'ఇరాన్' దెబ్బ, బీజేపీకి షాక్: భారత్లో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల?
ఇరాన్ నుంచి ముడిచమురు దిగుమతి చేసుకుంటే కఠినచర్యలు ఉంటాయని భారత్ సహా 8 దేశాలకు అమెరికా అల్టిమేటం జారీ చేసింది. ఇప్పటి వరకు ఇచ్చిన రాయితీలను ఇక కొనసాగించేది లేదని, ఈ 8 దేశాలకు ఇస్తోన్న రాయితీని మే నెల నుంచి పొడిగించలేమని అమెరికా ప్రకటించింది. దీంతో ముడిచమురు ధరలు పెరిగే అవకాశముంది. అణ్వాయుధాలు, బాలిస్టిక్ మిసైల్స్ తయారీలను ఇరాన్ విరమించుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా ఇచ్చిన డెడ్ లైన్ మే 2వ తేదీన ముగియనుంది. ఆ లోగా ఇరాన్ నుంచి దిగుమతి అయ్యే చమురు సున్నా శాతంగా ఉండాలి. అమెరికా నిర్ణయంతో ఆయిల్ ధరలు పెరిగాయి. భారత్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి ఇది ఇబ్బందికరపరిణామమే.
ఇరాన్పై అష్టదిగ్బంధనం: భారత్కు షాకిచ్చేలా డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం, ధరలు పైపైకి!
ఇరాక్పై ఆంక్షల ప్రభావం
అమెరికా నిర్ణయంతో సోమవారం బ్యారెల్ ధర 74 డాలర్లకు చేరుకుంది. గత ఆరు నెలలతో పోలిస్తే ఇది అత్యధికం. ఇరాన్ నుంచి సరఫరా తగ్గుతుందనే, దీంతో ఆయిల్ షార్టేజ్ అవుతుందనే ఆందోళన ఈ ధరల పెరుగుదలకు కారణం. దిగుమతులను పూర్తిగా నిలిపివేసేలా ఈ ఎనిమిది దేశాలపై ఒత్తిడిని పెంచుతామని అమెరికా విదేశాంగ మంత్రి మైఖేల్ ఆర్ పాంపియో చెప్పారు. స్పష్టంగా చెబుతున్నానని, మీరు దీనికి కట్టుబడకపోతే ఆంక్షలు ఉంటాయని భారత్, చైనా సహా ఎనిమిది దేశాలకు స్పష్టం చేశారు. ఇరాన్ నుంచి సరఫరా ఆగిపోతే ప్రత్యామ్నాయం కోసం సౌదీ అరేబియా, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్తో చర్చిస్తున్నామని పేర్కొన్నారు. ఇరాన్ నుంచి చమురు దిగుమతి ప్రభావం ప్రభావం భారత్ సహా అన్ని దేశాలపై పడనుంది.మినహాయింపులు ఇవ్వనంతవరకు ఇరాన్ నుంచి భారత్ ముడి చమురును కొనుగోలు చేయదని, ఇప్పటికే ఆ దేశం నుంచి ఆయిల్ దిగుమతిని నిలిపివేశామని ఓ అధికారి పేర్కొన్నారు.
ఆయిల్ ధరల పెరుగుదల.. ప్రభుత్వానికి ఇబ్బందికరం
తాజా పరిస్థితిపై ఇండియన్ ఆయిల్ కంపెనీలు, అధికారులు స్పందిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు. మే, జూన్ నెలలకు గాను చమురు కొరత లేకుండా ఇప్పటికే సప్లై కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. సరఫరాకు అంతరాయం ఉండదని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఆఫీసర్ ఒకరు చెప్పారు. అయితే, ధర మాత్రం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. అంటే మే నెల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతోకొంత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయ పరిణామాలు ప్రస్తుత ప్రభుత్వానికి ఇబ్బందికరమే.
ఇరాన్తో ఒప్పందంపై డైలమా
ఇరాన్ నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ 24 మిలియన్ టన్నుల క్రూడాయిల్ దిగుమతి చేసుకుంది. ఇందులో ఇండియన్ ఆయిల్ 9 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకుంది. కువైట్, అబుదబి, సౌదీ అరేబియా తదితర దేశాల నుంచి అదనపు చమురును కోరింది. ఇండియన్ ఆయిల్తో పాటు మంగళూరు రిఫైనరీ, భారత్ పెట్రోలియంలు కూడా ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున ముడి చమురును దిగుమతి చేసుకుంటాయి. అమెరికా ఆంక్షల నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఇండియన్ ఆయిల్ కంపెనీలు ఇంకా యాన్యువల్ టర్మ్ డీల్ పైనలైజ్ చేసుకోలేదు.