించింది. కానీ షేర్లలో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ఆలోచించాల్సి ఉంటుంది. కొద్ది రోజులు ఆగడం మంచిది. ఫలితాల సమయంలో రికార్డులు సృష్టించిన మార్కెట్లు ఆ తర్వాత కాస్త చల్లబడ్డాయి. కాబట్టి కొద్ది రోజులు ఆగడం మంచిదని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. అయితే దీర్ఘకాలానికి మాత్రం సానుకూలంగానే ఉంటాయని చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు నిన్ననే వచ్చినందున ఇన్వెస్టర్లు కాస్త వేచి చూస్తే మంచిదని చెబుతున్నారు. కొన్ని షేర్లు స్వల్పకాలం రాణించవచ్చు. కాబట్టి వేచిచూసే ధోరణి అవలంభించడమే మంచిదని అంటున్నారు. స్థిరత్వం రావాడానికి కొద్ది రోజులు పడుతుందని, ప్రస్తుతం మార్కెట్లపై ఎన్నికల ప్రభావం ఉందని చెబుతున్నారు.