అమెరికాకు షాకిచ్చిన చైనా, అయినా అగ్రరాజ్యానికి వచ్చిన నష్టం లేదు!
అమెరికా - చైనా మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతోంది. 200 బిలియన్ డాలర్ల దిగుమతులపై అమెరికా పన్ను విధించింది. మరో 300 బిలియన్ డాలర్లపై కూడా ట్రంప్ ప్రభుత్వం అధిక పన్నుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చైనా కూడా ఊహించని నిర్ణయం తీసుకుంది. అమెరికా నుంచి దిగుమతి అవుతున్న 60 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై జూన్ 1వ తేదీ నుంచి అధిక టారిఫ్ విధించాలని డ్రాగన్ దేశం కూడా నిర్ణయించింది.
ప్రస్తుతం అమెరికా నుంచి వస్తున్న చాలా ఉత్పత్తులపై చైనా కేవలం 5 శాతం టారిఫ్ విధిస్తోంది. త్వరలో వీటిపై 25 శాతం పన్ను విధించాలని చైనా నిర్ణయించింది. ఈ మేరకు టారిఫ్ పాలసీ కమిషన్ ఆఫ్ ది స్టేట్ కౌన్సెల్ ప్రకటన చేసింది.
చైనా భయపడదు: ట్రంప్ బెదిరింపులకు డ్రాగన్ కంట్రీ
తాము 5,140 అమెరికా ఉత్పత్తులపై టారిఫ్ విధిస్తామని చైనా ఫైనాన్స్ మినిస్ట్రీ తెలిపింది. 60 బిలియన్ డాలర్ల అమెరికా ఉత్పత్తులపై తాము 25 శాతం, 20 శాతం, 10 శాతం చొప్పున టారిఫ్ విధించనున్నట్లు తెలిపింది.
ఓ వైపు ట్రేడ్ వార్ కొనసాగుతుండగా, మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ను వచ్చే నెలలో కలుస్తున్నామని తెలిపాడు. అంతకుముందేమో చైనాకు హెచ్చరికలు జారీ చేశాడు. ట్రేడ్ వార్ పైన ఇప్పుడే చర్చలు జరగాలని, ఆలస్యం చేస్తే చైనా బాగా దెబ్బతింటుందని ట్రంప్ అన్నాడు. అయితే, చైనా కూడా ధీటుగానే స్పందించింది. చైనా ఎన్నటికీ ఎవరికీ లొంగిపోదని వాణిజ్య శాఖ పేర్కొంది. ఓ వైపు చర్చలు అంటూనే, మరోవైపు ప్రపంచంలోని రెండు దిగ్గజ ఆర్థిక శక్తుల మధ్య శుక్రవారం ట్రేడ్ వార్ తారస్థాయికి చేరుకుంది.
అధికారిక సమాచారం మేరకు, గత ఏడాది అమెరికాకు చైనా 539.5 డాలర్ల ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అదే సమయంలో అమెరికా నుంచి డ్రాగన్ దేశానికి దిగుమతి అయిన ఉత్పత్తులు 120 బిలియన్ డాలర్లు మాత్రమే. అంటే రెండు దేశాల మధ్య 660 బిలియన్ డాలర్ల వాణిజ్యం కొనసాగుతోంది.
ఇప్పటికే అమెరికాకు చెందిన 90 శాతానికి పైగా ఉత్పత్తులపై చైనా టారిఫ్ వసూలు చేస్తోంది. ఇప్పుడు అమెరికా... చైనాపై టారిఫ్లు విధిస్తోంది. అమెరికాపై ప్రతీకారంతో చైనా టారిఫ్లు విధించినా అగ్రరాజ్యానికి వచ్చే నష్టమేమీ పెద్దగా ఉండదని అంటున్నారు. ఇప్పటికే ఎక్కువ ఉత్పత్తులపై టారిఫ్ విధించడమే అందుకు కారణం. అమెరికా 500 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై టారిఫ్ విధిస్తుండగా, చైనా ప్రతీకారంగా కేవలం 60 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై పన్ను పెంచనున్నట్లు ప్రకటించింది.