Huawei పై ట్రంప్ ఆగ్రహం వెనుక..: సీఈవో కూతురు అరెస్ట్ నుంచి.. ఏం జరిగిందంటే?
చైనా టెలికం దిగ్గజం హువావేపై అమెరికా ఆంక్షల మీద డ్రాగన్ దేశం చైనా మండిపడింది. చైనా, తమ దేశ సంస్థల వ్యాపార హక్కులు, ప్రయోజనాలు కాపాడేందుకు బీజింగ్ అవసరమైన చర్యలు తీసుకుంటుందని చైనా ఫారెన్ మినిస్ట్రీ హెచ్చరించింది. చర్చలు, సంప్రదింపులు అర్థవంతంగా, నిజాయితీగా ఉండాలన్నారు. మొదట పరస్పర గౌరవం, సమానత్వం, పరస్పర ప్రయోజనాలు ఉండాలని, రెండోది, మాట మీద నిలబడాలని, సొంత ప్రయోజనాలు మాత్రమే చూసుకోవద్దని మండిపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. విదేశీ శత్రువుల నుంచి దేశంలోని కంప్యూటర్ నెట్వర్క్కు ముప్పు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొన్నారు. చైనాకు చెందిన హువావేని దృష్టిలో పెట్టుకోని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల అమెరికా, దాని మిత్రదేశాలు హువాయి.. చైనా కోసం గూఢచర్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనికి తోడు అమెరికా హువావే 5జీ నెట్వర్క్ను వినియోగించ వద్దని మిత్రదేశాలపై తీవ్రమైన ఒత్తిడి తెస్తోంది.
ట్రంప్ సంచలన నిర్ణయం, అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ: చైనీస్ హువావేపై నేరుగా యుద్ధం
T Mobile తాపీ ఆర్మ్ చోరీ
స్మార్ట్ ఫోన్ల వినియోగం నేపథ్యంలో కంపెనీలు పరిశోధనల కోసం పోటీ పడుతున్నాయి. ఇదే సమయంలో T Mobile తాపీ పేరుతో ఓ రోబో ఆర్మ్ను తయారు చేసింది. దీని వెళ్లు మనిషి వెళ్లలా పని చేస్తాయి. కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చే ముందు తాపీ ద్వారా దీనిని టెస్ట్ చేస్తారు. ఓ మనిషి ఫోన్ను వినియోగించినట్లు తాపీ కూడా అలా వినియోగిస్తుంది. అలా పరీక్షిస్తారు. హువావేకు చెందిన స్మార్ట్ ఫోన్లను తమ ల్యాబ్లో పరీక్షించుకునేందుకు T Mobile అనుమతి ఇచ్చింది. ఇదే సమయంలో తామే ఓ సొంత రోబో తయారు చేయాలని భావించింది హువావే.
హువావే సీఈవో కూతురు మెంగ్ అరెస్ట్
ప్లాన్లో భాగంగా ఏడేళ్ల క్రితం (2012) అమెరికాలోని తమ ఉద్యోగులు T Mobile ల్యాబ్లోకి వెళ్లి పరీక్షలు చేసుకునేలా అనుమతులు తీసుకుంది. అదే సమయంలో తాపీ ఆర్మ్ సాంకేతికతను తీసుకురావాలని ఆ ఉద్యోగులపై ఒత్తిడి చేసింది. T Mobile ఉద్యోగులను అడిగి తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. ఇది గుర్తించిన T Mobile.. హువావే ఉద్యోగులను తమ ల్యాబ్లోకి రాకుండా నిషేధించాలని భావించింది. ఆ సమయంలో హువావే చైనాకు చెందిన తమ ఇంజినీర్ను ఉద్యోగులతో కలిపి T Mobile ల్యాబ్కు పంపించి ఫోటోలు, టెక్నాలజీ సమాచారం సేకరించింది. ఆ తర్వాత మరో ఉద్యోగు రోబో ఆర్మ్ ఒక దానిని ఇంటికి తీసుకెళ్లి సమాచారాన్ని దొంగిలించాడు. మరుసటి రోజు T Mobileకు అప్పగించాడు. దీంతో హువావే ఉద్యోగులను T Mobile బ్యాన్ చేసింది. హువావేకు చెందిన ఓ షెల్ కంపెనీ ద్వారా అమెరికా టెక్నాలజీని ఇరాన్కు విక్రయిస్తోందని తేలింది. ఇవి తేలడంతో హువావే సీఎఫ్ఓ మెంగ్ను అప్పుడు అదుపులోకి తీసుకున్నారు. ఆమె (మెంగ్) తండ్రి హువావే సీఈవో రెన్ జెంగ్ఫీ. ఇతను చైనా కమ్యూనిస్ట్ పార్టీకి సన్నిహితుడు.
ఏం జరిగిందంటే
హువావేపై ట్రంప్ చర్యలకు చాలా పెద్ద కారణమే ఉందంటున్నారు. అమెరికాకు చెందిన T Mobile రోబో ఆర్మ్ను హువావే దొంగిలించిన ఆరోపణలు వచ్చాయి. అమెరికా టెక్నాలజీని ఇరాన్కు అమ్మేందుకు దీనిని చోరీ చేశారని చెబుతున్నారు. చైనాకు చెందిన హువావే సంస్థకు T Mobile అమెరికా వ్యాపార భాగస్వామి. T Mobileకు చెందిన తాపీ (Tappy) అనే రోబో ఆర్మ్కు సంబంధించిన టెక్నాలజీని హువావే దొంగిలించిందని ఆరోపణలు వచ్చాయి. దీనిని మొబైల్ ఫోన్లను పరీక్షించేందుకు ఉపయోగిస్తారు. హువావే ఉద్యోగులు ఈ రోబో టెక్నాలజీని, ఫోటోలను చైనాకు తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ టెక్నాలజీ అందించిన ఉద్యోగులకు హువావే భారీ నజరానా ఇచ్చిందట. పైగా అమెరికన్ బ్యాంకులను మోసగిస్తూ ఇరాన్కు పరికరాలను విక్రయిస్తుందనే ఆరోపణలు హువావేపై ఉన్నాయి.