Modi 2.0: మీ పర్సనల్ ఫైనాన్స్పై ఎలా ప్రభావం పడుతుంది?
ప్రధాని నరేంద్ర మోడీ బంపర్ మెజార్టీతో రెండోసారి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. 272 మేజిక్ ఫిగర్. బీజేపీ ఒంటరిగా 303 సీట్లు గెలుచుకుంది. మిత్రపక్షాలతో కలిపి 350కి పైగా స్థానాలు దక్కించుకుంది. మోడీ రెండో టర్మ్ మన పర్సనల్ ఫైనాన్స్ పైన ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి. ఆదాయ పన్ను, హౌసింగ్ స్కీం, పెన్షన్ స్కీం, ఆధార్ సంబంధ సవరణలు, డిజిటల్ పేమెంట్ ప్రభావం పడనుంది. అది ఎలా పడుతుందో తెలుసుకుందాం....
మోడీ ముందు సవాళ్లు: షేర్లు కొనాలనుకుంటున్నారా.. జాగ్రత్త!!
మధ్య తరగతికి ఆదాయపన్ను ఊరట
2019 ఫిబ్రవరి 1న పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో మధ్యతరగతి కుటుంబాలకు ఆదాయపన్నుపై శుభవార్త చెప్పారు. ఇన్కం ట్యాక్స్ పరిమితి రూ.5 లక్షలకు పెంచారు. వ్యక్తిగతంగా ఐదు లక్షల రూపాయలు ఆర్జిస్తున్న వారికి పూర్తి ట్యాక్స్ రిబెట్ కల్పిస్తున్నట్లు తెలిపారు. దీని వల్ల మూడు కోట్ల మందికి పైగా పన్నుదారులకు లబ్ధి చేకూరనుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై టీడీఎస్ను 10వేల నుంచి 40వేలకు పెంచారు. 5 లక్షల శ్లాబ్ నిర్ణయాన్ని కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తామని అప్పుడే చెప్పారు.
ఇన్కం ట్యాక్స్ లా
కొత్త డైరెక్ట్ ట్యాక్స్ చట్టం లేదా కోడ్ కోసం 2017లో మోడీ ప్రభుత్వం కొత్త టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. గత 50 ఏళ్లుగా ఉన్న ఇన్కం ట్యాక్స్ యాక్ట్ స్థానంలో సరికొత్త యాక్ట్ కోసం దీనిని నియమించింది. ఈ టాస్క్ఫోర్స్ తన నివేదికను ఫిబ్రవరి 28, 2019 నాటికి చెల్లించవలసి ఉంది. ఆ తర్వాత ఈ డెడ్ లైన్ను మే 31వ తేదీకి పెంచారు. ఈ నేపథ్యంలో ఈ టాస్క్ ఫోర్స్ మరికొద్ది రోజుల్లో.. మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక నివేదికను సమర్పించనుంది.
ఆధార్
మోడీ ప్రభుత్వం ప్రారంభంలో పలు సేవలకు ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది. ఐటీఆర్ ఫైలింగ్, పాన్కార్డ్ దరఖాస్తు, మొబైల్ కనెక్షన్, బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ వంటి వాటికి ఆధార్ తప్పనిసరి చేశారు. అయితే సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో బ్యాంక్ అకౌంట్, మొబైల్ ఫోన్ వంటి వాటికి ఆధార్ తప్పనిసరి కాదు. ఆధార్ లాను సవరించేందుకు మోడీ ప్రభుత్వం లోకసభలో బిల్లు తీసుకు వచ్చింది. ఆధార్ కార్డు హోల్డర్ దీనిని కేవైసీ పర్పస్ కోసం స్వచ్చంధంగా ఉపయోగించడమే లక్ష్యంగా ఈ చట్టం చేయనున్నారు. ఈ బిల్లు ఇప్పటికే లోకసభలో పాస్ అయింది. రాజ్యసభలో పాస్ కావాల్సి ఉంది.
PMVVY పొడిగించే అవకాశం
నరేంద్ర మోడీ ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ కోసం ప్రధానమంత్రి వాయ వందన యోజన (PMVVY) పథకాన్ని తీసుకు వచ్చింది. ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లు కనీసం రూ.1.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆ తర్వాత నెల నెల పింఛన్ ఇస్తారు. పెట్టిన సొమ్ముకు తగినట్లు పింఛన్ చెల్లింపు ఉంటుంది. నెలకు రూ.1000 నుంచి రూ.5వేల దాకా పింఛన్ వస్తుంది. నెల నెలా వద్దనుకుంటే మూడు నెలలకు, ఆరు నెలలకు, సంవత్సరానికి ఒకేసారి పించన్ తీసుకోవచ్చు. ఈ పథకంలో చేరేందుకు 31 మార్చి 2020 దాకా మాత్రమే సమయం ఉంది. అయితే ఇఫ్పుడు మోడీ ప్రభుత్వం తిరిగి గెలిచినందున దీనిని పొడిగించే అవకాశాలు ఉన్నాయి.
హోమ్ లోన్ సబ్సిడీ స్కీం పెంపొందించే ఛాన్స్
మధ్య తరగతి వారి(MIG) హోమ్ లోన్ కోసం తీసుకు వచ్చిన క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీం (CLSS) మార్చి 2020న ముగియనుంది. డిసెంబర్ 30, 2017 నాటికి దాదాపు 3.4 లక్షలకు లబ్ధి చేకూరిందని కేంద్రమంత్రి గతంలో తెలిపారు. ఆ తర్వాత దీనిని డిసెంబర్ 31, 2018కి, అనంతరం మార్చి 31, 2020కి పొడిగించారు. ఇప్పుడు తిరిగి మోడీ ప్రభుత్వమే వచ్చినందున మళ్లీ పొడిగించే అవకాశాలు ఉన్నాయి.