నరేంద్ర మోడీ పాలన: తొలి ఏడాది, ఇప్పుడు చమురు దిగుమతులు ఇలా..
భారత్ సహా ఎనిమిది దేశాలకు ఇబ్బంది కలిగించేలా అమెరికా ముందుకు వెళ్తోంది. ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునేందుకు ఏ దేశానికి మినహాయింపు ఇవ్వమని, ఇరాన్ ముడి చమురు ఎగుమతులపై ఇక నుంచి ఇస్తున్న రాయితీలు ఇచ్చేది లేదని అమెరికా తేల్చి చెప్పింది. ఇది భారత్ సహా అన్ని దేశాలకు ఆందోళన కలిగిస్తోన్న అంశం. అయితే ఇందుకు ప్రత్యామ్నాయం చూపిస్తామని పెద్దన్న చెబుతోంది. ఏమయినప్పటికీ ఇది భారత్కు ఆందోళనకర అంశం.
మే నెల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం
ఈ నేపథ్యంలో గత అయిదేళ్లలో నరేంద్ర మోడీ హయాంలో ఇండియన్ ఆయిల్ ఎకానమీ ఎలా మారిందో ఓసారి చూద్దాం. ఎన్డీయే ప్రభుత్వం తొలి ఏడాది భారత్కు దిగుమతి అయ్యే ముడిచమురు వాటా ఆరు శాతంగా ఉంది. ఇప్పుడు అది దాదాపు రెండింతలు ఉంది.
2014-15లో ఇరాన్ నుంచి భారత్ దిగుమతి అయిన ముడి చమురు 6 శాతం. 18.4 శాతంతో సౌదీ అరేబియా అగ్రస్థానంలో ఉంది. ఇరాన్ 7వ స్థానంలో ఉండేది. ప్రస్తుతం ఇరాన్ 3వ స్థానంలో ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలోని తొలి పది నెలల దిగుమతిని చూస్తే ఇరాన్ 11.3 శాతంతో మూడో స్థానంలో ఉంది. ఇరాన్ కంటే ముందు ఇరాక్, సౌదీ అరేబియా ఉన్నాయి. సౌదీ అరేబియా ఆయిల్ ప్రొడక్షన్ కట్ చేసిన సమయంలో ఇరాక్, ఇరాన్లు చమురు అందించాయి.
2014-15లో భారత్ ముడిచమురు దిగుమతిలో వెనిజులా 12.1 శాతంతో మూడో స్థానంలో ఉంది. కానీ 2019 జనవరి నాటికి 7.6 శాతంతో అయిదో స్థానానికి పడిపోయింది. ఇందుకు వెనిజులా రాజకీయ పరిస్థితులు, అమెరికా కారణం.